🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 🌹

🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము 🌹
✍ రచన : పేర్నేటి గంగాధరరావు
8 వ భాగము

🌴 ఉత్పత్తి ప్రకరణము  🌴
🌻 సృష్టి 🌻

బ్రహ్మతత్వము స్వయం ప్రకాశము. అదియే పరమాత్మ మరియు ఆత్మతత్వము. ఆత్మతత్వము నుండి విష్ణువుదయించెను. విష్ణువు నాభి నుండి బ్రహ్మ జన్మించెను. ఈ ప్రాణులు లాభా లోభములు కల్గి, అల్పాయుష్కులయి, విషయభోగముల వలన, దుఃఖితులై యుండిరి. బ్రహ్మ, వారి కష్టములు గాంచి కరుణించి, వారి మంచి కొరకై చింతించి, వారి దుఃఖ నివారణ కొరకు తపస్సు, ధర్మము, దానము, సత్యము, తీర్ధములను, శుద్ధ సాధనములను సృష్టించెను. అయినను జ్ఞానమొక్కటే జీవుల తరుణోపాయమునకు మార్గమని తెలిపెను. అందుకుగాను బ్రహ్మం, సంకల్ప మాత్రమున బ్రహ్మను సృష్టించెను. నిర్మల స్వరూపియగు వసిష్ఠుని, బ్రహ్మ చంచలమగు నీ మనస్సులో ఒకింత అజ్ఞానము ప్రవేశించుగాక అని శపించెను. అంత వసిష్ఠుని బుద్ధి జడత్వము పొందగా, దీనుడై దుఃఖ శోకముల దగుల్కొనెను. అంతట తన దుఃఖమును గాంచిన బ్రహ్మ తన పుత్రుని సంసార దుఃఖము నుండి తప్పించుటకు, తత్వజ్ఞానముపదేశించెను. తదుపరి వసిష్ఠుడు తత్వజ్ఞానము నిర్మలమగు తత్వ జ్ఞానమున స్ధితుడైనాడు.

అంతట బ్రహ్మ నేను నీ కొసగిన తత్వ జ్ఞానమును ప్రాజ్ఞులగు వారికి బోధించుమని పల్కెను. అంతట వసిష్ఠుడు, నిరహంకారముతో, అభిమానరహితుడై తత్వజ్ఞానమును రామునికి బోధించెను. వసిష్ఠుడు ధర్మార్థ కామమోక్షములు పొందు నిమిత్తమై ఋషులకు స్మృతి శాస్త్రము, యజ్ఞశాస్త్రములు రచించి బోధించెను. కాలక్రమమున జనులు ధనసంపాదన, భోగలాలసులై అందుకొరకు కలహించుచు, యుద్ధములలో మునిగి దీనులు కాదొడగిరి.అపుడు జ్ఞానులైన ఋషులు, ప్రజల దైన్యమును పోగొట్టుటకై ఆత్మతత్వమును ప్రచారము కావించిరి. రాజులు తత్వజ్ఞానమును పొంది దుఃఖరహితులైరి. కాని వివేకవంతులగు తత్వజ్ఞులు, వైరాగ్యమును పొందిరి. అట్లు వైరాగ్యమును పొందిన వారే దుస్తరమగు ఈ సంసార సాగరమును తరింతురు. అందువలన శ్రీరాముని విచారమును పోగొట్టుటకై జ్ఞానమును వసిష్ఠుడు బోధించెను.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్

🌹 పరమాత్మ మనకి దగ్గరా ? దూరమా ? 🌹

🌹 పరమాత్మ మనకి దగ్గరా ? దూరమా ? 🌹
✍సద్గురు శ్రీ చలపతిరావు 🙏

🌻 క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం నుండి 🌻

ఒక వస్తువు స్థూలం అయిన కొద్దీ తెలుస్తుంది. సూక్ష్మం అయిన కొద్దీ తెలియకుండా పోతుంది. భూమి, నీరు, స్థూలం కనుక తెలుస్తుంది. అగ్ని కొంచెం సూక్ష్మం, కనుక తెలుస్తుంది. వాయువు ఇంకా సూక్ష్మం కనుక చర్మానికి తప్ప తెలియదు. ఆకాశం ఇంకా సూక్ష్మం. శబ్ధగుణం వల్ల తెలియాల్సిందే తప్ప ఇక ఏ ఇంద్రియానికి గోచరం కాదు.

పరమాత్మ ఆకాశం కన్నా సూక్ష్మాతి సూక్ష్మం కనుక ఏ ఇంద్రియానికి తెలియదు. బాహ్య దృష్టి గలవారు ఎన్నటికీ తెలుసుకోలేరు. అంతర్దృష్టితో మాత్రమే తెలుస్తుంది.

