Showing posts with label Siddeswarananda Swami. Show all posts
Showing posts with label Siddeswarananda Swami. Show all posts

సిద్దేశ్వరయానం - 128 Siddeshwarayanam - 128

🌹 సిద్దేశ్వరయానం - 128 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵️ లంకాయాత్ర - 2 🏵️

కులపతి గారు (స్వామి వారు ) తమ కాలేజీలో జరిగిన ఒక 'క్లాస్' రూమ్' కథను తెలియచేశారు. ఒక విద్యార్థి ఇలా ప్రశ్నవేశాడు "మాస్టారూ! సీతను రావణాసురుడు ఎత్తుకు పోవటం తప్పేననుకోండి, అయినా దానికోసం రాముడు సైన్యాలతో వెళ్ళి, రావణాసురుని, అక్కడి ప్రజలను కొన్ని లక్షలమందిని చంపినట్లుగా రామాయణం ద్వారా తెలుస్తున్నది కదా! ఒక స్త్రీ కోసం ఇంతమంది అసంఖ్యాకులను చంపటం, గాంధీగారు మనకు చెప్పిన అహింసా సిద్ధాంతానికి, విరుద్ధం కదా! రాముడు, ఇంకో పెళ్ళి చేసుకొంటానంటే ఎవరో ఒకరు పిల్లనివ్వరా? ఇంత దారుణ మారణ కాండ జరుగకుండా ఉండేది కదా?" అని ప్రశ్నించాడు. దానికి కులపతిగారు జవాబు ఇలా చెప్పారు "మహాత్మాగాంధీగారి పేరు ప్రస్తావించావు గనుక, వారు డైరీలో వ్రాసుకొన్న ఒక సంఘటన చెపుతాను. వారి డైరీ తెలుగులో ఆచార్య పింగళి లక్ష్మీకాంతంగారు అనువాదం చేశారు. లైబ్రరీలో తీసుకొని చదువు. అందులో స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో బెంగాలులో 'నవఖాళి' దురంతాలు జరిగినపుడు బాధితులయిన హిందువులను పరామర్శించటానికి ఓదార్చటానికి, మహాత్ముడు, స్వయంగా వెళ్ళారు. ఒక గ్రామంలో, ప్రజలను ఆయన ఇలా ప్రశ్నించాడు 'చాలా దుర్మార్గం జరిగిన సంగతి చూచాను. మహమ్మదీయులు వచ్చి, మీ ఇండ్లు కొల్లగొట్టి, మీ స్త్రీలను చెరిచి, ఊరంతా నాశనం చేస్తూ ఉంటే, మీరంతా ఏం చేస్తున్నారు. వాళ్ళను ఎదిరించలేదా? అడ్డుకోలేదా?' అని ప్రశ్నించాడు. దానికి వారు ఏడ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ "బాపూజీ! మీరు బోధించిన అహింసా సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళము మేము. అందుకే ముస్లింలు ఏమి చేసినా ప్రతిఘటించకుండా ఊరుకొన్నాము” అన్నారు. గాంధీజీ, చాలా బాధపడి, “మీరు ఇలా అకర్మణ్యులుగా ఉండేకంటే వారితో పోరాడి చచ్చిపోతే బాగుండేది", అని కోప్పడినాడు. తరువాత తనడైరీలో ఈ విషయం గూర్చి రాసుకొంటూ ఇలా ఉద్ఘాటించారు "నేను జీవించి ఉండగానే నా అహింసా సిద్ధాంతము ఇంతగా అపార్ధం చేసుకోబడునని భావించలేదు". కాశ్మీరులో పాకిస్తాన్ సైన్యం ప్రవేశించినపుడు, భారతదేశం వెంటనే వారి మీదకు సైన్యాన్నిపంపించి, అదుపు చేయాలని చెప్పినవాడు, మహాత్మాగాంధి. అహింసా సిద్ధాంత ప్రయోగం ఎక్కడ ఎంతవరకు అవసరమో అంతవరకే ఉండాలని ఆయన అభిప్రాయం".

ఈ దేశంలో ఇటువంటి ఆలోచనలు యువతరంలో అక్కడక్కడా కన్పిస్తునే ఉన్నవి. ఒక దేశానికి యువరాజైన వ్యక్తి భవిష్యత్తులో రాజు కాబోయేటువంటివాడు శ్రీరాముడు. దేశ ప్రభువు భార్యనే మరో దేశం వాడు ఎత్తుకుపోతే, సహించి అహింసామంత్రం వల్లెవేస్తూ కూర్చుంటే ఆ జాతి ఉంటే ఏమి? లేక పోతే ఏమి?. "పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా” అన్నట్లే. అధర్మాన్ని శిక్షించటానికి ధర్మాన్ని రక్షించటానికి ఎంతమందిని చంపవలసి వస్తుందన్నది ప్రధానం కాదు. ధర్మం జయించాలి. దానికోసం ఎంత సాహసమైనా చేయాలి. ఆనాడయినా, ఈనాడయినా దేశానికి కావలసినది పిరికిపందలు కాదు. ధర్మవీరులు కావాలి. ఆనాడు విద్యార్థులకు సందేశం ఆ విధంగా సాగింది.

ఇంక అక్కడ గాయత్రీ యజ్ఞం జరుగుతున్న సమయంలో కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగినాయి. యజ్ఞప్రారంభానికి కులపతిగారు తమ గదిలో నుండి బయలు దేరుతూ ఉంటే, రాధాదేవియొక్క ప్రేమరస భావవీచిక హృదయాన్ని స్పందింపచేసింది. రాధాదేవి మహ భావస్వరూపిణి, ఆ భావ స్పర్శకు శరీరం పులకరించి కంటి వెంట అశ్రువులు రాలటం మొదలుపెట్టినవి. ఈ లంకాయాత్రకు రాధాదేవి అనుగ్రహమే ప్రధానకారణం. గాయత్రీ పీఠాధిపతి 'స్వామీ మురుగేష్' బృందవనానికి వెళ్ళి రాధాకృష్ణ మందిరాలను దర్శించి రసయోగి రాధికాప్రసాద్ మహరాజ్ గారి దర్శనం చేసుకొన్నారు. దాని ఫలితంగా, రెండు అందమైన రాధాకృష్ణ విగ్రహాలు, స్వామీ మురుగేష్కు అందచేయబడినవి. ఆ రెండు విగ్రహాలు గాయత్రీ పీఠంలో సముచిత స్థానంలో ఉంచబడి పూజలు అందుకుంటున్నవి. ఆ సందర్భంగా ఏర్పడిన పరిచయాలవల్ల, అనుబంధం వల్ల కులపతిగారి శ్రీలంకయాత్ర రూపొందింది.

( సశేషం )

🌹 🌹 🌹 🌹 🌹


సిద్దేశ్వరయానం - 127 Siddeshwarayanam - 127

🌹 సిద్దేశ్వరయానం - 127 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵️ లంకాయాత్ర - 1 🏵️


శ్రీ స్వామివారు, పూర్వాశ్రమంలో ప్రసాదరాయకులపతిగా ఉన్నప్పుడు, శ్రీలంకలోని గాయత్రీ పీఠాథిపతి వీరిని గురించి విని దేవీనవరాత్రులకు గాయత్రీ యజ్ఞం చేయటానికి ఆహ్వానించారు. కులపతిగారు దానిని అంగీకరించి శ్రీలంకకు ప్రయాణ సన్నాహాలు చేసుకొన్నారు. గుంటూరునుండి హైదరాబాదు చేరుకొని అక్కడినుండి విమానంలో మదరాసు చేరుకోవాల్సి వచ్చింది. అనుకోకుండా విపరీతమైన వర్షాలవల్ల రైళ్ళు, బస్సులు ఆగిపోయినవి. మదరాసు చేరుకోవటానికి, ఒంగోలు, నెల్లూరు మీదుగా వెళ్ళే మార్గం వరదలకు గండి పడటం వల్ల ఆ మార్గంలో రోడ్డు ప్రయాణం కాని, రైలు ప్రయాణం కాని చేయటానికి వీలులేని పరిస్థితి వచ్చింది. హైదరాబాదు వెళ్ళే త్రోవకూడా సరిగా లేక చాలా రైళ్ళు ఆపివేశారు.

రిజర్వేషన్ల ప్రయోజనం పోయింది. అతి కష్టం మీద హైదరాబాదు చేరుకొనేసరికి టికెట్ బుక్ చేసుకొన్న విమానం వెళ్ళిపోయింది. మరుసటిరోజు ఇంకో విమానం మీద మదరాసు చేరుకొనే సరికి అక్కడి భక్తులు, శ్రీలంక ప్రయాణపు ఏర్పాట్లుచేశారు. వీసాకు సంబంధించిన ఇబ్బందులు వచ్చినవి కాని, నిర్వాహకులు శ్రమపడి ఆటంకాలు తొలగించగలిగారు.

కొలంబో విమానాశ్రయంలో దిగిన తరువాత యజ్ఞం జరిగే ప్రదేశానికి బయలుదేరారు. ఆ స్థలం కొలంబో నుంచి చాలాదూరంలో వుంది. ఒక పెద్దకొండ మీద గాయత్రీ పీఠం నెలకొల్పబడింది. దాని అథిపతి స్వామి మురుగేష్ లంకా ద్వీపంలో చాలా ప్రసిద్ధుడైన యోగి. పీఠం ఏర్పాటు అయిన ఊరిపేరు “నువారా ఎలియా", వ్యావహారికంగా 'నొరోలియా' అనికూడా అంటారు. ఇది త్రేతాయుగం నాటిదని చెప్పబడే రావణాసురుని కోటకు దగ్గర ఇంద్రజిత్తు హోమాలు చేసిన చోటుకు సమీపాన, సీతాదేవిని ఉంచిన అశోకవన ప్రాంతంలో నెలకొల్పబడి ఉంది.

దేవీనవరాత్రులలో జరుపుతున్న ఈ యజ్ఞానికి అమెరికా, కెనడా, జర్మనీ, మలేషియా, సింగపూరు మొదలైన దేశాలనుండి ఎందరో యోగి భక్తులు వచ్చారు. అక్కడ ప్రతిష్ఠించ బడిన లంకాధీశ్వర స్థాపిత శివాలయానికి మహకుంభాభిషేకం చేసి కులపతిగారు గాయత్రీయజ్ఞం చేశారు. ఉదయం నుంచి సాయంకాలం దాకా యజ్ఞం, సాయంత్రం హోమ విరమణ తరువాత, ప్రతిరోజూ గాయత్రీ మంత్ర మహాత్త్వాన్ని గూర్చి మంత్రశాస్త్ర విశేషాలను గురించి ఉపన్యసించి, భారతదేశ సిద్ధపురుషుల తపోవైభవ విశేషాలను వివరించారు. ఆ సందర్భంగా రావణ గుహలు అశోకవనము మొదలైన చారిత్రక ప్రదేశాలను, చూచినపుడు కులపతిగారికి ఒక సందేహం కలిగింది. అక్కడికి వచ్చిన శ్రీలంక అధికారులను "ఇక్కడ ఎక్కడా రామునకు గాని హనుమంతునకు గాని దేవాలయాలు కనపడటం లేదు. వాటిని కట్టటం మీద ఏదైనా నిషేధం ఉన్నదా?” అని ప్రశ్నించారు. వారు "స్వామివారూ! అధికారికంగా నిషేధమేమీ లేదు. కానీ మేము నిర్మించము. ఎందుకంటే, హనుమంతుడు, రాముడు మా ప్రజలను నాశనం చేసినవారు, వారికి మేమెందుకు గుళ్ళు కడతాము?” అన్నారు. ఆ మాటలువిని, నవ్వుతూ కులపతిగారు “రామునకు, ఆంజనేయునకు గుడులు లేవు. మీకు ఇష్టం లేదు. పోనీ రావణాసురుడికైనా గుడి ఉన్నదా?" అని అడిగారు. ఆ అధికారులు, రావణాసురునికి కూడా గుడులు లేవు. పరదేశపు స్త్రీని తీసుకువచ్చి జాతి నాశనానికి కారకుడైనవాడు రావణుడు. అందుచేత అతనికి కూడా ఇక్కడ గుడులు లేవు" అన్నారు.

వారు వెళ్ళిపోయిన తరువాత ఆ యజ్ఞాన్ని చూడటానికి వచ్చిన వారిలో, భారతదేశం నుండి వచ్చి, పెద్ద పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తున్నవారు, కర్మాగారాలు నిర్మిస్తున్న వారు, శ్రీలంకను అభివృద్ధిని చేస్తున్నవారు ఉండటం గమనించి వారితో "సీతారాములకు గాని, ఆంజనేయునకు గాని గుళ్ళు కట్టడానికి నిషేధమేమీలేదని తెలుస్తున్నది కదా! మీరు పూనుకొని ఈ ఆలయాలు ఎందుకు నిర్మించకూడదు?" అని అన్నారు. దానిమీద అక్కడి, వారికి ఉత్సాహం కలిగి కొద్ది కాలానికే మంచి, అందమైన సీతారామాలయము, హనుమంతుని గుడి ఏర్పడినవి.

( సశేషం )

🌹🌹🌹🌹🌹


సిద్దేశ్వరయానం - 124 Siddeshwarayanam - 124

🌹 సిద్దేశ్వరయానం - 124 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵️ దేవ రహస్యము 🏵️


హిమాలయపర్వతాలు - అచట మానస సరోవరము, కైలాసపర్వతము అక్కడ రహస్యంగా ఉన్న సిద్ధాశ్రమమునకు కొన్ని వేల యేండ్ల నుండి అనుబంధం ఉన్న ప్రదేశాలు కాశీ, కామాఖ్య, బృందావనం, కొన్ని జన్మలలో గాఢమైన సంబంధం ఉన్న ప్రాంతాలు.

అయిదువేల సంవత్సరాల క్రింద అస్సాం దగ్గర నాగభూమిలో ద్వాపరాంతంలో వచ్చిన జన్మ. ఆ జన్మలో కుర్తాళం రావటం ఆప్తుడైన మౌనస్వామితో నాలుగువేల యేండ్ల క్రింద మొదటిసారి. మళ్ళీ యిటీవల కాలంలో ఏర్పడిన సాన్నిహిత్యం. కొండలలో, అడవులలో, క్షేత్రాలలో, నదీతీరాలలో ఆశ్రమాలలో తపస్సాచరించాను. ఈ జన్మలో కూడా నేను పుట్టింది నరసింహస్వామి గుహలో వెలసిన కొండ క్రింది గ్రామమే. (ప్రకాశం జిల్లా - ఏల్చూరు). యాభై యేండ్ల క్రింద నుండి పర్వతాలు - అరణ్యాలు మహనీయులైన యోగుల కోసం అన్వేషణ. ఆ సంచారంతో ప్రాప్తించిన సిద్ధానుగ్రహం. ఇటీవల జరిగిన ఒక అనుభవం ఇక్కడ చెప్పటం జరుగుతున్నది. అయితే స్థలాలు, పేర్లు రహస్యంగా ఉంచవలసిన నియమం ఉంది గనుక కొంతవరకు మాత్రమే యివ్వబడుతున్నది.

ఒకటనాటి అర్థనిశావేళ ధ్యానసమయంలో ఒక మహా పర్వతగుహకు రావలసినదిగా సిద్ధసూచన వచ్చింది. ఆ ప్రదేశానికి చేరాలంటే సులభం కాదు. గ్రామాలు దాటి అడవులలో నుండి వెళ్ళాలి. మరునాడు బయలుదేరాలని అనుకొన్నాను. కాని ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం వచ్చింది.; కదలలేని స్థితి. ఎందుకిలా అయింది? అని. కండ్లుమూసుకొని ధ్యానం చేశాను. ఆశ్చర్యంగా భూతప్రేతములు కొన్ని క్రూరంగా చూస్తూ కనిపిస్తున్నవి. నేను సిద్ధుల గుహకు వెళ్ళకుండా చేయటమే వాటి లక్ష్యంగా తెలిసింది. అసహాయ స్థితిలో భైరవుని ప్రార్థించాను.

