డాంభికం తో తలనొప్పులు

డాంభికం తో తలనొప్పులు


తనలో లేని లక్షణాలని చెప్పుకోవడం దంభం.  అదే డాంబికం.  భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించిన ఇరవై విలువలలో రెండోది అదంభిత్వం.  అంటే డాంబికం లేకపోవడం.

మొదట మనం చూసిన ‘మానిత్వం’ లో కూడా గొప్పలు చెప్పుకుంటారు.  కానీ, ఈ రెండింటి మధ్య చిన్న తేడా ఉంది.  మానిత్వమున్న వ్యక్తిలో ఏవో కొన్ని సామర్థ్యాలు ఉంటాయి.  వాటిని గోరంతలు కొండంతలు చేసి, చెప్పుకోడానికి తాపత్రయ పడుతూ ఉంటారు.  కానీ, దంభం అనే అవగుణం ఉన్న వాడికి నిజంగా చెప్పుకోవడానికి ఏ సామర్థ్యమూ  ఉండదు.  విచిత్రమేమిటంటే ఏ గొప్పదనమూ తన వద్ద లేదని తెలిసినా కూడా తన గురించి తాను ఎక్కువగా చెప్పుకుని, అందరి దృష్టిని ఆకర్షించాలని తెగ తపన చెందుతుంతాడు.  చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా, ఆగర్భ శ్రీమంతుడిలా చెప్పుకుంటూ ఉంటారు.  అలాగే, నాకు పలు భాషలు తెలుసుననీ, పుంఖానుపుంఖాలుగా పుస్తకాలు రాసేశానని గొప్పలు చెబుతారు ఇంకొందరు.  నిజానికి, వేరే వారు వ్రాసిన పుస్తకాలకు డబ్బులిచ్చి, తమ పేరు పెట్టించు  కుంటారు. లేదా, గ్రంథ చౌర్యం చేసి, తమ పేరుతొ ముద్రించు కుంటారు.  ఎవ్వరూ ఇవ్వకపోయినా, కొన్ని బిరుదులను వారే తగిలించుకుని మురిసిపోతుంటారు.  అందరూ తనను ఆ బిరుదులతోనే గుర్తించాలని తెగ ఉక్కిరి బిక్కిరై పోతుంటారు.
ఇంతకూ, ఈ దంభం ఉన్న వారి గురించి లోతుగా పరిశీలిస్తే, వారిలో ఏ గొప్పా లేదన్న విషయం వారికి బాగా తెలుసు.  వారిలో వారికే నచ్చని, ఎవరూ మెచ్చని గుణాలున్నాయని కూడా వారికి ఇంకా బాగా తెలుసు.  అయినా, వాటిని కప్పి పుచ్చుకుని బయటకు ప్రగల్భాలు పలుకుతూ, చలామణి అయిపోదామని చూస్తుంటారు.  సందు దొరికినప్పుడల్లా వారి గురించి వారు డప్పు కొట్టుకుంటారు.
నన్ను అందరూ గుర్తించాలి.  లేదా కొందరైనా నన్ను పోగుడుతుండాలి.  అలా ఎంతకాలం కోరుకుంటారు.  అయినా, ఎదుటి వాళ్ళు కూడా ఎంత కాలం ఈ భజన చేస్తారు? వాళ్లకు మాత్రం విసుగు పుట్టదా?  ఈ విషయంపై ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుంటే, క్రమేపీ దంభిత్వం తరిగి పోతుంది.
ఈ దంభిత్వంలో ఇంకో ప్రమాదం కూడా పొంచి ఉంది.  ఎదుటి వారు తనని గొప్పగా గుర్తించాలని కోతలు కోస్తూ పోతారు.  ఉన్నవీ లేనివీ అన్నీ తన గొప్పలుగా చెప్పుకుంటూ ఉంటారు.  ముందేం చెప్పారో మరచిపోయి రెండో సారి దానికి భిన్నమైన అంశాలను చెప్పి, ఎదుటి వారికి అడ్డంగా దొరికిపోయే ప్రమాదముంది.  ఈ కోతలు కోయడానికి కూడా జ్ఞాపక శక్తి పుష్కలంగా ఉండాలి.  లేకుంటే, యిట్టే పట్టుబడి పోయే ప్రమాదముంది.  ప్రగల్భాలు పలికేవాడు సమయం, సందర్భం చూసుకోవాలి.  అదే, అందరూ తనను గుర్తించాలనీ, పొగడాలనే ఆలోచనను అధిగమిస్తే చాలు అతడు ఇన్ని జాగ్రత్తలపై దృష్టి సారించనవసరం లేదు.  నిజం చెప్పే వాడిని నిద్రలో లేపి అడిగినా, ఒక్క మాటే చెబుతాడు.
కొందరిలో మానిత్వం, దంభత్వాలు ఉండక పోవచ్చు.  కానీ, వారిలో ఆత్మన్యూనతా భావం ఉండే అవకాశముంది.  పదిమందితో కలవలేకపోవడం, ఎదుటి వారితో నిస్సంకోచంగా మాట్లాడలేక పోవడం, పక్క వారితో బిడియంతో వ్యవహరించడం ఇవన్నీ కూడా వ్యక్తిలో ఆత్మన్యూనతా భావాన్ని ఎత్తి చూపుతాయి.  మానిత్వం, దంభిత్వంతో భేషజాలు పొడచూపుతాయి.  ఆత్మన్యూనతతో బిడియం తలెత్తుతుంది.  ఈ రెండు ఆథ్యాత్మిక సాధకుడికే కాదు, లౌకిక ప్రపంచంలో వ్యక్తిత్వ నైపుణ్యానికి కూడా అవరోధాలే.  వీటిని సరిగ్గా అర్థం చేసుకుని ఎదుగుదలకు పెద్ద పీట  వేయాలి!

No comments:

Post a Comment