భగవంతునిపట్ల విముఖులై, ఆయన గురించి తెలుసుకోవాలనే ఆలోచన లేక, ఆయనకు సంబంధించిన పనులు చేయకుండా, నిరంతరం లౌకిక వ్యవహారాలలో మునిగిన వారికి పరమాత్మ చాలా దూరం. కోటి జన్మలకైనా సాధ్యం కాదు.

అదే దూరస్థం.
అలాగాక బాహ్య విషయాల పట్ల ఆసక్తిని విడిచి, ఆ పరమాత్మను అందుకొనుటే ప్రధానంగా భావించి, శ్రవణ, మనన, నిధి ధ్యాసనల ద్వారా నిరంతరం సాధనలతో ఉండేవారికి పరమాత్మ దగ్గర. ఒక్క జన్మ చాలు.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్

🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము - 7 🌹

🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము 🌹
✍ రచన : పేర్నేటి గంగాధరరావు
7 వ భాగము

🌴 ఉత్పత్తి ప్రకరణము  🌴
🌻 5. పురుష ప్రయత్నము - 2 🌻

అదృష్టమును, దైవమును నమ్మి పురుషార్ధమును చేయకున్న, వాడు. ఏమియు సాధించలేడు. దైవమనగా, మనము చేసిన కర్మకు ఏ ఫలము లభించునో అది దైవము, వాటి అనుభవమే దైవము కాని వేరే దైవమెచటను లేదు. ఈ ప్రపంచమున దైవమునకే కర్తృత్వమున్న, పురుష ప్రయత్నమేల. దైవమే స్నాన దాన జపాదుల నొనర్చును. (ఇచట వసిష్ఠుని భావమేమనగా, దైవమనగా అదృష్టము, అదృష్టమనగా దృశ్యముకానిది, దైవము కూడ దర్శనీయము కాదు. అందువలన దైవముపై, అదృష్టముపై ఆధారపడకుండా, పురుష ప్రయత్నముపై మనుజుడు ఆధారపడవలెనని భావము. మనిషి ఆకారము. దైవము ఆకారము లేనిది. అందువలన రెండింటి కలయిక అసంభవము. దైవము, మనిషి కలవాలంటే మనిషి దైవము కావాలి. అనగా బంధనాల నుండి విముక్తి పొందాలి లేదా దైవము ఆకృతి దాల్చాలి. అనగా అవతారమెత్తాలి అని భావము. శూరులు, పరాక్రమవంతులు, బుద్ధిమంతులు, పండితులు అయిన వారు దైవము కొరకు వేచియుండవలసిన అవసరము లేదు. విశ్వామిత్రుడు, అదృష్టముపై ఆధారపడక, పురుషాకారము వలననే బ్రహ్మత్వము పొందినాడు. కుటుంబ పోషణ భోగవిలాసములు మొదలగునవి పురుష ప్రయత్నము వలననే గాని, దైవము వలన పొందుట లేదు. అందువలన ఎవరైనను, దైవముపై గాక పురుష ప్రయత్నముపైననే ఆధారపడవలెను.

అపుడు వసిష్ఠుని శ్రీరాముడిట్లు ప్రశ్నించెను. అసలు దైవమనునది వున్నదా లేదా తెలుపుమని పలికెను. అపుడు వసిష్ఠుడు దైవము ఏమిచేయుట లేదు, ఏమి అనుభవించుట లేదు. ఒక పురుషార్ధము వలననే లోకమున ఫలము లభించుచున్నది. దైవము వలన కాదు. అది కేవలము కర్మఫలము మాత్రమే. వెనుకటి జన్మల లోనివగు వాసనలు, ప్రభోదితములై, కర్మలుగ మారును. జన్మజన్మల సంస్కారముల ననుసరించి, బుద్ధి పనిచేయుటను. బుద్ధిననుసరించి, మనసు పని చేయును. మనసే కర్మలకు కారణము. ఆ కర్మల వలననే ఫలితములు లభించుచున్నవి . అంతేకాని, ఇచట దైవ ప్రసక్తి లేదు. దైవము మిథ్య. కేవలము పురుషాకారమే అభీష్టములన్నియు సిద్ధింపజేయుచున్నది. అదృష్టము వలన గాదు.