అవసరమునకే దేవత ఆదుకొనని సమయములో అసహాయుడనైన నాకు ఆయువు పోసిన దైవము కాశీపుర రక్షకుండు కాళీ ప్రియ నాయకుండు ప్రభువు గురువు నాకన్నియు భైరవుడరుదెంచుగాక!

భైరవుని అవతరణతో పిశాచాలు పలాయనం చిత్తగించినవి. ప్రయాణం మొదలైంది. వివిధ వాహనాలలో గమ్యస్థానానికి కొంత దూరం వరకు వెళ్ళాను. అక్కడ నుండి అరణ్యమార్గం. ఇతరులకు అనుమతి లేదు. జ్వరం, నీరసం, అతికష్టంగా కొండ ఎక్కటం మొదలు పెట్టాను. కాసేపటికి నీరసం తగ్గింది. ఎవరో పైకి తీసుకొని వెళ్తున్నట్లనిపించింది. "చేదుకో మల్లయ్య ! చదుకోవయ్య !" అని శ్రీశైలం ఎక్కలేక అలసివారు ప్రార్థించినట్లు నా ప్రార్ధన మన్నించి పైకి లాగుకొని వెళ్తున్నారు. గాలిలో తేలిపోతున్నానని అనలేను గాని ఇంచుమించు అలా ఉంది.

కుర్తాళం దగ్గర తెన్కాశిలో ఇటువంటిదే ఒక వింత. మొదటనే పెద్ద గోపురం, ప్రవేశికకు గర్భగుడికి మధ్య ఖాళీ స్థళం. సగం దూరం పోయిన దాకా కట్టుకొన్న ధోవతులు గాలికి వెనక్కు వెళ్ళినట్లుంటుంది. పెద్దగాలి యేమీ ఉండదు. సగం దూరం వెళ్ళిన తర్వాత గుడ్డలు ముందుకు వెళ్తుంటవి. మనం నాలుగడుగులు ముందుకు వస్తే భగవంతుడు పది అడుగులు ముందుకు వస్తాడంటారు. నా పరిస్థితి అలాగే అయింది. మొత్తం మీద గుహకు చేరాను. లోపల పెద్ద హోమకుండం. పక్కనే ఆఖ్యపాత్రలు, మనుషులు లేరు. కనుచూపు మేరలో ఎక్కడా నరుల అలికిడి లేదు. ఉన్నట్లుండి గాలిలో నుండి ముగ్గురు ఋషులు కమండలాలు ధరించి ప్రత్యక్షమైనారు. సాష్టాంగ నమస్కారం చేశాను. తమ కమండలువులలోని పవిత్రజలం నాపై చల్లారు. వారు మౌనంగానే ఉన్నారు. ఆ మౌనంలోనే మనోభూమికలో కొన్ని రహస్య విషయాలు తెలియజేశారు. ప్రేమదయార్ద్ర దృక్కులతో ఆశీర్వదించి అదృశ్యమై పోయినారు. అందులో ఒకరుకొన్ని వందల సంవత్సరాల క్రింద నాతో కలిసి డాకినీ శ్మశానంలో సాధన చేసిన యోగి - మైత్రీమధురుడు. ఆ పరమాప్తుడు కఠోర తపస్సు చేసి భౌతిక శరీరస్థితిని అధిగమించి దివ్య సువర్ణ కాంతిమయ దేహాన్ని సాధించాడు. నేను మానవజన్మ ఎత్తవలసి వచ్చిందే అని అతని బాధ. ఆ బాధ అతని కన్నులలో వ్యక్తీకృతమైంది. నందీశ్వరుని అనుగ్రహం వల్ల అగస్త్యుని మిత్రుడైన సుందర నాథుడు తిరుమూలర్ అనే ద్రవిడ యువకుని శరీరంలో ప్రవేశించి సువర్ణ సుందర శరీరం పొందినటులే ఇతడు కూడా పొంది కాలావధులను దాటగలిగినాడు. సిద్ధాశ్రమయోగుల సంకల్పం వల్ల భౌతిక ప్రపంచంలో దేవకార్యం కోసం పంపబడటం వల్ల నాకు చింతలేదు. అయినా నేను తనవలె కావాలని ఆమిత్రుని ఆకాంక్ష. ఈ సంఘటన తర్వాత కొంత కాలానికి నేను తీర్థయాత్రలో ఉండగా ఏకాంతంగా నా దగ్గరకు మేము ఉపాసించిన దేవతను ఆవాహనం చేసి ఆశీర్వదింప జేశాడు. అతనితో పునస్సమాగమం ఎటుదారి తీస్తుందో!

( సశేషం )

🌹 🌹 🌹 🌹 🌹

సిద్దేశ్వరయానం - 123 Siddeshwarayanam - 123

🌹 సిద్దేశ్వరయానం - 123 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 శ్రీశైల గుహ -శిష్యానుభూతి 🏵


స్వామివారు కొన్ని వందల సంవత్సరాల క్రింద శ్రీశైలంలో తపస్సుచేశారు. వారి ధ్యానగుహ అరణ్యంలో చాలా దూర ప్రదేశంలో ఉంది. ఒకసారి భక్తులతో మాట్లాడుతూ ప్రసంగ వశాన అది ఎక్కడ ఉన్నదో అక్కడికి ఎలా వెళ్ళాలో చెప్పారు. ఆ విషయం తెలుసుకొన్న ఒక భక్తురాలు - తీవ్ర సాధకురాలు. ఆ గుహకు వెళ్ళి తానుకూడా ధ్యానం చేయాలని సంకల్పించింది. ప్రొద్దుననే లేచి అల్పాహారం తీసుకొని మధ్యాహ్నమునకు కావలసినది పొట్లం కట్టుకొని ఒక సీసా మంచినీళ్ళు తీసుకొని బయలుదేరింది. ఆ కొండమీద అడవిలో వెదుకుతూ సరిగా దోవలేని చోట ఏకాంతంగా ఒక్కతే వెళ్ళటం చాలా సాహసం. సుమారు ముప్ఫై అయిదు సంవత్సరాల వయస్సు. బయలుదేరిన మొదట అక్కడక్కడ మనుషులు కనిపించారు. తరువాత లోపలకు పోయినకొద్దీ నిర్మానుష్య ప్రదేశాలు. మధ్యాహ్నానికి కష్టం మీద ఆ గుహకు చేరుకొంది ఆమె. దానికి కొద్ది దూరంలో ఒక కొలను ఉంది. ఆకలిగా ఉంది, ఆహారం తీసుకుందామని అక్కడికి వెళ్ళి కాళ్ళు, చేతులు, మొహమూ చన్నీళ్ళతో కడుక్కొని ఒక చెట్టుక్రింద కూర్చొని పొట్లం విప్పింది. ఉన్నట్లుండి చెట్లమీద ఉన్న కోతులు దూకి వచ్చి ఆ ఆహారం పొట్లం లాక్కుపోయినవి. వాటి దాడికి భయభ్రాంతురాలైంది. నోట మాటరాలేదు. ఏడుపు వచ్చింది. అయినా ధైర్యం తెచ్చుకొని గుహలోకి వెళ్ళింది. లోపల ఒక పెద్ద పీట, ఒక యోగదండము, కమండలము ఇంకా కొన్ని పాత వస్తువులు కనిపించినవి. గురువుగారు ఒకప్పుడు తపస్సు చేసినచోటు ఇదన్నమాట!

కష్టపడి వచ్చినందుకు ఫలితం లభించింది అన్న సంతృప్తి కలిగింది. కొంతసేపు ధ్యానం చేసి చీకటి పడకముందే వసతికి చేరుకోవచ్చులే అని ఆమె మంత్ర జపం మొదలుపెట్టింది. ఒకవైపు పెద్ద బండను ఆనుకొని కండ్లుమూసుకొన్న ఆమె అలసటవల్ల నిద్రలోకి వెళ్ళిందో లేక భావసమాధిలోకి వెళ్ళిందో కండ్లు తెరిచేసరికి సాయంకాల మవుతున్నది. వెలుతురుండగా శ్రీశైలగ్రామంలోకి ప్రవేశించగలనా అని అనుమానం కలిగింది. అయినా ధైర్యం తెచ్చుకొని నడవటం మొదలుపెట్టింది. పెద్ద పెద్ద పాములు అడ్డంగా వెళుతున్నవి. ఒకటి రెండు పడగవిప్పి చూస్తున్నవి. నడుస్తున్నది. నలుగురు నడిచే దోవ కాక పోవటంవల్ల వచ్చిన దోవ కనుక్కోలేకపోయింది. దారి తప్పింది. ఎటుపోవాలో తెలియదు. ఎటు పోతున్నదో తెలియదు. నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నవి. ఎంత దూరం నడిచినా గమ్యం ఎలాచేరుకోవాలో తెలియలేదు. భయం ఎక్కువైంది. ఏడుపువస్తున్నది. చెట్లమధ్య గాడాంధకారం అలముకొన్నది. గురువుగారికి చెపితే అనుమతించరని చెప్పకుండా వచ్చినందుకు తగిన శాస్తి జరిగిందని తనకు తాను నిందించుకొంది.

తప్పు చేశాను స్వామీ! కాపాడు - ఆర్తురాలిని - దీనురాలిని - దిక్కులేని దానిలాగ ఇక్కడ చావకుండా రక్షించు అని ప్రార్ధించటం మొదలు పెట్టింది.

"లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్ ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్ నీవే తప్ప యితః పరంబెరుగ మన్నింప దగున్" ప్రేమతో రావో సద్గురు యోగి రాజ! కరుణన్ రక్షింపు సిద్ధేశ్వరా!

ఎంత వేడుకొన్నా ఎవరూ ఆదుకోటానికి రాలేదు. "స్వామికి నా పిలుపు వినిపించిందో లేదో! లేక విన్నా రక్షించాలని కరుణ కలుగ లేదో!" ఆమెకు దః ఖం పొరలుకొని వస్తున్నది. అశ్రువులు రాలుతున్నవి. ఆవేదన పొంగుతున్నది. ఇంతలో ఎవరో చెయ్యిపట్టుకొని నడిపిస్తున్నట్లు అనిపించింది. ఇంతకు ముందులాగా శ్రమలేదు. గాలిలో తేలిపోతున్నట్లున్నది. సిద్ధగురు కరస్పర్శ తెలుస్తున్నది.

శరణం భవశరణం భవ కరుణామృత సింధో గురు శేఖర సిద్ధేశ్వర చరణాశ్రిత బంధో!

ఉదయం నాలుగు గంటలు పట్టిన ప్రయాణం పదిహేను నిమిషాలకంటే పట్టలేదు. ఊరికి దగ్గరపడిన తరువాత అక్కడక్కడ త్రోవలో మనుషులు కనిపించారు. తనను వాళ్ళెవరూ పలకరించలేదు. తను వాళ్ళకు కనిపిస్తున్నానా అని అనుమానం కలిగింది. తను ఉన్న ఆశ్రమ ద్వారాలు మూయకముందే చేరుకొంది. దయామయుడైన గురుదేవుని కరుణ అప్పటికి అర్థమైంది. ఆ రోజు రాత్రి స్వప్నంలో దీర్ఘాన్నత దేహంతో బంగారురంగుతో నల్లని గడ్డంతో స్వామి పూర్వరూపం దర్శనమిచ్చింది. ఎన్నో వందల సంవత్సరాల క్రిందనించి ఉన్న దివ్య శరీరమది. ఆ గుహలో తపస్సు చేసినప్పుడున్న ఆకారమది. తను చేసిన సాహసం నిష్ఫలం కాలేదు. ఈనాడు నిత్యప్రసన్నుడు పరమ ప్రశాంతుడు అయిన గురుదేవులు వృద్ధునిగా కనిపిస్తున్నా ఆ స్వామి అసలు శరీరము సువర్ణ సుందర ఋషిమూర్తి. ఆ మహాపురుషున కాయోగిని అంజలి ఘటించింది.

త్వమేవ మాతాచ పితాత్వమేవ

త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ

త్వమేవ విద్యా ద్రవిణంత్వమేవ

త్వమేవ సర్వం మమదేవ దేవ!

స్వామివారు అభయమిచ్చి ఆశీర్వదించారు.

( సశేషం )

🌹🌹🌹🌹🌹

సిద్దేశ్వరయానం - 122 Siddeshwarayanam - 122

🌹 సిద్దేశ్వరయానం - 122 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 జలభైరవుడు 🏵

హిమాలయాల నుండి కుర్తాళం


ఒకనాటి ప్రాతస్సంధ్యా సమయంలో సిద్ధేశ్వరానంద స్వామివారు కుర్తాళ జలపాతాలలో స్నానం చేయటానికి వెళ్ళారు. అందులోని నీళ్ళు వ్యాధి నివారకమైనవని ప్రసిద్ధి. వేల లక్షలమంది అక్కడ స్నానం చేయటానికి వస్తుంటారు. స్నాన ఘట్టాలు చాలా ఉన్నా ఊరికి దగ్గరగా ఉన్న చోట్ల ఎక్కువ జనం వస్తుంటారు. కొంచెం దూరంగా ప్రశాంతంగా ఉండే స్థలం దగ్గరకు పీఠ అధికారులు స్వామివారిని తీసుకెళ్ళారు. స్నానం పూర్తి అయిన తర్వాత వస్త్రాలు ధరించి సూర్యదేవుని వైపు చూస్తూ నమస్కారం చేశారు.

అలంకారప్రియోవిష్ణుః అభిషేకప్రియశ్శివః నమస్కారప్రియస్సూర్యః గణేశస్తర్పణప్రియః దీపప్రియః కార్తవీర్యః దత్తస్తు స్మరణప్రియః హోమప్రియో మహేంద్రస్తు జగన్మాతార్చనప్రియా||

చక్కగా తులసిదళాలతో అలంకరిస్తే నారాయణుడు సంతోషిస్తాడు. అభిషేకం చేస్తే పరమేశ్వరునకిష్టం. నమస్కారాలు చేస్తే సూర్యుడికిష్టం. అందుకే సూర్య నమస్కారాలంటారు. తర్పణములు చేస్తే వినాయకుడు సంతృప్తిచెంది వరాలిస్తాడు. దీపం వెలిగించి కార్తవీర్యార్జునా! అంటే ఆ యింటికి చోరాది ఉపద్రవములు లేకుండా చూసుకొంటాడా సహస్ర బాహువు. స్మరిస్తే చాలు దత్తా! అనగానే దత్తాత్రేయస్వామి దిగివస్తాడు. ఇంద్రుడు యజ్ఞములంటే ఇష్టపడతాడు. జగన్మాత పరమేశ్వరి పూలతో కుంకుమతో పూజిస్తే సంతోషించి వరాలిస్తుంది.

అందుకని స్వామివారు సూర్యునకు నమస్కరించారు. అలా ప్రణతులు, ప్రణుతులు అర్పిస్తున్నవారి నోటినుండి కమనీయ కవిత ప్రవహించింది.

గీ॥ ప్రకృతిదేవీ పరిష్వంగ పారవశ్య మధురకల్పాంత రతిరసోన్మత్తుడైన విశ్వపురుషుడు కన్నులు విచ్చువేళ విరియు తొలిసంజమము నడిపించుగాక!

వింటున్న భక్తులు సువర్ణ సుందరమైన కవిత్వాన్ని వినే అదృష్టం ఇవాళ మాకు లభించిందని పొంగిపోయినారు. అక్కడి భక్తుడొకడు “స్వామివారూ! మీరు క్రిందటి జన్మలో యోగులయితే ఈ జన్మలో యోగీశ్వరులు” అని నమస్కరించాడు. స్వామివారు చిరునవ్వుతో “సరి! దానికేమి! ఆశ్రమానికి పోదాం పదండి" అని కదిలారు.