జీవుని చిత్తము శిశువువలె చంచలము. దానిని చెడు నుంచి మంచికి త్రిప్పిన, మంచికి మరలును. అలాగే మంచి నుండి చెడుకు మారవచ్చును. అందువలన ప్రయత్న పూర్వకముగ మంచికి మరల్చవలెను. అభ్యాసము వలననే వాసనలు ప్రభలమగుచున్నవి. కనుక మంచి పనుల అభ్యాసము ఫలవంతమగును. మంచి కొరకు పురుష ప్రయత్నము నవలంభించి, శుభములు పొంది, పంచేంద్రియములను జయించవలెను. మొదట శుభ వాసనలను అనుసరించి శోకరహితమగు పరమార్ధమును పొంది క్రమముగా, శుభవాసనలను కూడ వదలి, సత్యస్వరూపమున స్ధితుడు కావలెను.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్

🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము - 6 🌹

🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము 🌹
✍ రచన : పేర్నేటి గంగాధరరావు
6 వ భాగము

🌴 ఉత్పత్తి ప్రకరణము  🌴
🌻 5. పురుష ప్రయత్నము - 1 🌻

వశిష్ఠుడు రామునుద్దేశించి, ఇంకను ఏమి చెప్పుచున్నాడంటే, పురుష ప్రయత్నము వలననే, జ్ఞానము లభించుచున్నది. జ్ఞానము వలన జీవన్ముక్తి లభించును.

పురుషాకారము అనగా మనోవాక్కాయములందు చరించుట. అనగా ఏది ఆలోచిస్తామో అది మాట్లాడుట, ఏది చెబుతామో అది చేయుట. అలా కానిచో అది గతి తప్పుట. శాస్త్రానుసారము, ఎవరేది కోరునో వారది పొందును. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వారి వారి పురుషాకారముల వలననే సృష్టి, స్ధితి, లయ కారకులయ్యారు. పురుష ప్రయత్నము, శాస్త్ర విరుద్ధమైన కార్యము లాచరించినపుడు, వ్యధలనుభవించవలసి వచ్చును.

ఉదా:సూర్యచంద్రులు, తమ గతి తప్పినపుడు, ప్రళయము సంభవించును. అలానే విద్యుక్త ధర్మము ననుసరించకపోయిన, దుష్ఫలితము సంభవించును. మంచి కర్మల వలన చెడు నశించును. ఒకవేళ సత్కర్మ చేసినప్పటికి ఫలితము చెడుగానున్న, చెడు సంస్కారములు బలముగానున్నట్లు భావించవలెను. అపుడు సత్కర్మలు ఆపకుండా కొనసాగించిన సత్ఫలితములు కల్గును.

శరీరము అస్ధిరము. మరణము నీడ వలె వెంటాడుచున్నదని ఎల్లపుడు భావించుచుండవలెను. ముముక్షువు పురుషాకారమున మొదట సాధన చతుష్టయము ననుసరించవలెను.

సత్‌ శాస్త్ర విధిననుసరించి, సత్‌ సంగమొనర్చి, సదాచార పూర్వకముగ నొనర్చిన కర్మయే, సంపూర్ణ ఫలప్రదమగును. అనర్ధ హేతువగు సోమరి తనము లేకున్న దొడ్డ ధనికుడో లేక పండితుడో కాని వాడెవడు. సోమరి తనము వలనే భూమండలము మూర్ఖులతో దరిద్రులతోను నిండి యున్నది. అదృష్టమన్న దానిని కూడ నమ్మరాదు. సాధనయే జీవుని యుద్ధరించునది. ఈ జన్మమున యొనర్చిన అశుభకర్మలు ప్రాయశ్చిత్తాది కర్మల వలన శుభములుగ మారునట్లు, పూర్వకర్మలు కూడ పురుష ప్రయత్నము వలన, శుభప్రదములుగ మార్చవచ్చును. కష్టపడి ఆర్జించిన విత్తమంతయు నష్టమైన, మరల పొందుటకు ప్రయత్నింపవలెను గాని దుఃఖించుట అనుచితము.

జయించ వీలు లేని మృత్యువును గూర్చి ప్రతి దినము దుఃఖించుచుండ మృత్యువు ఆగునా! అందువలన పౌరుషము నాశ్రయించి, సాదుసంఘశాస్త్ర విచారము వలన చిత్తశుద్ధిని పొంది సంసార సాగరమును దాటవలెను.
ఏ పురుషుడైనను, పురుష ప్రయత్నము వలన ప్రాప్తకర్మలను అణగదొక్కిన సుఖ, దుఃఖములను దాటగలడు. పురుషాకారమును విడిచి ''ఎవరో నన్ను ఉద్ధ్రించగలరు'' అని తలచువాడు వ్యర్ధుడు.