పీఠానికి వెళ్ళిన తరువాత కాసేపటికి మౌనస్వామి సమాధి దగ్గరకు వెళ్ళి ధ్యానంలో కూర్చున్నారు. మనోభూమికలో ఒక దృశ్యం కన్పిస్తున్నది. మౌనస్వామి, వారి గురువుగారు అచ్యుతానందసరస్వతీ స్వామి, చౌరంగీనాధ్ జలపాతాలపైన ఆకాశంలో కనిపిస్తున్నారు. అచ్యుతానందస్వామి ఇలా పలికారు. "సిద్ధేశ్వరా! ఈ జలపాతం భైరవస్వరూపం. ఇన్నాళ్ళు నీవు భైరవుని జప ధ్యానములలో కాళీవల్లభునిగా, కాశీ క్షేత్ర పాలకునిగా, హోమములో అగ్నిస్వరూపునిగా భావిస్తున్నావు. ఇకమీద జలభైరవునిగా కూడా అర్చించు. ఈ జలరూపుడైన మహాభైరవుడు సర్వప్రయోగములను, ఉపద్రవములను తొలగించి రక్షిస్తాడు. దీని మంత్ర తంత్ర విధానాలు నీకు తెలియజేయ బడుతున్నవి. మౌనస్వామి, చౌరంగీనాధుడు ఆశీర్వదించారు. వారదృశ్యులైనారు.

(చౌరంగీనాధ్ సారంగనాధుడు. తెలుగు భాషలో ఇతనిని గూర్చిన కథ నాటకంగా వచ్చింది. రాజమహేంద్రపురపాలకుడైన రాజరాజ నరేంద్రునకు రత్నాంగి, చిత్రాంగి భార్యలు. పెద్ద భార్య రత్నాంగి కుమారుడు సారంగధరుడు. చిన్న భార్య చిత్రాంగి యువకుడైన సారంగధరుని తన కామవాంఛ తీర్చమని కోరింది. ధర్మవిరుద్ధమని అతడు తిరస్కరించాడు. చిత్రాంగి మహారాజుతో సారంగధరుడు తనను బలవంతం చేస్తున్నాడని ఆరోపించింది. ఆ రాజు నమ్మి తన కుమారుని కాళ్ళు చేతులు నరికించాడు. వధ్యశాలలో జరిగిన ఈ దృశ్యాన్ని ఆకాశంలో వెళుతున్న మత్స్యేంద్రనాధుడనే సిద్ధుడు చూచి సారంగధరుని రక్షించి తనతో తీసుకొనివెళ్ళి సిద్ధుని చేశాడు. అయితే ఈ కథను చరిత్ర పరిశోధకులు కొట్టిపారేశారు. రాజరాజ నరేంద్రునకు రత్నాంగి, చిత్రాంగి అనే భార్యలుకాని సారంగధరుడనే కుమారుడుగాని లేరు. ఈ కథ తెలుగు దేశపు కథ కాదు. మహారాష్ట్రలో ఈ కథ జరిగింది. ఆ సారంగధరుడే చౌరంగీ నాధుడు. సిద్ధమార్గంలో నాధ సంప్రదాయం ప్రసిద్ధమైనది. మత్స్యేంద్రనాథ్ కథ సినిమాగా కూడా వచ్చింది. స్వామివారు యాత్రలకు వెళ్ళినప్పుడు ఉజ్జయినిలో మత్స్యేంద్రనాధునిదని చెప్పబడే సమాధిని, గోరఖ్నాధుని గుహను చూచారు. ఉజ్జయినిలో మహకాళి ఉన్నది. గోరఖ్నాధుడు చేసిన కాళీమంత్రం వేగనిద్ధిదాయకమైనది. కుర్తాళవీరానికి అచ్యుతానందసరస్వతీస్వామి నుండి సాధనలో నాధసంప్రదాయం ప్రవేశించింది)

ఈ మధ్య గడ్డాలు జడలు పెరిగిన ఒక యువకుడు వచ్చి అలఖ్ నిరంజన్ అంటూ పాదనమస్కారం చేశాడు. ఎవరు నీవు అంటే అతడు "స్వామివారు! నేను కాలేజీలో మీ దగ్గర చదువుకొన్నాను. ఉత్తరాదికి వెళ్ళి నాధయోగులలో చేరాను. ఇటీవల ఒక పెద్దాయన నీవు చదువుకొనేప్పుడు నీకు పాఠాలు చెప్పిన గురువుగారు ఇప్పుడు గొప్ప పీఠాథిపతి. సిద్ధపురుషుడు. వారిదగ్గరకు వెళ్ళి మంత్రోపదేశం పొందిరా! అని పంపించాడు. నన్ను ఆనుగ్రహించండి" అని ప్రార్ధించాడు. స్వామివారా యువకునిపై దయ చూపించారు. కొన్నాళ్ళు గుంటూరు కాళీ పీఠంలో ఉండి సేవచేసిన అతనిని పూర్వ మిత్రులు పలకరించి అతడు తిరుగుతున్న కొండలలో గుహలలో ఉండే విశేషాలను ఆసక్తితో తెలుసుకొన్నారు.

( సశేషం )

🌹🌹🌹🌹🌹

సిద్దేశ్వరయానం - 121 Siddeshwarayanam - 121

🌹 సిద్దేశ్వరయానం - 121 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 భైరవసాధన -3 🏵


ఆంధ్రదేశంలో చాలా చోట్ల భైరవాలయాలు ఉన్నాయి. ఉజ్జయినిలో, ఢిల్లీలో ఇంకా అనేక క్షేత్రాలలో ప్రసిద్ధమయిన భైరవాలయాలు ప్రకాశిస్తున్నాయి. దాదాపు ప్రతిచోట మద్యాన్ని నైవేద్యం పెట్టటం ఆచారంగా ఉంది. ఆంధ్రదేశంలో కడప జిల్లాలోని పులివెందుల దగ్గర మోపూరు గ్రామంలో కొండమీద బాలభైరవుని ఆలయమున్నది. ఆ దేవుని వర్ణన క్రీడాభిరామంలో వల్లభరాయడనే కవి ఇలా వర్ణించాడు.

సీ|| చంద్రఖండములతో సరివచ్చు ననవచ్చు విమల దంష్ట్రా ప్రరోహములవాని

పవడంపు కొనలతో ప్రతివచ్చు ననవచ్చు కుటిలకోమల జటాచ్ఛటల వాని

ఇంద్రనీలములతో నెనవచ్చు ననవచ్చు కమనీయతర దేహకాంతి వాని

ఉడురాజు రుచులతో నొరవచ్చు ననవచ్చు చంచన్మదాట్టహాసముల వాని

గీ॥ సిగ్గుమాలిన మొలవాని చిరుతవాని ఎల్లకాలంబు ములికినా డేలువాని

అర్థి మోపూర నవతారమైన వాని భైరవుని గొల్వవచ్చిరి భక్తవరులు.


అతడు భైరవుని ప్రత్యక్షం చేసుకొని సిద్ధసారస్వతశ్రీని పొందానని వ్రాసుకొన్నాడు. ఆ మోపూరి భైరవుని భక్తుడయిన ఒకరు ఇప్పుడు గోదావరి జిల్లాలో పుట్టి నా దగ్గరకువచ్చి కుర్తాళంలో భైరవసాధన మొదలు పెట్టాడు. అతడి జన్మరహస్యం కుర్తాళనాడీగణపతి సన్నిధిలో తెలియచేయబడింది. కుర్తాళంలో కుర్తాళ నాథేశ్వరుని ఆలయంలో సుందరమైన భైరవ విగ్రహం ఉన్నది. అక్కడే మౌనస్వామి చాలా కాలం తపస్సు చేశాడు. దక్షిణదేశంలో చాలా చోట్ల శివాలయాలలో, కుమారస్వామి ఆలయాలలో భైరవ విగ్రహాలున్నవి. ప్రాచీనులు ఎప్పుడో ఆ ఆలయాలను నిర్మించారు. కానీ భైరవునికి పూజలు జరగటం అంతగా కన్పించటం లేదు. కుర్తాళం సిద్ధేశ్వరీ పీఠంలోను, గుంటూరులో సిద్ధేశ్వరీ వీఠమందిరంలోను, విశాఖపట్టణంలోని లలితాపీఠంలోనూ కాలభైరవునకు ఆలయాలు కట్టించాను. అక్కడ నిత్యపూజలు జరుగుతున్నవి. మందార వారుణీ మద ఘూర్ణితాత్ముడు, డమరు, ఖట్వాంగ కపాలపాణి, కుర్కుర పరివార కోటిసేవితుడైన ఆ భైరవుని స్తుతిస్తూ నేను చెప్పిన పద్యాలను చూడండి.


శ్లో॥ నమో భూతనాధం నమః ప్రేతనాథం నమః కాలకాలం నమోరుండమాలం

నమః కాళికా ప్రేమలోలం కరాళం నమో భైరవం కాశికా క్షేత్రపాలం

సీ ॥ హాలామదాలోల లీలా విలాసాయ భవ నమస్తే కాలభైరవాయ

కాళికా సురత శృంగార సంప్రీతాయ వర నమస్తే కాలభైరవాయ

డమరు కృపాణ దండ కపాలహస్తాయ భర్గ నమః కాలభైరవాయ

అట్టహాస పలాయితాంతకాయ హరాయ వందనం తే కాలభైరవాయ


లోకములో కొందరు ప్రేమోన్మాదులు. కొందరు దివ్యోన్మాదులు. నేను మంత్రోన్మాదిని. వ్యాసుని రచనలు చూచి కాశీకి వెళ్ళాలి. గంగలో స్నానం చేయాలని చాలా సార్లు అనుకొనేవాడిని. నీ అనుమతి వస్తేనే గదా ఎవడైనా ఆ పంచక్రోశపరీత క్షేత్రంలో అడుగు పెట్టేది. ఎలానో వచ్చాను. నీ వెలుగు కోసం వెదుకుతున్నాను. అన్నట్లు మొన్న నీ ద్వీపానికి వెళ్ళి వచ్చాను. అక్కడ నీ దర్శనమైన తర్వాత అది నీ నివాసమైన భైరవ ద్వీపమని తెలుసుకొన్నాను. నా అనుచరుడు కూడా స్వామీజీ! ఇక్కడి కిదివర కెప్పుడో వచ్చినట్లు అనిపిస్తున్నది అన్నాడు. నిజమే ! ఇక్కడ నీవు కాళీదేవితో విహరించావు. ఎన్ని జన్మల నుంచో అప్పుడప్పుడు వచ్చి నిన్ను సేవిస్తూనే ఉన్నాము.

పూర్వం ఒక జన్మలో జాతకరీత్యా మారక సమయం వచ్చింది. గ్రహముల శక్తిని ఎదిరించే ఆశ పోయింది. అయినా నిన్ను నమ్మి భజించాను. మృత్యువు దూరంగా వెళ్ళిపోయింది. నా భక్తి భరిత సాధనకు సంతోషించి నన్ను మహాసిద్ధుని చేశావు. నాధ సంప్రదాయంలో తపస్సు చేసినందువల్ల అందరూ నన్ను భైరవనాధుడన్నారు. ఆనాడు నన్ను ఎలా ఉద్ధరించావో ఓ ప్రభూ ! ఈనాడు కూడా ఆవిధంగానే రక్షించు.

కాశీలో భూగుహలున్నవని చెప్పబడే ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆది యుగాలలో జైగీషవ్యుడనే మునిగా నే నక్కడ ఉన్నట్లు స్ఫురించింది. అలానే హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక చోట నివసిస్తూ అనూరాధ అనే ఒక దేవకన్యను పెండ్లి చేసుకొని సంతానాన్ని కన్న తరువాత విశ్వామిత్రుని కథలో మేనకవలె ఆమె విడిచి వెళ్ళిపోయిందని తెలిసింది. క్షేత్రంలో రకరకాల అనుభూతులు. నావే కాక నాతో పాటున్న ఎందరివో జన్మ రహస్యాలు, దేవతలు, సిద్ధులు తెలియచేస్తున్నారు. ఏమైనా ఇప్పుడు బృందావనము, కాశీ, కుర్తాళము ఈ మూడూ ప్రధాన కేంద్రాలుగా నా తపస్సాధన సాగుతున్నది.

వేల సంవత్సరాలనుండి అనేక దివ్యక్షేత్రముల వలె కుర్తాళం కూడా ఒక అద్భుత సిద్ధక్షేత్రం. అగస్త్య మహర్షి దీనిని మహనీయ యోగకేంద్రంగా తీర్చిదిద్దాడు. ఎందరో మహాయోగులు తపస్సు చేసిన స్థలమిది. ఇప్పటికి గుర్తువచ్చినంత వరకు నాలుగు వేల ఏండ్ల క్రింద నేను ఇక్కడకు మొదటిసారి వచ్చాను. మహనీయుడైన మౌనస్వామి కూడా వచ్చారు. అప్పటినుండి ఈ స్థలంతో ఈ క్షేత్రంతో ఇక్కడ యోగులతో అనుబంధం. ఇక్కడి యోగులు మరెక్కడ పుట్టినా, మరెక్కడ నివసిస్తున్నా వారితో పరిచయం పునరావృతమౌతూనే ఉన్నది. అందుకే ఇది సిద్ధిస్థానం. ఇక్కడకు వచ్చి తపస్సు చేయండి. శీఘ్రంగా ఫలిస్తుంది అని యెలుగెత్తి ఉద్బోదిస్తున్నాను.

( సశేషం )

🌹🌹🌹🌹🌹


సిద్దేశ్వరయానం - 120 Siddeshwarayanam - 120

🌹 సిద్దేశ్వరయానం - 120 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 భైరవసాధన -2 🏵


ఇటీవల తమిళనాడులోని ఒక సీనియర్ ఐ.ఎ.యస్. అధికారి కుర్తాళం వచ్చి మౌనస్వామి దర్శనం చేసుకొని ఆ తరువాత నా దగ్గరికి వచ్చాడు. తనను పరిచయం చేసుకొని నా ఫోటో ఒకటి తీసుకోవటానికి అనుమతి కోరాడు. 'తీసుకోండి మీఇష్టం' అన్నాను. తాను తీసిన ఫోటోలను ఆ కెమెరాలో అప్పటికప్పుడు చూపించాడు. ఆ ఫోటోలో నా చుట్టూ మూడు నక్షత్రాలు ప్రక్కనే ఒక నల్లని కుక్క కన్పిస్తున్నవి. ఇవి ఎలా వచ్చినవని ప్రశ్నించాను. అప్పుడు ఒకటికి నాలుగు సార్లు చూచి చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. ఇటువంటి మహిమను నే నెన్నడూ చూడలేదు. అన్నాడు. అప్పుడు అక్కడ ఉన్న భక్తులందరూ ఆ చిత్రాన్ని చూచారు. అతడు తన వెబ్సైట్లో ఆ ఫోటోలను పెట్టి కుర్తాళంలో మిరకిల్ అన్న శీర్షిక క్రింద తన అభిప్రాయాన్ని వ్రాసుకొన్నాడు. అది అతని విశ్వాసానికి చిహ్నం.

కొందరికి తమ ధ్యాన దర్శనాలు ప్రమాణమయితే కొందరికి తమ బాధానివారణ ప్రమాణం. కొందరికి తమ స్వప్నానుభవాలు ప్రమాణం. దేవతాత్మకములైన కలలు సత్యార్థ గంధులని జగద్గురు శంకరులు చెప్పిన వాక్యాన్ని వారు ప్రమాణంగా భావిస్తారు. భైరవునితో నాకు ఏర్పడిన ఈ అనుబంధం వల్ల ఆ స్వామిని గూర్చి పురాణ, తంత్ర గ్రంథ విశేషాలతో 'భైరవసాధన' అన్న ప్రత్యేక గ్రంథమొకటి రచించాను. దానిలోని కొన్ని పద్యాలను ఉదాహరిస్తున్నాను.

ఉ రజ్జువు దాల్చి వచ్చు యమరాజును వెన్కకు పంప గంగ లో మజ్జన మాచరించి నిశి మధ్యను ధ్యానముసేయ శూలియై గజ్జెల నొప్పు స్వీయ పదకంజములన్ గనిపింపజేయు నా కజ్జల రూపునిన్ దలతు కాశిక నేలెడు కాలభైరవున్.

పాశమును ధరించి వచ్చే యమధర్మరాజును వెనుకకు పంపటం కోసం గంగలో స్నానం చేసి అర్ధరాత్రి ధ్యానం చేస్తూంటే కాళ్ళకుగజ్జెలతో, చేతిలో శూలంతో, కాటుక కొండవలె కన్పించిన కాశీపాలకుడైన కాలభైరవుని స్మరిస్తున్నాను.

(గమనిక : పూర్వకాలంలో కాటి కాపరులు ఊళ్ళోకి వచ్చేటపుడు తమ రాకను తెలియ చేయటం కోసం కాళ్ళకు గజ్జెలు కట్టుకొని వచ్చేవారు).

ఉ దుర్జయ కాలదండధరుదూరముగా పరుగెత్త జేయు నీ గర్జనమీద మోజుపడి కాశికి వచ్చితి శబ్దశాసనో పార్జితమైన నాదు కవితాకృతి నర్పణసేయుచుంటి నో

నిర్జరపూజ్యపాద ! ఇక నీదగు చిత్తము నాదు భాగ్యమున్

దండధరుడైన కాలుడు దుర్జయుడు. అతనిని గెలవటం ఎవరికీ సాధ్యం కాదు. అతనిని, దూరంగా పలాయనమయ్యేటట్లు చేయగలిగినది నీ గర్జన మాత్రమే. దానిమీద మోజుపడి కాశీకి వచ్చాను. శబ్ద ప్రపంచం మీద నేను కొంత సాధన చేసి ఉన్నాను. నాకు కవితాశక్తి ప్రాప్తించింది. ఓ దేవపూజ్య చరణా ! దానిని నీకు అర్పిస్తున్నాను. ఇక నీ చిత్తము, నా భాగ్యము.

చం॥ గమనిక నీదు పాదముల గజ్జెలచప్పుడు నట్టహాసమున్ డమరుక నాదమున్ శునక డంబరమున్ గురుతింప శ్రద్ధతో నెమకుచునుంటి కాశిపురి నీదగు మంత్రజపంబు సేయుచున్

సమయము దాటుచున్న యది స్వామి ! ననున్ కరుణింపు మింతకున్.

నీ పాదముల గజ్జెల చప్పుడు, నీ అట్టహాసం, నీ చేతిలోని డమరుకపు చప్పుడు, నీతో ఉన్న శునకముల ఆడంబరము గుర్తించటం కోసం నీ మంత్రజపం చేస్తూ కాశీలో వెదుకుతున్నాను స్వామీ ! సమయం దాటిపోతున్నది. ఇకనైనా దయచూపించు.

ఉ॥ అచ్చపు భక్తితో నొక శతాబ్దము క్రిందట వచ్చి యిచ్చటన్ ముచ్చటతోడ నీ కడనె మోహనరాగము పాడినాడ న న్నెచ్చటనో జనించుటకు నెందుకు పంపితి వైన నేమి ! నే వచ్చితి గుర్తు వచ్చె ప్రభువా! మరి నన్నెటు పంపబోకుమా !

ఓ ప్రభూ ! ఒక శతాబ్దం క్రింద ఇక్కడకు వచ్చి నీ పాదము లాశ్రయించి నీకు పూజలు చేశాను. చేతనైన విధంగా నిన్ను గూర్చి పాటలు పాడాను. నన్ను ఎక్కడనో పుట్టటానికి ఎందుకు పంపించావు ? పోనీలే! గుర్తు వచ్చేటట్లు చేశావు కదా! ఇక నన్ను ఎక్కడికి పంపవద్దని ప్రార్థిస్తున్నాను.

స్వామీ ! వయస్సు పైనబడుతున్నది. వెనుకటి వలె తీవ్రసాధనలు చేయగల శక్తి లేదు. ఓపిక లేదు. నీ దయను నమ్ముకొని ఇక్కడకు వచ్చాను. ఆశ్రయించిన వారిని రక్షించే దేవరవు నీవు. నన్ననుగ్రహించు. ఈ భావాలతో ఆయనను ప్రార్థించాను.

( సశేషం )

🌹🌹🌹🌹🌹

సిద్దేశ్వరయానం - 119 Siddeshwarayanam - 119


🌹 సిద్దేశ్వరయానం - 119 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 భైరవసాధన - 1 🏵

కొద్దికాలం క్రింద ఒక ఉద్యోగిని చిత్రమైన సమస్యతో వచ్చింది. ఆమెకు ఇద్దరు కుమారులు. పుత్రులిద్దరూ మంచి ఉద్యోగంలో ఉన్నారు. ఒకడు అమెరికాలో ఉన్నాడు. మరొకడు పోలీసు శాఖలో ఇన్స్పెక్టర్ జనరల్ గా ఉన్నాడు. కూతుళ్ళిద్దరు ఉన్నారు. వారు కూడా బాగానే ఉన్నారు. ఇంతలో భర్త మరణించాడు. సహజంగా దుఃఖహేతువే. అయితే ఎంత అనుబంధం కలవారికైనా కొన్నాళ్ళకు దుఃఖతీవ్రత తగ్గుతుంది. కానీ ఈమెకు తగ్గలేదు. నెలలు గడుస్తున్నవి. సంవత్సరాలు గుడుస్తున్నవి. శోకమాగదు. ఆమె నడిగితే ఎందుకమ్మా! ఇంత దుఃఖిస్తున్నావు అంటే 'ఏమో నాకు తెలియదు. వద్దనుకున్నా ఆగకుండా ఏడుపు వస్తున్నది. ఆపటం నా తరం కావటం లేదు" అన్నది.

ధ్యానంలో చూస్తే అది ఆమె దుఃఖం కాదు. ఆమె భర్త మరణించినా ఆమెను విడిచిపెట్టలేక ఆమెను పట్టుకొన్నాడు. ఆ దుఃఖం అతని దుఃఖం. ఆమెది కాదు. భైరవుని ప్రార్థిస్తే ఆస్వామి అతనిని ప్రక్కకు తప్పించి ఉత్తమ గతికి పంపించాడు. ఇప్పు డామె ప్రశాంతంగా ఉన్నది. తన స్వగ్రామంలో ఒక గుడిని కట్టించి అక్కడ సేవ చేసుకొంటూ కాలం గడుపుతున్నది.

కొన్ని సంవత్సరాల క్రింద ఇటువంటిదే ఒక సంఘటన జరిగింది. ఒక వృద్ధస్త్రీ తీవ్రవ్యాధిగ్రస్తురాలయి మరణించింది. ఆమెకు ఒక్కతే కూతురు. ఆ అమ్మాయికి పెళ్ళిచేసింది. ఆ అమ్మాయి భర్తతో కాపురం చేసుకొంటున్నది. కొంతకాలానికి తల్లి ఏ వ్యాధితో మరణించిందో ఈ అమ్మాయికి కూడా అదే వ్యాధి వచ్చింది. తెలిసినవారితో వచ్చి ఆ అమ్మాయి తన వ్యాధిని గూర్చి నివేదించినపుడు చూడగా ఆ అమ్మాయిలో ఆమె తల్లి కన్పిస్తున్నది. “ఇదేమిటమ్మా! నీ కూతురంటే నీకు ప్రేమకదా? అమ్మాయిని పట్టుకొని పీడిస్తున్నావేమిటి ? అని అడిగాను. దానికి ఆమె సమాధానం ఇలా చెప్పింది. "అయ్యా ! మా అల్లుడు అమ్మాయిని సరిగా చూసుకోవటం లేదు. నేను దీనిని తీసుకు వెళ్ళి నా దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చూచుకొంటాను.” నేను ఆశ్చర్యంతో "అదేమిటమ్మా! నీ బిడ్డ కదా ! చంపుతావా?" అన్నాను. “చంపితే ఏమి ? నేను చావలేదా ? చావనేది ఒక మజిలీయే కదా! పాంచ భౌతిక శరీరం నుండి మరో శరీరంలోకి మారే స్థలం సమయమది" అని ఆమె అన్నది.

అప్పుడు నేను "అమ్మా! ఈ అమ్మాయిని కొంతకాలం ఇక్కడ ఉండనియ్యి. నీవు వెళ్ళిపో నీకూతురు బ్రతికి ఉండాలని కోరుతున్నది. ఆమెకు ఇప్పుడు రావాలని లేదు" అని చెప్పి దేవతాను గ్రహం వల్ల ఆమెను అవతలకు పంపించి వేశాను. శత్రుత్వం తోటో, ప్రయోగం వలననో లేక కర్మవశాననో కాక ప్రేమతో కూడా ప్రేతములు మనుష్యులను బాధిస్తవి అన్న సంగతిని చూచాను.

కాశీలో కాలభైరవునితో అనుబంధము రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. ఊరికి ఒక వైపు చివర కపాలమోచన తీర్థం. రుద్రుడు బ్రహ్మ అయిదవ శిరస్సును ఛేదించగా బ్రహ్మహత్య ఆవహించి ఆ కపాలము చేతికి అంటుకొని భైరవుడై ఆ పునుకతో భిక్షాటనం చేసి దానిలో భుజిస్తూ లోకాలన్నీ సంచారం చేసి చివరకు కాశీలో అడుగు పెట్టినపుడు ఆ కపాలం క్రింద పడిపోయింది. అక్కడ కపాలమోచనతీర్థం రూపొందింది. అక్కడ భైరవుని కపాల భైరవుడంటారు. శ్రీనాధుడు తన కాశీఖండంలో “అదెవిధాతృ కపాల మవని వ్రాలిన చోటు, వాడె శ్రీమత్కాలవటుకరాజు" అని వ్రాశాడు. అతడే కాలభైరవుడని, వటుక భైరవుడని కొందరి అభిప్రాయము.

ఏదైనా, ఆలయాలకు సంబంధించినంత వరకు విశ్వనాధుడి ఆలయంతో సహా ప్రాచీన స్థానాలు మహమ్మదీయుల దండయాత్రల వల్ల ధ్వంసమై తరువాతి కాలలో ఎక్కడెక్కడో పునర్నిర్మించబడినవి. ఎక్కడ నిర్మించినా భక్తుల పూజలు అందుకోటానికి ఆయా దేవత లక్కడికి వస్తూనే ఉంటారు. కపాలభైరవ మందిరానికి వెళ్ళినప్పుడు మొదటిసారి అక్కడ అడుగుపెట్టగానే భైరవుడు, అతని భార్య కాళి - అక్కడ కాళీవిగ్రహం కూడా ఉన్నది. ఇద్దరూ సాక్షాత్కరించారు. కాశీ వెళ్ళినప్పుడల్లా అక్కడికి వెళ్ళి జపహోమ ధ్యానములు చేస్తూ నా శిష్యుల చేత చేయిస్తూ ఉన్నాను. ఒక రాత్రి యజ్ఞం చేస్తుంటే హోమకుండంలో నాలుగు వందల సంవత్సరాల వయసున్న ఒక బలిష్ఠ కాపాలికుడు దర్శన మిచ్చాడు. నాకే కాక నాతో వచ్చిన అనేకులకు అక్కడ దివ్యాను భూతులు కలిగినవి.

( సశేషం )

🌹🌹🌹🌹🌹


సిద్దేశ్వరయానం - 118 Siddeshwarayanam - 118

🌹 సిద్దేశ్వరయానం - 118 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 భైరవసాధన 🏵

బృందావనేశ్వరి -రాధాదేవి, సిద్ధశక్తి స్వరూపిణి - కాళీదేవి, పీఠాధిదేవత లలితాదేవి. జీవితంలో ప్రధాన స్థానం ఆక్రమించుకొని ఉండగా పర్వతాగ్రం నుండి జలపాతం దూకినట్లుగా నాలోకి భైరవుడు ప్రవేశించాడు. అభౌమ భూమికల నుండి కాలభైరవ మంత్రోపదేశం జరిగింది. కాశీ వెళ్ళి అక్కడ ఈ మంత్రసాధన చేయాలన్న వాంఛ ప్రబలమైంది. అంతకుముందు కాశీకి తల్లిదండ్రుల అస్థి నిమజ్జనం కోసం ఒకసారి వెళ్ళటం జరిగింది. ఇప్పుడు పీఠాధిపతిగా సపరివారంగా సుమారు వందమందితో వారణాసి చేరుకొన్నాము. వెళ్ళిన రెండురోజులకు నాతో వచ్చిన ముగ్గురికి మరణగండం ఉందని కాలభైరవుడు తెలియచేశాడు. ఆ ముగ్గురు నాకు అత్యంత సన్నిహితులు. వారిని రక్షించమని ప్రార్థించాను. ఆ రోజు రాత్రి కాలభైరవ మంత్రాన్ని జపం చేశాను. నాతో వచ్చినవారిలో ఒకరికి పక్షపాతం వచ్చింది. తాత్కాలికంగా వైద్యసేవ చేయించి ఆసుపత్రిలో చేర్చటం జరిగింది. తలలో రక్తప్రసారానికి ఏదో ఆటంకం కల్గిందని, కపాలానికి రంధ్రం చేసి శస్త్ర చికిత్స చేశారు. రెండు రోజులలో అతడు మామూలు మనిషి అయినాడు. ఇప్పుడతడు అవసరమైనప్పుడల్లా కాలభైరవునికి మ్రొక్కు కొంటున్నాడు. అతని కష్టం తీరుతున్నది. నాతోపాటు ప్రతిసారి కాశీ వచ్చి కాలభైరవునకు మ్రొక్కు చెల్లించుకొంటున్నాడు.

మరొకరి విషయంలో భైరవుడు బస్సు ప్రమాదాన్ని సూచించాడు. మరునాడు వీరు మరికొందరు బస్సులో గయ బయలుదేరుతున్నారు. నేను మొదట్లో వెడదామని అనుకోలేదు. కానీ ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది. భైరవాలయానికి వెళ్ళి నమస్కరించాను. అర్చకులు నల్లని పూలమాల ఇచ్చారు. స్వామికి దేవా ! వీరికి ప్రమాదం తప్పాలి. నేను కూడా ఆ బస్సులో వెడుతున్నాను. ఆ పైన నీ దయ అని విన్నవించి ఆ పుష్పమాలతో నేను కూడా వెళ్ళి బస్ కూర్చున్నాను. ఎర్రని కన్నుల భైరవుని నల్లని నవ్వు నెమ్మదిగా వెన్నెలలాగా తెల్లగా మారటం కన్పిస్తున్నది. బస్సుకు ఏ ప్రమాదమూ జరుగలేదు. ఈ మధ్య బృందావనంలో కూడా ఒక విచిత్రం జరిగింది. రాధాకృష్ణుల చిత్రపటం ఎదురుగా ఉన్నది. ఆ రోజు ననాతన గోస్వామి పూజించిన మదనగోపాలునిఆలయానికి వెళ్ళటం అక్కడి మహంతు సుపరిచితుడు కావటం వల్ల దేవతలకు అలంకరించిన ఒక పూలమాలను ఇవ్వటం, నా మామూలు పద్ధతిలో దానిని ధరించి జపం చేయటం జరుగుతున్నది. శ్యామల కోమల దేహంతో మురళీధరుడు వచ్చి నించొన్నాడు. రాధాదేవి దూరం నుంచి నెమ్మదిగా వస్తున్నట్లు అనిపిస్తున్నది. ఇంతలో శ్వానసహితుడై భైరవుడు వచ్చాడు. ఆశ్చర్యం ! రాధాదేవి నుండి గౌరకాంతి కిరణాలు ప్రసరిస్తుంటే భైరవుడు, శునకము రెండూ తెల్లగా మారి ప్రసన్నాకృతి ధరించటం జరిగింది. బృందావనధామానికి అధీశ్వరి అయిన రాధాదేవి సామ్రాజ్యంలోకి నా మీది ప్రేమతో అడుగు పెట్టిన భైరవుడు కూడా ఆమె ప్రభావం వల్ల ధవళసాత్వికమూర్తిగా మారాడు.