ఎన్ని సమస్యలు వచ్చినను, రాగద్వేషములన్నియు సిద్ధించును.
శుశ్రూష, స్వాధ్యాయము, సాధుసంగమము, శ్రవణాదుల వలన చిత్తమును, కలుషరహిత మొనర్చి, ఆత్మోద్ధరణకు పాటుపడవలెను.

పరలోకమున అనుభవించగా మిగిలిన ప్రాప్తకర్మనే, అదృష్టమని, దైవమని అనవచ్చును.

పురుష ప్రయత్నము వలన ఫలము అరచేతిలోని ఉసిరిక వలె లభించును. మూర్ఖుడే పురుష ప్రయత్నము వీడి, అదృష్టముపై ఆధారపడును.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్

🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము - 5 🌹

🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము 🌹
✍ రచన : పేర్నేటి గంగాధరరావు
5 వ భాగము

🌴 ఉత్పత్తి ప్రకరణము  🌴

🌻 4. సూక్ష్మశరీరము   🌻

తదుపరి వశిష్ఠుడు శ్రీరామునికి సూక్ష్మశరీరతత్వమును బోధించుచున్నాడు. ఏ ప్రాణియైనను, మృతి చెందినపుడు, జీవాత్మ సూక్ష్మశరీరము ధరించి హృదయాకాశమున వాసనామయములగు (సంస్కారములు) త్రిలోకములను గాంచుచుండును. నిజానికి ఈ జీవాత్మ జన్మాది వికార రహితుడగు పరబ్రహ్మము. మరణ సమయమున మానసమందు నిలబడు కోర్కెలలో నేది అగ్రగణ్యమో దానినే జీవు డనుభవించును. నిజానికి జగత్తుమిధ్య, అసత్యమైనది. ఈ విషయము మరణ సమయ మందు, జనన సమయమందు, హృదయాకాశమున అనుభూతమగును. అనగా మరణ వేదనలో తన సంస్కారములన్ని, అనుభూతికి వచ్చి అంతా భ్రమయని తోచును. కాని సంస్కారములు నశించవు.

జన్మ సమయములో గూడ, ఆ సంస్కారములు భ్రమయని తెలిసినప్పటికి జన్మించిన తరువాత, మాయ ఆవరించి తన గత సంస్కారములు అలానే వుండును. బ్రతుకు నందలి ఆశ, పుట్టుక, చావు అనుమిధ్యా ప్రపంచము నిజమని తలచును.

స్ధూల శరీరములో సూక్ష్మ శరీరము, సూక్ష్మ శరీరములో కారణ శరీరము గలదు. ఈ మూడు శరీరములే సంసారమునకు కారణమగుచున్నవి.

సాధన ద్వారా ఈ మూడు శరీరములు దగ్ధమైనపుడే ముక్తి లభించును. ఈ సంస్కార తరంగములు నిద్రాసమయమందును, ప్రళయ సమయమందును చలనము లేక స్ధిరముగ వుండును. అది విశ్రాంతి సమయము. సృష్టి సమయము, స్వప్న సమయము లందు మరల భ్రాంతులు, తరంగములు లేచుచున్నవి. ఈ దేహత్రయములకు బ్రహ్మయే ఉపాధి. అందువలన స్థూల, సూక్ష్మ, కారణ శరీరములు నశించగానే బ్రహ్మము మిగులును.

సంస్కారముల ననుసరించి జన్మ లభించును.
జనులు మాటి మాటికి పుట్టుచూ, చచ్చుచూ క్రమముగా  సంస్కారములలోమార్పు తెచ్చుకొనుచు, చివరికి విదేహముక్తులగుదురు.

ఉదాహరణకు వ్యాసుడు ఈ బ్రహ్మయుగములో ముప్పది రెండవ వ్యాసుడు. అనగా పూర్వపు సృష్టులందు, ముప్పది ఒక్క వ్యాసులు చనిరి. ఇంకను వ్యాసులు ఎనిమిది పర్యాయములు జన్మించి, భారత ఇతిహాసములను, వేదవిభజనను ఎనిమిది పర్యాయములు చేసి భారత వంశమునకు కీర్తి దెచ్చి, పిదప విదేహముక్తుడై బ్రహ్మమును పొందును.

అలానే ప్రతి జీవి లక్షల జన్మములు ఎత్తి చివరకు ముక్తులు కావలసినదే. వివిధ జన్మలలో, ఇప్పుడున్న వారె అప్పుడు యధావిధిగ జన్మించి, సమకాలికులుగ వుందురు. అప్పుడప్పుడు విడివిడిగా గూడ జన్మింతురు. ఆయా జన్మలలో వారి వారి భార్య, బంధువులు, ఆయుర్ధాయము, జ్ఞానము ఒకే విధముగ ఇప్పుడున్నట్లే వుండును.