భైరవుడు చాలామందికి జరగబోయే ఆపదలను ముందు తెలియచేస్తున్నాడు. ఒకసారి నేను నెల్లూరులో భాగవతసప్తాహ ప్రవచనాలు చేస్తున్నాను. నా బాల్య మిత్రుడొకడు మంచి రచయిత. నాకు తన గ్రంథము నొకదానిని అంకితం చేశాడు కూడా. భైరవుడు ఒక రోజు కనిపించి 'అతనికి మృత్యువు రాబోతున్నది' అన్నాడు. రక్షించమని అడగబోతున్నాను ఇంతలోనే నవ్వుతూ “అతని ఆయువు అయిపోయింది. మరణం తప్పదు. నీకు మిత్రుడు కనుక ముందు తెలియచేశాను" అని అదృశ్యమైనాడు. కొద్ది రోజులకే నిర్దిష్ట సమయానికి ఆ మిత్రుడు మరణించాడు. అతని కుమారుని విషయంలోనూ ఇటువంటిదే ఒక చిత్రం జరగింది. అతనికి ముగ్గురు కుమారులు. మధ్యవాడు పెరిగి పెద్దవాడవుతుండగా పోలియోనో లేక పక్షవాతమో వచ్చి వికలాంగు డయినాడు. అన్నీ మంచంలోనే. అతనిని బాగు చేయమని స్నేహితుడర్థించాడు. ఆశ్రమంలో ఆ బాలుని కోసం హోమం చేయించాను. ఆనాటి రాత్రి అతని సూక్ష్మదేహం కనిపించి “నా కోసం ఏ మంత్ర ప్రయోగములు హోమములు చేయించవద్దు. నేను పూర్వజన్మలో ఒక యోగిని. చేసిన కొంత దుష్కృతం ఇంకా అనుభవించవలసి ఉన్నది. దానికోసం జన్మ ఎత్తాను. ఆ మిగిలిన కర్మ ఈ వ్యాధి రూపంలో అనుభవించి త్వరలో నేను వెళ్ళిపోతాను. ఆ తరువాత నాకు మళ్ళీ మంచి జన్మవచ్చి తపస్సాధన చేస్తాను” అని చెప్పింది. అనంతరం కొద్దిరోజులకే అతడు మరణించాడు. జీవుల ప్రయాణంలో జరిగే ఇటువంటి చిత్రవిచిత్రాలను భైరవుడు తెలియ చేస్తున్నాడు.

( సశేషం )

🌹🌹🌹🌹🌹


సిద్దేశ్వరయానం - 117 Siddeshwarayanam - 117

🌹 సిద్దేశ్వరయానం - 117 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 13 🏵


కొద్ది కాలం క్రింద మదరాసులో ఒక ప్రముఖుని ఇంటిలో పాదపూజ జరిగింది. మౌనస్వామి నామావళితో పీఠపాదుకలకు ఆగమోక్త విధానంలో అర్చన చేయటం జరిగింది. ఆ సమయంలో పూజ చేసే దంపతులు నా పాదములను కడిగి ఆనీరు శిరస్సుపై చిలకరించుకొని ఆ నీటి పళ్ళాన్ని ప్రక్కన పెట్టారు. పూజ పూర్తయిన తరువాత నేను మరొక గదిలోకి విశ్రాంతి తీసుకోవటానికి వెళ్ళాను. ఆ సమయంలో 'రేకీ' మార్గంలో సాధన చేసిన అతని మిత్రుడు యాదృచ్చికంగా వచ్చాడు. ఈ హడావుడి అంతా చూసి అడిగి విషయం తెలుకుకొన్నాడు.

"నీవు చదువుకొన్న వాడవు, వివేకమున్నవాడవు. దేవాలయానికి వెళ్ళటం దేవునికి పూజచేయటం అంటే నేను అర్థం చేసుకోగలను కానీ, మనుష్యులకు పూజ చేయటం ఏమిటి ? వాళ్ళ కాళ్ళు కడిగిన నీళ్ళు నెత్తిన చల్లుకోవటం ఏమిటి? ఈ పద్ధతులు, ఈ ఆచారాలు అర్థం లేనివి" అని అతడు ఆక్షేపించాడు. మాట్లాడుతూ జేబులో ఉన్న ఏదో ఒక వస్తువు తీయటం కోసం దానిలో పైన ఉన్న వస్తువు ఒకటి చేతిలో పట్టుకొన్నాడు. అది స్ఫటికంతో చేసిన ఒక పరికరం. ఒక వస్తువులో కాని, మనిషిలో కాని ఉన్న దివ్యశక్తిని కొలిచే సాధనం. అది అతడు చేతిలో పట్టుకోగానే తీగకు వ్రేళాడుతున్న ఆ స్పటికం కాళ్ళు కడిగిన నీళ్ళున్న పళ్ళెం వైపు కదలటం మొదలు పెట్టింది. అతడికి ఆశ్చర్యం కలిగి ఆ పరికరాన్ని కొంచెం దగ్గరికి తీసుకువెళ్ళాడు. అదివర్తులాకారంలో గిరగిర తిరగటం మొదలు పెట్టింది.

“ఈ నీళ్ళలో ఏదో దివ్యశక్తి ప్రవేశించింది. ఆ చిహ్నాలను ఈ పరికరం చూపిస్తున్నది. స్వాముల వారి కాళ్ళు కడిగిన నీళ్ళలో ఇంత అద్భుత శక్తి ఉండటం విచిత్రంగా ఉన్నది" అన్నాడు అతడు. ఆ నీళ్ళలో అపూర్వమైన దైవచైతన్యమున్నట్లు గృహస్థు గ్రహించి ఒక గిన్నెలో ఆ నీళ్ళు పోసి ఫ్రిజ్లో పెట్టుకొని రోజూ తాను తన కుటుంబసభ్యులు శిరస్సున చల్లుకొంటున్నారు. అతడు కుర్తాళంలో ఉత్సవాలు జరిగినపుడు వచ్చి ఒక సమావేశంలో ఈ విషయాన్ని తెలియచేశాడు. భక్తులు సాధకులు అప్పుడప్పుడు ఇటువంటి అనుభవము లెన్నింటినో తెలియ చేస్తున్నారు.

నేను మొదటిసారి చాతుర్మాస్యం కుర్తాళంలో చేస్తున్నపుడు వచ్చిన భక్తులు ఇక్కడ కొంతకాలం మీతో పాటు ఉంటూ సాధన చేసుకొంటాము. అందరూ కలసి చేసే యజ్ఞమేదైన నిర్దేశించండి అన్నారు. “సర్వదేవతామంత్రముల సిద్ధికి కారకమైనది- గురుకృప - ఇక్కడ దత్తస్వరూపుడైన మౌనస్వామి గురువు. కనుక గురుమంత్రంతో యజ్ఞం చేయండి అన్నాను. యజ్ఞం ప్రారంభించి హోమాగ్నిలో ఆవాహన చేయంగానే మౌనస్వామి యొక్క అవతరణాన్ని మొదటిసారి గమనించిన వారు రామకృష్ణానంద భారతీస్వామి. “అడుగో! మౌనస్వామి వచ్చాడు. హోమకుండంలో నాకు కన్పిస్తున్నాడు” అన్నాడు ఆయన. అందరూ ఎంతో భక్తి ప్రపత్తులతో చేసిన ఆ గురు యజ్ఞం సిద్ధగురు కరుణను అందరిమీద ప్రసరింపచేసింది. యజ్ఞసమయంలో ప్రతిరోజూ పగలు యజ్ఞం రాత్రి పూట ధ్యానం జరుగుతూండటం కుర్తాళంలో అలవాటుగా మారిపోయింది. ఒకనాటి అర్థనిశా సమయంలో ధ్యానం చేస్తున్న వారిలో ఉన్న ఒక సన్యాసిని ఉన్నట్లుండి కిందపడిపోయింది. ఎవరూ గమనించలేదు.ఆమెకు స్పృహ తప్పిపోయే స్థితి వచ్చింది. నెమ్మదిగా పాకుతూ వచ్చి నా కాళ్ళు పట్టుకున్నది. ఒక్క క్షణం ఆమె వైపు చూచాను. ఒక భయంకరమైన పెద్ద కుక్క ఆమె గొంతు పట్టుకు కొరుకుతున్న దృశ్యం కన్పిస్తున్నది. నేను తీక్షణంగా చూడగానే ఆ కుక్క ఆమెను వదలి వెనక్కు వెళ్ళిపోయింది. చాలా కాలం క్రింద ఆమెను ప్రేమించిన ఒక యువకుడు ఆమె తిరస్కరించగా కోపం ద్వేషంగా మారి ఒక క్షుద్రమాంత్రికుని పట్టుకొని ప్రయోగం చేయించాడు. అది కాలభైరవ ప్రయోగం. ఆ ప్రయోగ పిశాచం శునక రూపంలో ఆమెను పీడిస్తున్నది. ఆ ప్రయోగ బాధా నివారణకు కావలసిన జప హోమములు చేయించి మౌనస్వామి అనుగ్రహం వల్ల ఆమెకు స్వస్థత చేకూర్చటం జరిగింది.

ఈ విధంగా ఇవాళ ఎందరో ఇక్కడకు వచ్చి, మౌనస్వామి అనుగ్రహం వల్ల తమ బాధల నుండి విముక్తులవుతున్నారు. తనకు సేవచేసిన ఒక వ్యక్తి ఇప్పుడొక తమిళునిగా జన్మించాడని, అతని పేరు చెప్పి అతడు వచ్చినపుడు మంత్రోపదేశం చేసి మంత్రసిద్ధి వేగంగా కలిగేలా ఆశీర్వదించమని చెప్పారు. ఆ తరువాత కొద్దిరోజులకే అతడు రావటం అతనికి చేయవలసిన ఉపదేశం చేయటం జరిగింది. దాని ఫలితంగా అతను తీవ్రసాధన చేసి ఎన్నో దివ్యానుభవాలను పొందుతున్నాడు. సిద్ధశరీరంతో మౌనస్వామి చేస్తున్న పనులు అసామాన్యమైనవి. ఆయన భౌతిక శరీరంతో ఉండగా తన పూర్వ పరజన్మల గురించి ఎవరితోనూ చెప్పినట్లు దాఖలాలు లేవు. నా మీద అభిమానం వల్ల, అనుగ్రహం వల్ల ఆయన సమాధి ముందు కూర్చొని ధ్యానం చేసినపుడు ఆయా విశేషాలను ఎన్నింటినో తెలియచేయటం వల్ల వాటిని ఉల్లేఖించే అవకాశం కలిగింది. వీటితో పాటు అక్కడకు అప్పుడప్పుడు వస్తున్న సిద్ధులు తోటలోని అయ్యప్ప గుడి దగ్గర కన్పిస్తున్న మళయాళ మాంత్రికుడు ఆశ్రమంలో అశరీరి అయి తిరుగుతున్న తంజావూరుస్వామి, వస్తూ పోతూ ఉన్న మహావతార్ బాబా, భాస్కరాచార్యుల వంటి మహనీయులు తెలిపిన విశేషాలెన్నో ఈ చరిత్ర కథనంలో చోటుచేసుకొన్నవి.

( సశేషం )

🌹🌹🌹🌹🌹

సిద్దేశ్వరయానం - 116 Siddeshwarayanam - 116

🌹 సిద్దేశ్వరయానం - 116 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 12 🏵


నేను కుర్తాళ పీఠాధిపతినైన తరువాత సహజ పరిణామంగా సిద్ధేశ్వరీపీఠం కూడా జప, ధ్యాన, హోమ కేంద్రంగా మారిపోయింది. అక్కడ ప్రత్యేకంగా యజ్ఞశాల అంతకుముందే అనేక కుండాలతో నిర్మించబడి ఉండటం వల్ల ఒకే సమయంలో వివిధ సాధకులు తమ మంత్రములతో హోమాలు చేసుకోవటానికి ఏర్పాట్లు చేయబడినవి. జపపురశ్చరణలు చేసిన అనేకులు ఇప్పుడు దశాంశ హోమాలు చేసుకోవటానికి కుర్తాళానికి వస్తున్నారు. ఇప్పుడు వసతి గృహంలోని గదులన్నీ నిండిపోతున్నవి. నిరంతర హోమధూమములతో ఆకాశం మేఘావృతమైనదా అనిపిస్తున్నది. వైదిక సంప్రదాయములో వేదమంత్ర సాధనచేయటానికి ఉపనయనమైన వ్యక్తులు మాత్రమే అర్హులు. కానీ తంత్రోక్తమైన మంత్రములు చేయటానికి అందరికీ అర్హత ఉన్నది. స్త్రీలు, పురుషులు అన్ని కులముల వారు అన్ని జాతుల వారు అర్హులే.

మేరుతంత్రము, శారదాతిలకతంత్రము, మంత్రమహోదధి, శాక్త ప్రమోదము మొదలైన ప్రామాణిక గ్రంథాలు వేదాధికారము లేనివారు కూడా హోమములు చేసే ప్రక్రియ తెలియచేసినవి. ఆ గ్రంథముల నుండి వాటిని తీసి ఆ ప్రక్రియను ముద్రింప చేసి అందరికీ అందుబాటులోకి తెచ్చాను. కుర్తాళంలోను, గుంటూరులోను మా పీఠానికి సంబంధించిన అనేక ఆలయాలలోను హోమములు ఇప్పుడు నిరంతరాయముగా సాగుతున్నవి.

కాళీదేవి అవతరణ వల్ల గుంటూరులోని స్వయం సిద్ధకాళీపీఠం సిద్ధిస్థానమైతే, మహనీయుడైన మౌనస్వామి ప్రభావం వల్ల కుర్తాళం సిద్ధకేంద్రం అయింది. అద్భుతశక్తి సంపన్నమైన నాడీగణపతి ఆలయము, ప్రధాన పీఠదేవత అయిన సిద్ధేశ్వరీ మందిరము, మౌనస్వామి సమాధి మందిరము దివ్యశక్తి కేంద్రములై సాధకులకు చాలా వేగంగా మంత్రసిద్ధిని కలిగిస్తూ దివ్యానుభవాలను ప్రసాదిస్తున్నవి. అలానే పాతాళ ప్రత్యంగిరా భద్రకాళి మందిరంలో సమర్పిస్తున్న కూష్మాండాది బలుల వల్ల, చేస్తున్న పూజా నైవేద్యముల వల్ల, సాధకుల జపసమర్పణల వల్ల, మంగళవార రాహుకాల పూజల వల్ల, అమావాస్య హోమముల వల్ల ఆకర్షించబడి ఒక తీవ్రదేవత అక్కడకు చేరింది. భక్తులకు కామితములు ప్రసాదిస్తున్నది. అందువలన అక్కడి కార్యక్రమాలలో పాల్గొనే ప్రజల సంఖ్య చాలా ఎక్కువగా పెరుగుతున్నది.

తమిళదేశంలో ప్రత్యంగిరా దేవత చండమార్తాండ స్ఫూర్తితో ఇవాళ ప్రకాశిస్తున్నది. రాజకీయరంగంలోని ప్రముఖులు కొందరు ప్రత్యంగిరాయజ్ఞాలవల్ల ఎన్నికలలో గెలిచి అధికారములోకి వచ్చారని ప్రజలలో వ్యాపించటంతో ఆ దేవతా మందిరాలు చాలా ఎక్కువగా నిర్మించబడినవి. అందుకే మా పూర్వస్వామి కుర్తాళపీఠంలో పాతాళ ప్రత్యంగిరా లయాన్ని నిర్మించారు. నేను పీఠాధిపతినయిన తరువాత విశాఖపట్టణంలో గుంటూరులో హైదరాబాదులో ప్రత్యంగిర ఆలయాలు నిర్మించి ఎంతటి కష్టాలనయినా పోగొట్టటం జరుగుతున్నది.

నలభై యేండ్ల నుండి అధర్వణవేదంలోని ప్రత్యంగిరా ఋక్కులు పారాయణ చేయటం నా దినచర్యలో భాగం. ప్రత్యంగిరా భద్రకాళీ హోమములు నేను చాలా ఇష్టంతో చేసిన క్రతువులు. కుర్తాళ పీఠానికి వచ్చిన తరువాత మౌనస్వామి అనుగ్రహం వల్ల ప్రజోపకార విషయంలో నాకు శ్రమ చాలా తగ్గింది. ఇంతకు ముందు ఎవరికయినా ఇబ్బంది తొలగించవలసి వస్తే అవసరమయిన మంత్ర ప్రయోగం జప, హోమ, ప్రక్రియలతో చేయవలసి వచ్చేది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఆశ్చర్యకర పరిణామాలను ఋజువు చేసినవి.

విశాఖపట్టణంలో ఓపెన్ హార్టు సర్జరీ కోసం ఒక భద్రమహిళ ఆపరేషన్ థియేటరులోకి తీసుకొని పోబడుతున్న సమయంలో ఆమె యందు అభిమానం కల ఇద్దర ప్రముఖులు మా లలితాపీఠానికి వచ్చి ఆపరేషను విజయవంతంగా జరిగేటట్లు ఆశీర్వదించమని అభ్యర్థించారు. నేను మౌనస్వామిని స్మరించి మంత్రాక్షతలు ఇచ్చాను. వాటిని తీసుకువెళ్ళి ఆమె శిరస్సున ఉంచారు. థియేటరులోకి తీసుకొని వెళ్ళినతరువాత శస్త్ర చికిత్స చేసే ముందు జాగ్రత్త కోసం ఫైనల్ చెకప్చేస్తే వ్యాధి లక్షణాలు కనపడలేదు. ఆపరేషన్ అవసరం లేదని నిర్ణయించి డాక్టర్లు ఆశ్చర్యంతో ఆమెను వెనక్కి పంపించారు. ఇటువంటి సంఘటనలు మరికొన్ని కూడా జరిగి మౌనస్వామి యొక్క ప్రభావాన్ని అడుగడుగునా తెలియచేసినవి. నేను ఎక్కింది విక్రమార్క సింహాసనం అనిగ్రహించాను.

ధ్యానయోగులనేకులు నాలో వివిధ దేవతలు ఉండటాన్ని చూచారు. కొందరు కాళిని, కొందరు రాధను కొందరు భద్రను, కొందరు హనుమంతుని చూస్తే, మరికొందరు మౌనస్వామిని చూడగలిగారు. పాదపూజ జరిగినప్పుడల్లా మౌనస్వామి అష్టోత్తర శతనామావళిని పఠించినపుడు ఆయన అవతరించటాన్ని చాలా మంది దార్శనికులు చూడగలిగారు.

( సశేషం )

🌹🌹🌹🌹🌹

సిద్దేశ్వరయానం - 115 Siddeshwarayanam - 115

🌹 సిద్దేశ్వరయానం - 115 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 11 🏵


చిన్నవయసులో మొదట పురుష దేవతా మంత్రాలే సాధన చేశాను. శివపంచాక్షరి, గణపతి, హనుమాన్, కార్తవీర్యార్జున, నాగరాజ మంత్రాలను లక్షలకు లక్షలు జపములు, హోమములు చేశాను. వాటి వల్ల మంచి అనుభవాలు పొందాను. గణపతి ముని ప్రభావం నా మీద పడి శాక్తేయ మార్గంలోకి సాధన మళ్ళింది. ఛిన్నమస్త వజ్రవైరోచనీ మంత్రసాధన ప్రారంభించి ఆ దేవత వల్ల ఎన్నో కష్టాలను ఎదుర్కో గలిగాను. బలవంతులతో విరోధములు, సంవత్సరాల తరబడి కోర్టు వివాదాలు విపరీత విపత్కర పరిస్థితులు చెప్పలేనన్ని ఇబ్బందులు అన్నింటిలోను జయాన్ని ప్రసాదించింది- ఈ మహాశక్తి. మహామాంత్రికుడైన అద్దంకి కృష్ణమూర్తి నేను ఛిన్నమస్త హోమం చేస్తూంటే తాను కూడా కలసి పాల్గొని అగ్నిగుండంలో ఆమె నిల్చోటాన్ని గమనించి ఇంత భీషణ దేవతను నేను ఎన్నడూ చూడలేదు. ఈ మహత్తర శక్తి మీకు అండగా ఉండటం వల్ల మిమ్ము ఎవరూ ఏమీ చేయలేరు" అని చేతులెత్తి నమస్కరించాడు.

శివపంచాక్షరి చేస్తున్న కాలంలో శివుని గూర్చి వెయ్యి పద్యాలతో 'శివసాహస్రి' రచించినట్లే ఈ దేవతను గూర్చి కూడా 'ఐంద్రీ సాహస్రి' అన్న పేరుతో వెయ్యిపద్యాల స్తుతి కావ్యాన్ని రచించాను. ఇది ఇలా జరుగుతూ ఉండగానే రాధికాప్రసాద్ మహరాజ్ గారితో పరిచయం కావటం రాధాసాధనలోకి ప్రవేశించటం తటస్థించింది. దానికి సంబంధించిన విశేషాలను ఇంతకుముందే కొంత ప్రస్తావించాను. రాధా, వైరోచనీ మంత్రాలను రెంటినీ సంపుటి చేసికూడా కొన్ని పురశ్చరణలు చేశాను.

ఇలా కొన్ని సంత్సరాలు గడచిన తరువాత కాళీ దేవి జీవితంలోకి ప్రవేశించింది. నాలోని అంతఃశక్తిని బహిర్ముఖం చేసి కొత్త మలుపును తిప్పింది. ఆమె విగ్రహం రూపంగా అంతరిక్షం నుండి అవతరించటంతో లౌకికంగా అలౌకికంగా, చిత్ర విచిత్ర విన్యాసాలు ప్రారంభమయినవి. హృదయ ప్రేమమందిరంలో రాధాదేవి రసభావాను భవాలను కలిగిస్తూంటే వైరోచనీ, కాళీదేవతలు, నా విజయ విక్రమ విహారాలకు సిద్ధసాధనలకు హేతువులైనారు. ఆధి వ్యాధిపీడితుల బాధ నివారించటానికి, దుష్ట గ్రహ నివారణకు వివిధములైన సమస్యలతో వచ్చిన జనులకు వాటిని పరిష్కరించటానికి నానుండి మంత్రోపదేశం పొంది సాధన చేస్తున్న వారు ముందుకు వెళ్ళటానికి ఈ దేవతలు ఎంతో సహాయం చేశారు.

ఆ మార్గంలో అనేక ధ్యానసమావేశాలు మొదలైనవి. ముఖ్యంగా రాత్రివేళలలో సుదీర్ఘ కాలం కాళీమందిరంలో ధ్యానం చేయటం దివ్యానుభవాలు పొందటం సాధకులకు అలవాటు అయింది. నెలల తరబడి సాగే హోమములలో లక్షల కొలది ఆహుతులు పడుతూ దేవతా ప్రీతిని వేగంగా తీసుకొస్తున్నవి. అత్యంత శక్తిమంతమైన ఈ హోమసాధనకు అధిక ప్రాధాన్య మిచ్చి దాని వల్ల అనూహ్యమైన అద్భుత ఫలితాలను సాధించటం జరిగింది.

ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఒక రోజు రాత్రి పూర్ణిమా హోమం జరుగుతున్నది. యజ్ఞం చూడటానికి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వ రక్షకభట శాఖ సర్వాధికారి వచ్చాడు. “సమయానికి వచ్చారు, పట్టుబట్ట కట్టుకొని ఆహుతులు వేసి హోమంలో పాల్గొనండి" అన్నాను. ఆయన అలానే చేశాడు. హోమకుండంలో కొత్త దేవత వచ్చి నిల్చొన్నాడు. అప్పుడు ఆయనతో అన్నాను. నీరు హోమం చేసి ఏ దేవతను ఆవాహన చేసినా ఆదేవత హోమకుండంలో అవకరిస్తుంది. నేను వేసిన ఆహుతి ఎన్నడూ వ్యర్థం కాలేదు. కానీ మీరు ఇప్పుడు ఆహుతులు వేస్తుంటే మీ ఇష్టదేవత వచ్చినిల్చున్నది. అకృతి ఇది, పేరు ఇది. "ఆయన దిగ్భ్రాంతితో "ఈ రహస్యం ఎవరికీ తెలియదు. నేను చిన్నప్పుడు ఆ స్వామిగుడిలో ఆడుకొన్నాను. పాడుకొన్నాను. పెరిగి పెద్దవాడనై ఐ.పి.యస్.లో చేరి ఈ జిల్లాలో పోలీసు సూపరింటెండెంటుగా పనిచేశాను. ప్రమోషన్లు వచ్చి ఇప్పుడు డి.జి.పి. అయినాను. అయితే నా ఇష్టదేవతా రహస్యం ఎవరికీ తెలియదు మీరు ఎలా చెప్పారు !" అన్నాడు. "ఇందులో ఏమున్నది ! ఇదేమీ జ్యోతిష్యం కాదు, సాముద్రికం కాదు. కంటికి కనిపిస్తే చెప్పేది. జప హోమ ధ్యానముల వల్ల దివ్య చక్షువు వికసిస్తుంది. దానివల్ల ఇటువంటివి తెలుసుకోవటం సాధ్యమవుతుంది. మీరూ సాధన చేయండి. మీరు కూడా ఆ స్థితిని పొందవచ్చు" అన్నాను. ఇప్పుడు అతడా సాధనలో ఉన్నాడు.

( సశేషం )

🌹🌹🌹🌹🌹

సిద్దేశ్వరయానం - 114 Siddeshwarayanam - 114

🌹 సిద్దేశ్వరయానం - 114 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 10 🏵


భారతదేశంలో పుట్టి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఒక తమిళుడు పది పదకొండు యాక్సిడెంట్లకు గురిఅయినాడు. నా రెండవ అమెరికా పర్యటనలో ఒక స్నేహితుడు అతనిని చూపించి ఈ ప్రమాదాల నుంచి రక్షించమని అడిగాడు. అతని ఇంటిలో హోమం చేశాను. అగ్నిగుండంలో విచిత్రమైన దృశ్యం కన్పించింది. అతను పూర్వజన్మలో ఒక రాజుయొక్క రెండవ కొడుకు. రాజ్యం కోసం తండ్రిని అన్నను ఖైదు చేశాడు. ఆ పాప ఫలితంగా ఒక పిశాచం పట్టుకొన్నది. అతనిని బాధించి, బాధించి చంపాలని ఆ పిశాచం యొక్క సంకల్పం దాని బాధ నుండి అతనిని రక్షించాను. ఇటీవలి నా మూడవ అమెరికా యాత్రకు అతడు కారకుడయినాడు. భారతదేశానికి వచ్చినప్పుడల్లా గుంటూరులోను కుర్తాళంలోను మన ఆశ్రమాలలో కొద్ది రోజులు సకుటుంబంగా ఉండి వెడుతుంటాడు

సాహిత్యరంగంలో నేను భువన విజయాది రూపక ప్రదర్శనలు నిర్వహిస్తున్న రోజులలో వారిలో పాల్గొన్న వారిలో ఇద్దరు రచయిత్రులు ఉన్నారు. అందులో ఒకామె పూర్వజన్మలో ముస్లిం జమీందారిణి. ఆమె భవనానికి కొంచెం దూరంలో ఒక హిందూ దేవాలయం ఉండేది. ఆమె రోజూ అక్కడి భజనలు, పాటలు వింటూండేది. ఒకసారి మతకలహాలు జరిగి సాయుధులైన మహమ్మదీయులు దేవాలయం మీదకు దాడిచేశారు. గుడిలో ఉన్న హిందువులు చెల్లాచెదురుగా పరిగెత్తారు. వారిలో కొందరు ఈమె భవనంలో దూరి దాక్కున్నారు. దుండగులు అక్కడకు వచ్చి దాక్కున్న వాళ్ళను బయటకన్నా పంపండి లేదా మేమే లోపలకు వచ్చి వాళ్ళను చంపుతాము అన్నారు. ఆమె అంగీకరించక వారిని కఠినంగా మందలించి వెళ్ళిపొమ్మని చెప్పింది. ఆమె తమ మతానికి చెందిన గౌరవనీయ వ్యక్తి కావటం వల్ల వారు వెనక్కు వెళ్ళిపోయినారు.

ఆమెకు రెండు పుణ్యాలు మిగిలినవి. ఒకటి రోజూ దేవాలయ సంకీర్తనలు విన్న పుణ్యం, రెండవది ఆపదలో ఉన్న వారిని రక్షించిన పుణ్యం. దీనివల్ల ఆమె ఈ జన్మలో హిందువుగా పుట్టింది. సంగీతంలో విద్వాంసురాలయింది. తెలుగులో డాక్టరేటు చేసి ప్రభుత్వ సర్వీసులో చేరి గవర్నమెంటు కాలేజీ ప్రిన్సిపల్గా పదవీ విరమణ చేసి ప్రస్తుతం ఒక సంగీత పాఠశాలను నడుపుతున్నది. చేసిన కర్మలు ఫలితాలను వివిధ రీతులుగా ఇస్తుంటవి. అలాగే మరొక రచయిత్రి పూర్వజన్మలో ఒక అమాయకురాలయిన పల్లెటూరి పిల్ల. ప్రతిరోజూ తన గ్రామం నుండి పూలు, పండ్లు తెచ్చి పట్టణంలో అమ్ముకొని వెళ్ళేది. ఆ పట్టణ పరిపాలకుడయిన ఒక మహమ్మదీయ ప్రభువు ఆమెను చూచి వాంఛించాడు. ఆమె అంగీకరించలేదు. కోపంతో ఖైదులో పెట్టించాడు. ఆ ఖైదులోనే ఆమె మరణించింది. ఆమె కారాగారంలో ఉన్నప్పుడు నే నామెకు కొంత సహాయం చేశాను. ఆమె ఈ జన్మలో రచయిత్రి అయి నా సారస్వత పరివారంలో స్థానం పొందింది.

జన్మలు మారినపుడు పురుషులు స్త్రీలు కావచ్చు, స్త్రీలు పురుషులు కావచ్చు, మతములు జాతులు మారవచ్చు. అలా మార్పులు చెందిన వాళ్ళని కూడా చాలా మందిని చూచాను. కాశీలో ఒక మహమ్మదీయుడు ఒక శతాబ్దం క్రింద నా శిష్యుడు. ఈ జన్మలో స్త్రీగా పుట్టి చదువుకొని ఉద్యోగం చేస్తూ నాకు భక్తురాలు కావటం జరిగింది. అయిదు వందల ఏండ్ల క్రిందటి ఒక బౌద్ధయోగిని తెలుగు భూమిలో పుట్టి ఒక హైస్కూలు హెడ్ మిస్ట్రెస్ గా పనిచేసి ఇప్పుడు కుర్తాళం ఆశ్రమంలో తపస్సు చేసుకొంటున్నది. వీళ్ళలో చాలా మంది కాశీ, బృందావనం మొదలైన చోట్లకు తీర్థయాత్రలకు నాతో పాటు రావటం మంత్రోపదేశం పొంది తీవ్ర జప, ధ్యాన సాధనలు చేయటం అలవాటు చేసుకొన్నారు. పూర్వజన్మలో బృందావనంలో నా దగ్గర ఉన్న ఒక యువకుడు ఈ జన్మలో కవి అయి శతావధానియై ఆశుకవితా నిపుణుడై కీర్తి పొంది కాలేజీలో నా విద్యార్థిగా ఉండి ఇటీవల నేను పీఠాధిపతినైన తరువాత నా మీద ఒక శతకమే రచించాడు. ఈ విధంగా చెప్పటం మొదలు పెడితే వీటికోసం వేరే ఒక పుస్తకమే వ్రాయవలసి ఉంటుంది.