కేవలము ఒక్క తత్వజ్ఞాని మాత్రమే, వికల్పములు లేక పరమ శాంతుడై సంతృప్తుడై బ్రహ్మ పదమును పొందును. జ్ఞాని సదేహముక్తుడైనను, విదేహముక్తుడైనను ఒకటియె. ఈ రెండు ముక్తులును భిన్నములు కావు. సదేహముక్తునకు విషయ భోగములున్నచో, విదేహముక్తుని కంటే, తక్కువగ నెంచుకొనవచ్చును. అయితే విషయ భోగమందు రసబోధ లేనందు వలన రెండును నిర్వాణముక్తి వంటివే. నీరు అలలుగా వున్నను, కదలకున్నను నీరు నీరే కదా! అలానే గాలి కదులుచున్నను, కదలకవున్నను గాలి గాలే కదా!.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్

🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము - 4 🌹

🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము 🌹
✍ రచన : పేర్నేటి గంగాధరరావు
4 వ భాగము

🌴 ఉత్పత్తి ప్రకరణము  🌴

🌻 3. అఖండ చైతన్య స్వరూపము  🌻

అందుకు జనకుడు తాను గ్రహించినది తన తండ్రి పల్కినది కాక వేరేదియు లేదనియు ''అఖండచైతన్య స్వరూపము, అద్వితీయమైన పరమాత్మ స్వరూపము ఒక్కటే వున్నదని, తక్కిన వన్నియు లేనివేనని, అజ్ఞాన సంస్కారములు నశించినచో వ్యక్తి ముక్తుడై స్వస్వరూపమును పొందునని'' పల్కెను. చిన్న వయస్సులోనే శుకుడు భోగములను అనుభవించకుండగనే, విరక్తిని ప్రకటించి, పూర్ణత్వమును సాధించి సర్వజ్ఞానమును పొంది, వేదవ్యాసుని కంటే, గురువగు తన కంటే అధికుడవైనట్లు జనకుడు పల్కెను. నీ మనోరధము సిద్దించినదని, నీవు పొందవలసినదంతయు పొందియెయుంటి, ముక్తుడవని తెల్పెను.

తదుపరి శుకుడు సంశయరహితుడై, నిష్కాముడై నిర్వికల్ప సమాధి యందు, పదివేల ఏడ్లుండి, తైలహీన మగుదీపము వలె, ఆత్మ స్వరూపమున నిర్వాణమందెను. అని విశ్వామిత్రుడు శుకుని చరిత్రను తెల్పెను.*
*శుకుని వలె శ్రీరామచంద్రుడు తెలుసుకొనవలసినదంతయు తెలుసుకున్నాడని, శ్రీరాముడు భోగములందు విరక్తుడైనాడని పల్కెను.

కామక్రోధాదుల నెవడు జయించునో వాడే ముక్తుడు. అయితే శ్రీరాముని చిత్త శాంతి కొరకు వశిష్ఠుడు అతనికి తత్వబోధన చేయవలెనని పల్కెను. తక్కిన ఋషి పుంగవులు విశ్వామిత్రునితో ఏకీభవించిరి.

శ్రీ వశిష్ఠులు విశ్వామిత్రుని వచనములను తలదాల్చి శ్రీరామునికి అఖండ ఆత్మజ్ఞానమును బోధించుటకు ఉద్యుక్తుడయ్యెను. కాని శ్రీరాముడు మోక్ష శాస్త్రమును బోధించుటకు ముందు తన సందేహమును తీర్చవలయునని ఇట్లు పల్కెను.

శుకుని తండ్రియైన వ్యాసమహర్షి సర్వజ్ఞుడైనను విదేహముక్తిని పొందలేదు. అతని కుమారుడైన శుకుడు ఏల నిర్వాణముక్తిని పొందగల్గెను. అందుకు వశిష్ఠుడు ఇట్లు పల్కెను. పరమాత్ముని చైతన్య శక్తి యందు లేచి, మరల లీనమగు బ్రహ్మండత్రసరేణువులు అసంఖ్యాకములు, త్రిభువన మండలములు కూడ అసంఖ్యాకములు. అలాంటి జగద్రేణువులను జీవన్ముక్త పురుషులైన శుకుని వంటవారు నమ్మరు. అందువలన వీరు విదేహముక్తులుగ పిలువబడతారు. అందుకు శ్రీరాముడు తృప్తి చెంది, తాను అఖండ బ్రహ్మత్వమును గ్రహించితినని తెల్పెను.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్

🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము - 3🌹

🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము 🌹
✍ రచన : పేర్నేటి గంగాధరరావు
3 వ భాగము

🌴 ఉత్పత్తి ప్రకరణము 🌴

2. ముముక్షుత్వము

అంతట సభనలంకరించి యున్న వశిష్ఠ, విశ్వామిత్రాది మహర్షులు, ఇతర మంత్రులు, సామంతులు, దశరధుడు మొ|| వారందరు, రాముని వాక్యములు విని పులకిత శరీరులై, రాముని కలత తీర్చుటకు ఎవ్విధమైన సమాధానము లభించునో అని కుతూహలురై యుండిరి. అలానే సిద్ధులు రాముని ప్రశ్నలకు పులకించి, పుష్పవర్షము కురిపించి సభలోకి ప్రవేశించి ఉపవిష్ఠులై, సమాధానములు వినుటకు కుతూహలురైరి. వారిలో నారదుడు, దేవతలు, వ్యాసుడు, మరీచి, దుర్వాసుడు, అంగీరసుడు, వాత్సాయనుడు, భరద్వాజుడు, వాల్మీకి, ఉద్దాలకుడు మొ|| మునులు, వేదవేద్యులగు తత్వజ్ఞులు ఉపవిష్ణులై యుండిరి.

రాముని వాక్యములు, విచారయుతములు, జ్ఞానబోధకములు, ఆర్యోచితములు, స్ధిరములు, సంతోషదాయములైయున్నవి. అట్టి వాక్యములకు సమాధానములు వినుటకై ఎల్లరు కుతూహలురై వుండిరి. అపుడు శ్రీవాల్మికి రామునుద్దేశించి నీ ప్రశ్నలన్నియు, జ్ఞానయుతములైయున్నవి. నీవు తెలుసు కొనవలసినది ఇంకేమియులేదు అని పల్కి వ్యాసపుత్రుడైన శుకుని బుద్ధి నీ బుద్ధి కూడ జ్ఞానమును పొందియు అంతర శాంతిని కోరుచున్నది అని పల్కెను.

అంత శ్రీరాముడు, శుకుడు విచారబుద్ధి వలన జ్ఞానము పొందియు మొదట శాంతిని పొందక తదుపరి శాంతిని ఎట్లు పొందగల్గెనని ప్రశ్నించెను. అందుకు విశ్వామిత్రుడు శుకదేవుని వృత్తాంతమును తెల్పెను. శుకుడు వ్యాసుని కుమారుడు. అతడు తేజస్వి, శాస్త్రజ్ఞుడు, ప్రాజ్ఞుడు, రూపుదాల్చిన యజ్ఞము. సంసారగతిని, దాని మాలిన్యమును చింతించుట వలన అతడు వివేకి అయ్యెను. అతడు చాలాకాలము విచారణ జరిపి చివరకు సత్యమును గ్రహించెను. అయినను అతడు శాంతిని పొందలేదు. క్షణ భంగురములైన విషయముల నుండి విరక్తి కల్గెను.

ఒక పర్యాయము శుకుడు తండ్రియైన వ్యాసుని భక్తితో ఇట్లు ప్రశ్నించెను. ''ఈ సంసారాడంబరమెట్లు ఉదయించినది. ఇది ఎంతకాలము, ఎట్లు, ఎచ్చట వుండును? దీని అంతమేది? ఇది దేహేంద్రియాది సంఘాతమా? లేక అందుకు వ్యతిరేకమైనదా? అని ప్రశ్నించెను''. వ్యాసుడు అందుకుతగిన ప్రత్యుత్తర మిచ్చినప్పటికి శుకుడు తృప్తి నొంద లేదు. అపుడు వ్యాసుడు తానంతకు మించి చెప్పగల్గినదేదియు లేదు. జనకుడను రాజు ఒకడు గలడు. అతని కడకేగిన అతడు నీకు తగిన సమాధానము చెప్పగలడని పలకగా, శుకుడు తండ్రి సలహా మేరకు విదేహ నగరమునకు ఏతెంచి, ద్వారము వద్ద తన రాకను జనకునకు తెలియబంపెను. జనకుడు ద్వార పాలకుని మాటవిని ఏ మాత్రము బదులివ్వలేదు. శుకుడు ఏడురోజులట్లే ద్వారము చెంతయూరకుండెను. తదుపరి లోనికి ప్రవేశింప అనుమతి నొసంగెను. శుకుని పరీక్షింపనెంచి జనకుడు మరల ఒక వారము దినముల వరకు రాజదర్శనము లభించదని తెలియపర్చెను. వారము దినములలో శుకునకు అందమైన యువతులు, భోజన వస్తువులు విలాస ద్రవ్యములు పంపి శుకునకు బరిచర్యలు నొసర్చెను.