( సశేషం )

🌹🌹🌹🌹🌹


సిద్దేశ్వరయానం - 113 Siddeshwarayanam - 113

🌹 సిద్దేశ్వరయానం - 113 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 9 🏵


అమెరికా సంచారములో కూడా చిత్ర విచిత్రాలు ఎన్నో జరిగినవి. అట్లాంటాలో యజ్ఞం చేస్తుంటే దేవతతో పాటు ఒక సిద్ధుడు కూడా రావటం గమనించి ఫలానా సిద్ధుడు వచ్చాడని ఆయన ఆకృతి, పేరు, చెప్పినపుడు ప్రేక్షకులలో నుండి ఒక వ్యక్తి లేచి "నేను ఆయోగి శిష్యుడను. ఆయన పేరు గాని ఆకృతిగాని ఇక్కడ ఎవరికి తెలియదు. దానిని మేము రహస్యంగా ఉంచుతాము. మీరు వివరాలు చెప్పటం చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది” అన్నారు. న్యూజెర్సీలో దేవీభాగవత ప్రవచనం జరుగుతుంటే ఒక ప్రేక్షకుడు మామూలు కెమెరాతో నా ఫోటో తీయగా శిరస్సు చుట్టూ ఒక కాంతివలయం పడిందట ! అతడు వెంటనే తన కెమారాను ఆ ఫోటోను ప్రేక్షకులకు చూపించి సంభ్రమానందాలను ప్రకటించాడు. కాలిఫోర్నియా లోని శాన్ ఫ్రాన్సిస్కోలో రాధాదేవి పూజ చేసినపుడు వాతావరణంలో ఏదో ప్రసన్నమైన మార్పు వచ్చిందన్న అనుభూతి అందరికీ కలిగింది. దానికి కారణమైన బృందావనేశ్వరిని ఇలా వర్ణించాను.

ప్రేమరసాధిదేవియయి పెన్నిధియై అల కాలిఫోర్నియా వ్యోమమునందు కాంచన మయోజ్వల దివ్యరధంబు నెక్కి భవ్యామృత వీక్షణంబుల దయన్ కురిపించుచు వచ్చినట్టి కృ ష్ణామర వృక్ష పుష్పమధు వద్భుతసుందరి రాధ గొల్చెదన్.

ఆ పూజకు కారకుడైన గృహస్థు పూర్వజన్మలో బృందావన భక్తుడు కావటం. దానిని గుర్తింప చేయటానికి రాధాదేవి చేసిన లీల ఇది. ఇటువంటివి మరికొన్ని విశేషాలు కూడా. ఒక బగళాముఖి ఉపాసకుడు, ఒక యక్షుడు, ఒక గంధర్వకాంత, ఒక రెడ్ ఇండియన్ సూక్ష్మదేహి, మొదలైనవారు వివిధ ప్రదేశాలలో కనిపించి తమ తమ విశేషాలను తెలియచేసి సౌహార్దభావం ప్రదర్శించారు. గణపతి మంత్రాన్ని ఉపదేశం పొందిన ఒక మహిళ తను పూజ చేస్తూ పాలు నైవేద్యం పెడితే ఆ విగ్రహం పాలు త్రాగిందని ఆనందంతో చెప్పింది. చాలా సంవత్సరాల క్రింద ప్రపంచంలో అనేక దేశాలలో ఇటువంటి సంఘటనలు జరగటం పత్రికలు చదివిన వారికి గుర్తు ఉండి ఉంటుంది. ఈ అమెరికా వాసినికి ఇది ఆమెకు మాత్రమే పరిమితమైన అనుభవం. ఒక ఆప్తుని కుమారుడు న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటరులో పనిచేస్తున్నాడు. అతని ప్రార్ధన మీద రాధామంత్రాన్ని ఉపదేశించాను. శ్రద్ధగా జపం చేస్తున్నాడు. ఒక రోజు ఉదయం ఆఫీసుకు బయలుదేరగానే కదలలేనంత జ్వరం వచ్చింది. పై అధికారికి ఫోను చేసి సెలవు మంజూరు చేయమని కోరి ఇంటిలోనే ఉండిపోయాడు. కాసేపటికి అతని ఆఫీసు భవనంలోకి విమానం దూసుకు వెళ్ళి కొన్ని వేలమంది మరణించారు. ఇతడు ఆఫీసుకు వెళ్ళి ఉంటే మిగతావాళ్ళ గతే పట్టేది. ఇతనికి జ్వరం వచ్చేటట్లు చేసి ఆఫీసుకు వెళ్ళకుండా చేసింది మంత్ర దేవత. దేవతల పద్ధతులు చిత్రంగా ఉంటవి.

అమెరికా సంచారంలో దాదాపు 20 మంది యొక్క పూర్వజన్మ రహస్యాలను దేవతలు తెలియచేశారు. వారి సమస్యలను పరిష్కరించడానికి అధ్యాత్మికాభివృద్ధికి ఇవి ఎంతో దోహదం చేసినవి.

ఇటీవల కొద్ది సంవత్సరాలుగా ఇన్నీ అని లెక్కపెట్టటానికి వీలులేనంతగా ఎందరో వ్యక్తుల పూర్వపరజన్మ విశేషాలను పరమేశ్వరి తెలియచేస్తూ ఉన్నది. వారిలో ఎక్కువ భాగం నాతో జన్మాంతర అనుబంధం కలవారే. కొద్ది మంది ఏ సంబంధం లేనివారు కూడా ఉన్నారు. మా పీఠంలోని సన్యాసులు దాదాపు అందరి జన్మరహస్యాలను దేవి తెలిపింది. మౌనస్వామితో అయిదువేల ఏండ్ల నుండి ఉన్న జన్మనుబంధాల విశేషాలను జగన్మాత చూపించింది. ఒక సన్యాసి పూర్వజన్మలో బ్రహ్మపుత్రాతీరంలోని నాగసాధువు. ఇంకొకరు కాశీలో ఒక వేదపండితుని కుమారుడు. వేరొకరు హరిద్వారంలో తపస్వి, అలానే మా పీఠంలో అర్చకుడు పూర్వజన్మలో ఒక మళయాళ మంత్రసిద్ధుని శిష్యుడు. గుంటూరులోని కాళీమందిర నిర్మాణానికి సహాయపడిన ఒక ధనవంతుడు పూర్వం నాగాలాండ్లో దైవభక్తుడు. ఒక భక్తురాలు రెండువేల అయిదువందల సంవత్సరాల క్రింద బుద్ధుడు సాధన దశలో ఉన్నపుడు బోధివృక్షం దగ్గర ఆయనకు అన్నం పెట్టిన సుజాత. ఇప్పుడు ఒక గొప్ప యోగిగా ప్రసిద్ధి చెందిన ఒక వ్యక్తి పూర్వం ఒక కొండమీద కాళీసాధన చేసి అది సిద్ధించక దత్తాత్రేయ సాధనలోకి మారి ఆస్వామి అనుగ్రహాన్ని కొంత పొందాడు. ఇప్పుడు జన్మమారి బ్రహ్మచారియై తీవ్రసాధన చేసి యోగివర్యునిగా కీర్తించబడుతున్నాడు. యజ్ఞప్రియుడైన ఒకరాజు జన్మమారి ఇప్పుడు ఒక రైతు కుటుంబంలో పుట్టి వాసనా బలం వల్ల కొన్ని వందల యజ్ఞాలను చేయించి పురాణప్రవచన కార్యక్రమాలు ఏర్పాటు చేయిస్తున్నాడు.


( సశేషం )

🌹🌹🌹🌹🌹


సిద్దేశ్వరయానం - 112 Siddeshwarayanam - 112

🌹 సిద్దేశ్వరయానం - 112 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 8 🏵


లలితా సహస్రనామ పారాయణం చేయటంలో మా పరమగురువులు త్రివిక్రమ రామానందభారతీస్వామి చాలా సమర్థులు. వారి కంఠం చాలా శ్రావ్యంగా ఉండి వారు శ్లోకంగాని పద్యంగాని చదివే బాణి చాలా ఆకర్షణీయంగా ఉండేది. ఆ నామావళిని ఆయన చేత చదివించి రికార్డు చేసి పీఠంలో ఉంచారు. ఆయన లలితాదేవి అర్చన చేసేటపుడు 1970 సంవత్సరం ప్రాంతంలో నేను స్వయంగా విన్నాను కూడా. 1960 ప్రాంతంలో మొదటిసారి సన్యాసదీక్ష తీసుకొందామన్న సంకల్పం కలిగి వారిని కోరటం, వారంగీకరించటం రెండూ జరిగినాయి. కానీ, మా తల్లిదండ్రులు ఇంటి పెద్దకొడుకు ఇంత చిన్నవయస్సులో సన్యాసం తీసుకోవటానికి వీలులేదని పట్టు పట్టటంతో అప్పుడు ఆగిపోయింది. మళ్ళీ నలభైసంవత్సరాల తరువాత అది సమకూరింది. వైరాగ్య సంస్కార సంపద పెంపొందిన నా శ్రీమతి అంగీకరించడం వల్ల, సహకరించడం వల్ల ఆశ్రమ స్వీకారం సుగమము అయింది. ఆరువందల సంవత్సరాల క్రింద బృందావనధామంలో నివసించిన ఆ భక్తురాలు ఆ నాడు కాళీసిద్ధునిగా ఉన్న నాపై పెంచుకొన్న మమకారం తరువాత వచ్చిన రెండు జన్మల అనుబంధానికి కారణమయింది.

ఇటీవల ఉజ్జయినీలో కాళీదర్శనానికి వెళ్ళినపుడు, నగరదేవత మందిరాలను చూస్తూ ఊరి బయటున్న ఒక గణపతి ఆలయానికి వెళ్ళితే అక్కడ త్రివిక్రమరామానంద భారతీస్వామివారి సూక్ష్మదేహం కనిపించింది. వారు కాశీకి అప్పుడప్పుడు వెళ్ళినట్లు తెలుసుకానీ ఉజ్జయిని వచ్చిన సంగతి తెలియదు. ఆ స్థలంతో వారికి ఏ అనుబంధమున్నదో ! సిద్ధులకు వారికి సంబంధించిన ప్రదేశాల మీద మమకారం ఉండడం అక్కడికి తరచుగా వారు వస్తూ ఉండటం నేను గమనించాను. కుర్తాళంతో మౌనస్వామికే కాదు మరికొందరు సిద్ధులకు కూడా అనుబంధం ఉండటం ఇటీవల తెలియవచ్చింది. మహనీయులుగా పేరు చెందిన మహావతార్ బాబా ఇటీవల సిద్ధేశ్వరీ మందిరంలో దర్శనమిచ్చినపుడు ఆయన నన్ను అనుగ్రహించాడని అనుకొన్నాను. తరువాత కుర్తాళంతో ఆయనకు ఉన్న అనుబంధ విశేషాలు తెలిసినవి. క్రీస్తు శకము మూడవ శతాబ్దంలో కుర్తాళం వచ్చి 48 రోజులు తపస్సు చేసి అగస్త్యమహర్షి దర్శనం సాధించి మహాసిద్ధునిగా పరిణామం చెందిన సంఘటన, మౌనస్వామితో ఆయనకు ఉన్న అనుబంధం తెలిసి ఆశ్చర్యపడ్డాను.

అలానే ఇటీవల అరుణాచలం వెళ్ళినపుడు రమణమహర్షి ఆశ్రమంలో కొద్దిసేపు ధ్యానం చేసినపుడు అక్కడికి కావ్యకంఠగణపతి ముని, ఒక స్వాతంత్ర సమర యోధుడు సూక్ష్మదేహాలు రావటం గమనించాను. గణపతిముని, మహర్షిభక్తుడు కనుక ఆయన సూక్ష్మశరీరం అక్కడ సంచరించటంలో ఆశ్చర్యం లేదు కానీ, ఆ స్వాతంత్ర సమర యోధుడు సాక్ష్మశరీరం అక్కడకు ఎందుకు రావాలి ? అప్పుడు కావ్యకంఠుడు చెప్పిన ఒక అంశం గుర్తుకు వచ్చింది. బానిసతనంలో మగ్గుతున్న భారతదేశాన్ని చైతన్యవంతం చేసి స్వాతంత్ర్యమును సముపార్జించటానికి సిద్ధమండలానికి చెందినవారు కొందరు దిగి వచ్చారని వారిలో ఒకరని తన ఉమాసహస్ర గ్రంథంలో ఆయన తెలియచేశారు. అదే విధంగా ఇటీవల అమెరికాలో బోస్టన్ నగరంలో ఉన్నప్పుడు పరమహంస యోగానంద దర్శన మివ్వటం జరిగింది. కాశీలో స్వామి విశుద్ధానంద ఆశ్రమానికి వెళ్ళి ఆయన సాధన చేసిన నవముండి ఆసన సమీపంలో ధ్యానం చేసినపుడు ఆయన సిద్ధశరీరం గోచరించింది. ఈ సిద్ధులంతా నాతో జన్మాంతర అనుబంధం కలవారే కావటం విశేషం.


( సశేషం )

🌹🌹🌹🌹🌹


సిద్దేశ్వరయానం - 111 Siddeshwarayanam - 111

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 7 🏵


సిద్ధేశ్వరీపీఠంలోకి నా ప్రవేశం కూడా చిత్రమైన పరిణామం. కాళీదేవి ఆలయ నిర్మాణం తరువాత సన్యాసం తీసుకోవాలన్న ఆశ ప్రబలంగా పెరిగింది. కుర్తాళ సిద్ధేశ్వరీపీఠాధిపతి శ్రీ శివచిదానందభారతీస్వామివారిని ఈ విషయమై అభ్యర్థించాను. వారు సంతోషంగా అంగీకరించి పీఠ ఉత్తరాధికారిగా మీరు తగిన వారు అంగీకరించండి అన్నారు"స్వామి ! నేను సన్యాసం తీసుకొని గుంటూరు లోని కాళీదేవి దగ్గర కొంతకాలం, బృందావనం వెళ్ళి రాధాసాధనలో ఎక్కువ కాలం ఉందామన్న ఆలోచనలో ఉన్నాను" అన్నాను. వారు మీ ఇష్టదేవతను నేను చెప్పిన విషయమై అడగండి ఆమె ఆజ్ఞను మీరు పాటింతురు గాని అన్నారు. ఆ రోజు రాత్రి ధ్యానంలో కూర్చున్నాను. సిద్ధేశ్వరీదేవి సాక్షాత్కరించి “బృందావనంలో గుంటూరులో ఉన్నది నేనే. కుర్తాళానికి రా” అని మధురమైన పాయాసాన్ని స్వయంగా అనుగ్రహించింది. ఈ విషయాన్ని శివచిదానందస్వామివారికి చెప్పగా వారు సంతోషంతో సన్యాసదీక్ష ఇచ్చి యువరాజ పదవీ పట్టాభిషేకం చేశారు. ఆ తరువాత కొంతకాలానికి అంతకు ముందే గుప్తంగా వారి శరీరంలో ఉన్న బ్లడ్ కాన్సర్ బైటపడటం, మూడు నెలలకే వారు సిద్ధిపొందటం జరిగింది.

నేను 2002, డిసెంబరు 19వ తేదీ దత్తజయంతి నాడు పీఠాధిపత్యం స్వీకరించడం జరిగింది. దానితో పాటు, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నంలోని పీఠాలకు అధిపతి కావడం సంభవించింది. ఇవి కాక అనేక అనుబంధ దేవాలయాలకు పాలక పదవి స్వీకరించవలసి వచ్చింది. వీనిలో కొన్ని చోట్ల స్థానికులయిన బలవంతులతో సంఘర్షణ ఏర్పడింది. కొన్ని చోట్ల దేవాలయాలను, కొన్ని చోట్ల ఆస్తులను, స్థలాలను, భవనాలను ఆక్రమించుకొన్న వ్యక్తులతో వివాదాలు బహు ముఖాలుగా వచ్చినవి. గూండాగిరి, బెదిరింపులు కోర్టు వివాదాలు ఎక్కువ అయినాయి. అన్నీవదలి తపస్సు చేసుకుంటూ ఉందామన్న నాకు ఈ వ్యవహరాలు తలనొప్పిని కలిగించినవి. సిద్ధేశ్వరీ, సిద్ధమాత అయిన లలితాదేవికి నా వేదనను విన్నవించాను. ఆమె వాత్సల్యంతో ఎటువంటి శత్రువులనైన జయించ గల్గిన ఒక అద్భుత మంత్రాన్ని స్వయంగా ఉపదేశించింది. కొద్దిపాటి జపసాధన చేయగానే చాలా పరిమిత సమయంలో సమస్యలన్నీ పరిష్కారమైనవి. ఆ తరువాత బ్రహ్మాండ పురాణాంతర్గత మైన ఆ దేవి యొక్క చరిత్రను సామాన్యజనులకు అందుబాటు లోకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో సరళంగా, సుబోధకంగా లలితమైన శైలిలో రచించాను, ఆ సందర్భంగా ఆమెను స్తుతిస్తూ ఇలా పలికాను.