శుకుడు దుఃఖ స్వరూపము గల ఆభోగ్యవస్తువులకు ఏవిధముగ చలింపక స్ధిరచిత్తుడై యుండెను. అపుడు జనకుడు శుకదేవుని స్వభావమును గ్రహించి, అతనిని పిలువనంపి, రప్పించి అతనికి వందన మొనర్చి ఇట్లు పల్కెను. నీవు జగత్తు నందలి కర్తవ్యములన్నింటిని నెరవేర్చితివి కృతకృత్యుడవైతివి.

నీవేమి పని మీద వచ్చితివని ప్రశ్నించెను. అందుకు శుకుడు జనకుని గురువుగా ఎంచి, ఈ సంసారాడంబర మెట్లు ఉదయించి, ఎట్లు ఉపశమించునో తెలుపమని పల్కెను. అపుడు జనకుడు వ్యాసుడు చెప్పిన సమాధానమే చెప్పెను. అపుడు శుకుడు ఆ విషయము తనకు తెలుసుననియు, శాస్త్రములు కూడ అట్లే తెలుపుచున్నవని పల్కెను. నిస్సారమగు ఈ సంసారము అజ్ఞానము నుండి వెలువడుచున్నది. అజ్ఞానము నశించిన, ఇదియు నశించునని పల్కెను. ఈ విషయము ఎంత వరకు సత్యమో తెలియబర్చి తనకు శాంతి నొసంగుమని కోరెను.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్

🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము - 2🌹

🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము 🌹
✍ రచన : పేర్నేటి గంగాధరరావు
2 వ భాగము

🌴 ఉత్పత్తి ప్రకరణము 🌴

1. వైరాగ్యము

అపుడతని వయస్సు 15 సంవత్సరములు. కొంతకాలమట్లు గడిపినపిదప, ఆలోచనా పూరితుడై, మనస్సు వికలముకాగా, చింతించుచు క్రమముగా కృశింపసాగెను. అట్లు చింతాక్రాంతుడైన రాముని గాంచి దశరధుడు, అతని భార్యలు చింతించుచుండిరి. తదుపరి వసిష్ఠునిగాంచి, రాముని గూర్చి ప్రశ్నించగా వసిష్ఠుడు ధ్యానించి రాముని ఉదాసీనతకు కారణము గ్రహించుచుండ....విశ్వామిత్రుడు తనయజ్ఞమును దానవులదాడి నుండి కాచుటకై శ్రీరాముని కొనిపోదలచి దశరథుని కోరుటకై ఏతెంచె. అపుడు దశరధుడు విశ్వామిత్రుని సాదరముగ ఆహ్వానించి, సకలోపచారములు గావించి, తాము విచ్చేసిన కారణమేమని అడుగుచు, తమకు ఏది అవసరమైనను సంతోషముగ సమర్పింతునని వినయముతో ప్రార్థించెను. 

విశ్వామిత్రుడు తాను ఆచరించుచున్న యజ్ఞరక్షణకై శ్రీరామచంద్రుని కొనిపోవుటకై వచ్చితినని, అతనిని తగిన అస్త్రశస్త్రములతో తీర్చిదిద్దగలవాడనని వివరించి చెప్పగా, దశరధుడు చింతించుచు, తన 15 సంవత్సరముల తనయుడు, రాముడు కేవలము బాలుడని, తానే స్వయముగా విచ్చేసి రాక్షస సంహారమొనర్చి యజ్ఞమునకు రక్షణనిచ్చెదనని పల్కగా, విశ్వామిత్రుడు అటులకాదని తాను రాముని తగు విధముగా తన అస్త్రశస్తముల నొసగి శిక్షకుని గావించెదనని మరల పల్కగా దశరధుడు తన కుమారునిపై గల అతిప్రేమతో భయపడుచుండ, వశిష్ఠుడు దశరధునికి విశ్వామిత్రుని శక్తి సామర్ధ్యములను వివరించి, ఏమియు భయపడవలసిన పనిలేదని నుడవగా, దశరధుడు సమ్మతించి శ్రీరాముని పిలువనంపెను. 

శ్రీరాముడు అపుడు యాత్రానంతరము కొంతకాలము విశ్రమించిన తదుపరి, ఈ ప్రాపంచిక వ్యవహారములకు డస్సి, చింతాక్రాంతుడై విచారముతో విచలిత మనస్సుడై వుండగా, దశరధుని వార్త విని, తండ్రి ఆనతితో, ఆస్ధానమునకు విచ్చేసి, అచట గల రాజ, పురోహిత, మంత్రి, సామంతులగని తాను, ప్రాపంచిక విషయములందాసక్తి, కోల్పోతినని, దుఃఖదాయకములైన జరామరణములు, సంపదలు మరల మరల వచ్చుచు పోవుచున్న ఈ ప్రపంచము ఎడ, విరక్తితో వున్నానని, మనశ్మాంతి కొరవడినదని విన్నవించగా; అలాగే మోహము, అహంకారము, సంపదలు మొదలగువానికోర్చి, అన్నపానములు వదలి వేసితినని తెల్పెను. ఇలాంటి నాకు ఆర్యులు తత్వబోధ నొనర్చుడని పల్కెను. తృష్ణవలన సంసార దోషములు కల్గి దీర్ఘ దు:ఖమును కల్గించును. బహుపశువులమెడను గట్టిన త్రాడు మరొక పెద్ద త్రాడుకు గట్టబడునట్లు, ఈ సంసారమున చరించుజీవుల మనస్సు తృష్ణయను త్రాటికి గట్టబడియున్నదని,

దీని ఫలితమే జరామరణములని శ్రీరాముడు పల్కినాడు. అలానే ఈ శరీరము మలమూత్రములతోలు సంచియని, వయస్సుతో పాటు శరీరము కొంత వయస్సు వరకు పెరుగుచూ తరువాత క్రమముగా క్షీణించి చివరకు మరణమునకు దారి తీయునని, మాంసము, నరములు, ఎముకలులో నిర్మింపబడిన ఈ అధృడ శరీరము నుండి బయటపడు ఉపాయము తెలియుటలేదనియు, ఇంకను ఈ శరీరము రోగములకు ఆవాసమై, క్రమముగా చర్మము ముడుతలుపడుచు, నెఱసిన వెంట్రుకలతో, మనోవ్యాధులతో కూడిన, ఈ శరీరమున్నంత కాలము రోతకల్గుచున్నదనియు, శైశవము, బాల్యము, యవ్వనము, వార్ధక్యములతో కూడిన ఈ శరీరము దుఃఖమయమనియు, శైశవములో అజ్ఞానము, బాల్యములో చాపల్యము, యవ్వనములో భ్రమలు కల్గిచుచుండునని, తదుపరి సంతానము కల్గి వారి పోషణ, పాలనతో దు:ఖసముద్రమున మునిగి చివరకు వార్ధక్యములో, కాలుడు సదాకాచుకొని యుండి, ఏక్షణమున కాటువేయునో అని విచారించుచుండునని జనులు నిరంతరము కుటిలయత్నము లోనర్చుచూ, కామాసక్తులై యుండగా, వివేకులు ఎచ్చటను కనిపించుట లేదని అనేక విధములుగా చింతించుచూ, మానవునికి ఉత్తమమైనది భ్రాంతినాశనమైనది, శ్రమలేనిదియైన మార్గమేమిటో తెలియపర్చవలెనని కోరుచూ.... 
జనకాది మహర్షులు అన్ని వ్యవహారములు నడుపుచూ, కర్మనిరతులై యుండియు ఎట్లు శ్రేష్ఠులుగా వ్యవహరింపబడుచున్నారని ప్రశ్నించెను. అలానే సంసార వ్యవహారములందు పాల్గొనుచున్నను, తామరాకునందలి నీటిబొట్టు వలె నిర్లిప్తులై యుండుటకు కారణమేమిటని ప్రశ్నించెను.

ఇంకను ఈ సంసారము నిరంతరము పీడకల్గించునదియెకాని, మోహరహితమై, రుచికరముగా ఎట్లు వుండగలదు? పాదరసము అగ్నిలో పడినను దహింపబడదు. అలానే మనిషి మేయుపాయమువలన, సంసారాగ్ని పడియు, తపింప బడకుండగలడు? కర్మలొనర్చినను, లేక నొనర్చకపోయినను దుఃఖముకలుగని యుత్తమయోగమును ఉపదేశింపుమనియు, లేనిచో ఈ దేహమును, ఇతర బంధుమిత్రులను పరిత్యజించి, ఈ శరీరమునుత్యజింతుననియు పల్కి మౌనము వహించెను.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్