సీ॥ ఉపదేశమొనరించె కృపతోడ నేదేవి శత్రుంజయంబైన శాక్త విద్య అరుణారుణంబైన తరుణ సుందరమూర్తి దర్శనంబిచ్చె నే ధర్మవీర పిలిచి స్వయమ్ముగా పీఠత్రయాధీశు చేసె నే మహనీయ సిద్ధమాత రచియింపజేసి నే రసమహాసమ్రాజ్ఞి ఘనరహస్యంబైన తన చరిత్ర

గీ॥ సుకవిగా దీర్చి దివ్యమౌస్ఫురణ నిచ్చి యోగిగా మార్చె నన్ను నే రాగమూర్తి

ఆ సకల నేత్రి సిద్ధేశ్వరీ సవిత్రి లలిత నా గుండెగుడిలోన నిలుచుగాక !

లలితా సంప్రదాయంలోని సిద్ధులతో ఉన్న కొన్ని పూర్వానుబంధాలు అప్పుడప్పుడు ప్రకాశిస్తున్నవి. కాశీలో గంగాతీరంలోని అక్కడి లలితాదేవిలో లలిత కోమల లక్షణాల కంటె తీవ్ర లక్షణాలే ఎక్కువగా కనిపించి పరశంభుదేవుడు దైత్యసంహారానికి ఆమెను పిలిచిన పిలుపుగుర్తుకు వచ్చింది.

శ్లో॥ లోకసంహార రసికే కాళికే భద్రకాళికే లలితాపరమేశాని సంవిద్వహ్నే స్సముద్భవ (బ్రహ్మాండపురాణము)


( సశేషం )

🌹🌹🌹🌹🌹


సిద్దేశ్వరయానం - 110 Siddeshwarayanam - 110

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 6 🏵

హైదరాబాదులో ఒకసారి భాగవతసప్తాహం చేస్తూ ఉండగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్న ఒక భద్రమహిళ వచ్చి తన విషయాన్ని ఇలా విన్నవించుకొన్నది. "స్వామీ! పదవి, ఐశ్వర్యం, సేవకులు, క్రింద ఉద్యోగులు - అన్నీ ఉన్న జీవితం నాది. ఎందరో అసూయపడుతున్న వైభవం నాది. ఇతరులకు తెలియని చెప్పలేని కష్టం నన్ను పీడిస్తున్నది. సాంసారిక బంధం విచ్ఛిన్న మయింది. నేను మానసికంగా ఏకాకిని. నిరాశా నిస్పృహలతో బాధపడుతున్నాను. దీనికి పరిష్కారం ఏదయినా అనుగ్రహించండి". ధ్యానంలో ఆమె సంగతి చూచి ఈ విధంగా చెప్పాను. “అమ్మా! నిన్ను ఇంతకుముందు 300 సంవత్సరాల నుండి ఎరుగుదును, ఒకప్పుడు నీవు కాళీ భక్తురాలివి, నా శిష్యురాలివి. ఆనాడు తెలిసో తెలియకో ఒక తప్పు చేశావు. దాని ఫలితంగా సర్ప జన్మ వచ్చింది. అయితే పూర్వస్మృతి ఉండడం వల్ల ఆ శరీరంలో ఉండలేక బాధపడుతూ ఒకరోజు మా కాళీ ఆశ్రమానికి వచ్చి పడగ ఎత్తి నిల్చొని దీనంగా నీ బాధను తెలియచేశావు. మనుష్యజన్మ వచ్చేటట్లు చేయమని ప్రార్థించావు.

"అమ్మా! ఈ శరీరంలో మరికొంతకాలం, ఉంటే కర్మానుభవం పూర్తవుతుంది. అప్పుడు మనిషి జన్మ వస్తుంది" అన్నాను. "స్వామీ! ఈ శరీరం భరించలేకుండా ఉన్నాను. మానవశరీరం కావాలి. ఎంతటి కష్టాన్నయినా ఆ దేహంతో అనుభవిస్తాను" అని మరీ మరీ ప్రార్థించావు. ఆనాడు నాకు ఉన్న సిద్ధశక్తుల వల్ల నీకు మనుష్య జన్మ వచ్చేలా చేశాను. అదే నీ విప్పుడు ఉన్న జన్మ. అనుభవించవలసిన ఉన్న పాపం ఇంకా కొంత మిగిలి ఉంది. దానివలన ఈ జన్మలో ఇక సుఖములు పొందలేవు. వచ్చే జన్మలో పురుష శరీరం వస్తుంది. మంచిసాధన చేసి యోగివవుతావు. ఇక ఈ జన్మలో సుఖము లేకపోయినా మానసికంగా శాంతిని పొందే పద్ధతులు చెపుతాను. నేనుపదేశించిన మార్గంలో కాళీదేవి యొక్క ధ్యాన సాధన చేయవలసింది, అన్నాను. ఇప్పుడు ఆమె ఆ సాధనలో ఉంది.

మంత్రశాస్త్రంలో సంతానకాళి మంత్రం ఒకటి అద్భుతంగా ఉపయోగిస్తున్నది. సంతానం లేని వ్యక్తులు ఎందరో ఈ మంత్రోపదేశం పొంది, సాధన చేసి సంతానవంతులు అయినారు. భూతప్రేత బాధా నివారణలో కాళీదేవి అసామాన్యమైన అనుగ్రహాన్ని చూపిస్తున్నది. గుంటూరు కాళీపీఠంలో కాళీమంత్రసాధన చేసినవారిలో దాదాపు పదిమంది కాళీదేవి యొక్క దర్శనాన్ని పొందారు. అందులో ఒక సాధకురాలు పూర్వజన్మలో ఈ సిద్ధకాళికి అర్చకురాలుగా ఉండేది.

ఇలా కాళీదేవి ఎన్నో అద్భుత లీలలను చూపిస్తున్నది. ఆమె భీషణ సౌందర్యం నన్ను క్షణక్షణమూ ఆకర్షిస్తుంటే ఇలా స్తుతించాను.

శ్లో॥ ఆరక్తజిహ్వాం వికటోగ్ర దంష్ట్రాం శూన్యాంబరాం సుందరభీషణాంగీం
కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి.

ఎర్రని నాలుకతో వికటమైన దంష్ట్రలతో, చేతిలో శూలము, మెడలో పుర్రెల మాల అలరుతూ ఉండగా దిగంబరయై భయంకరంగా ప్రకాశించే భీషణ సౌందర్య మూర్తియైన కాళీదేవిని భజిస్తున్నాను.

ఉ॥ కంటకులైన శాత్రవుల గర్వము ఖర్వము సేయ అల్ల ము క్కంటి గృహంబు నుండి అజకల్పిత లోకము లెన్నొ దాటి నా యింటికి వచ్చి హోమగృహ మెర్రని నవ్వుల నింపి కుండపున్ మంటల మధ్య నిల్చు అతిమానుష కేళిని కాళినెంచెదన్.

నా శత్రువుల గర్వాన్ని అణచి వేయటానికి, నన్ను రక్షించటానికి కైలాసం నుండి బయలుదేరి ఎన్నో లోకాలు దాటి నా యింటిలోని హోమగృహంలో ఎర్రగా నవ్వుతూ కుండంలోని అగ్నిజ్వాలల మధ్య నిల్చున్న మానవాతీత క్రీడా స్వరూపిణియైన కాళీదేవిని స్మరిస్తున్నాను.

ఉ॥ అంటిన ప్రేమ వచ్చెను స్వయంభువుగా హిమశైలమందు, నే డుంట కళింగ భూముల నహో ! శతషట్క సువర్షమూర్తియై గుంటురిలోని నన్ మరల గోరి వియత్తలి నుండి దేవతల్ ఘంటలు మ్రోయ విగ్రహముగా దిగివచ్చిన కాళి గొల్చెదన్.

ఆరువందల యేండ్లు హిమాలయాలలో చేసిన నా తపస్సుకు సంతోషించి అవతరించి చిన్న విగ్రహంగా రూపుదాల్చింది. అది వయస్సును బట్టి పెరుగుతున్నది. పెద్ద విగ్రహమయ్యే సరికి నేను ఒరిస్సాలోని అడవిలో ఆశ్రమాన్ని నిర్మించుకొన్నాను. నే నిప్పుడు జన్మమారినా నా మీద దయవల్ల గుంటూరు లోని మా పీఠంలో దిగి వచ్చిన ఆ కాళిని భజిస్తున్నాను.


( సశేషం )

🌹🌹🌹🌹🌹

సిద్దేశ్వరయానం - 109 Siddeshwarayanam - 109

🌹 సిద్దేశ్వరయానం - 109 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 5 🏵


ఒకరోజు గుంటూరులోని కాళీపీఠంలో కూర్చుని ఉండగా ఒక మహిళ వచ్చింది. ఆమె రాష్ట్ర ప్రభుత్వంలో మైనారిటీ మతానికి చెందిన ఒక మంత్రి భార్య ఆమె వచ్చి నమస్కరించి "స్వామీజీ! నేను హిందువును కాదు, అయినా నాకు కొంత ధ్యానసాధన అలవాటు ఉంది. నేనీ కాళీదేవి ముందు కూర్చుని ధ్యానము చేయటానికి అనుమతిస్తారా!" అని అడిగింది.

నేను : అమ్మా ! మీకు ఈ సందేహముఎందుకు కలిగింది ? ఇక్కడ ఎవరయినా ధ్యానం చేయవచ్చు.

మహిళ : అయ్యా ! కొన్ని గుడులలోకి, పీఠములలోకి ఇతర మతస్థులను రానీయరు. అందుకని సందేహం తీర్చుకోవటానికి అడిగాను.

నేను : ఇక్కడ ధ్యానం చేయటానికి నియమం ఒక్కటే. ఈ కాళీ విగ్రహంలో దేవత ఉన్నది అని మీకు అంగీకారమయితే ఇక్కడ కూర్చుని ధ్యానం చేయటానికి అభ్యంతర ముండదు.

మహిళ : ఆ విశ్వాసముతోనే వచ్చాను.

నేను : అయితే నిరభ్యంతరముగా కూర్చొనవచ్చును. ఇంతకు ముందు తిరుపతిలో కూడా ఇటువంటి సంఘటన జరిగింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నరు 'అబ్రహాం' అనే క్రైస్తవుడు శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుమల వెళ్ళాడు. అక్కడ అధికారులు స్వాగతం చెప్పి తీసుకొని వెళ్ళారు. మహాద్వారం దగ్గర ప్రధాన పూజారి వారిని లోపలికి తీసుకు వెడుతూ ఇలా అన్నాడు" అయ్యా ! మీరు మహోన్నత అధికారులు. మిమ్ము ఆపగల శక్తి మాకు లేదు మీరు స్వామిని దర్శించటంలో ఆ విగ్రహాన్ని పురావస్తు శిల్పదృష్టితో చూడటానికి వచ్చారా ? లేక దేవుడని నమ్మి వచ్చారా? మీకు అభ్యంతరం లేకపోతే సమాధానం చెప్పండి"

గవర్నరు 'దేవుడని నమ్మి వచ్చాను' అని జవాబు చెప్పాడు. “అలా అయితే మా 'దర్శకుల పుస్తకం' (Vistors Book) లో ఈ విషయం వ్రాయండి” అని అర్చకుడు కోరాడు. ఆయన వ్రాసి సంతకం పెట్టాడు. ఇప్పటికీ దేవస్థానం రికార్డులలో అది భద్రంగా ఉంది. అప్పుడప్పుడు ఇతర మతస్థులు ఇలా వచ్చి హిందూదేవాలయాలో ప్రవేశించి భక్తితో దర్శనం చేసుకోవటం ఉంది.

మహిళ : మన్నించండి. నేను అడగటానికి ఒక కారణం ఉంది. ఈ మధ్య పత్రికలలో ఒక వార్త వచ్చింది. ఉత్తర హిందూ స్థానంలోని ఒకరు ఇతర మతాలనుండి హిందూమతం స్వీకరించినవారు కాని, ఇతర మతస్థులు కాని హిందూ దేవాలయాలలో అడుగుపెట్టరాదు అని ప్రకటించారు. అందుకని మిమ్ము అడుగవలసి వచ్చింది.

నేను : ఆవార్తను నేను కూడా చూచాను. ఆచార సంబంధమైన విషయాలలో అభిప్రాయాలు ఒకటిగా లేవు. వారి అభిప్రాయం వారు చెప్పారు. నా అభిప్రాయం ప్రకారం మతములు, మతమార్పిడులు జాతులు, దేశములు వీటితో సంబంధం లేకుండా దేవాలయంలోని విగ్రహాన్ని దేవునిగా అంగీకరించిన ఎవరయినా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. కనుక నీవు హాయిగా ధ్యానం చేసుకోవచ్చు.

ఆమె ఒక గంట సేపు ధ్యానం చేసింది. అనంతరం మళ్ళీ వచ్చి "స్వామీ! ధ్యానంలో నాకు నా పూర్వజన్మ తెలిసింది. నేను అప్పుడు మగవాడినై ఎఱ్ఱని పంచ కట్టుకొని ఎర్రని బొట్టు పెట్టుకొని, మీ శిష్యుడనై ఈ కాళీదేవిని పూజిస్తున్నట్లు కన్పించింది. అన్నది. ఆమె చెప్పినది సత్యమే కనుక కాళీసాధన తీవ్రంగా చేయవలసినదని సూచించాను. అతరువాత కూడ ఆమె అప్పుడప్పుడు వచ్చి దర్శనం చేసుకొంటున్నది.


( సశేషం )

🌹🌹🌹🌹🌹


సిద్దేశ్వరయానం - 108 Siddeshwarayanam - 108

🌹 సిద్దేశ్వరయానం - 108 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 4 🏵


ఢిల్లీలోని కల్కాజీ గుడి బహాయ్ మార్గీయుల లోటస్ టెంపులుకు దగ్గరగా ఉంది. ఆ కాళీ దేవి ఎంతో శక్తిగల దేవత. ఆమె తను అనుగ్రహాన్ని, దర్శనాన్ని ఎంతో వాత్సల్యంతో ప్రసాదించింది. కలకత్తాలోని ప్రాచీన కాళీదేవత నిత్యబలులతో రక్తపు మడుగుల మధ్య తీవ్రరూపిణిగా అలరారుతూ ఉంటే రామకృష్ణుడు పూజించిన దక్షిణేశ్వర కాళి ప్రసన్నశాంతరూపంగా భాసించింది. అర్చన పద్ధతులలో ఉండే తేడా అక్కడి చైతన్యమండలంలో స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. కాశీలో రామకృష్ణ పరమహంస సాధన చేసిన ఆశ్రమంలో కూడా కాళీదేవత ప్రసన్నమూర్తిగానే ఉన్నది.

సిద్ధపురుషుడై మూడు వందల సంవత్సరాలు జీవించిన కాళీ భక్తుడు త్రైలింగస్వామి దర్శనం కోసం వచ్చినప్పుడు పరమహంస ఉన్న ఇల్లు అది. కాశీలోని త్రైలింగస్వామి ఆశ్రమంతోను ఆ మహానీయునితోను ఉన్న అనుబంధం ఇటీవల కొన్ని గుర్తుకు వచ్చినవి. రెండు వందల సంవత్సరాల క్రింద ఆయన శిష్యులుగా ఉన్న ఇద్దరు ఈనాడు నాకు శిష్యులు కావటమే కాక త్రైలింగ స్వామి కూడా నా కాళీ విగ్రహాన్ని పూజించిన వారిలో ఒకరు కావటం, అలానే రామకృష్ణ పరమహంస కూడా ఆ విగ్రహాన్ని పూజించిన వారిలో ఉండడం ఇటీవల స్మృతి పథంలోకి జగన్మాత తీసుకొని వచ్చింది.

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఒక తెలుగు దంపతుల కుమారుడు మంత్రసాధన యందు అభిరుచి కల్గి నా దగ్గరకు వచ్చాడు. కాళీసాధన చేయాలని తన ప్రబలమైన కాంక్షను వ్యక్తం చేయటంతో అతనికి మంత్రోపదేశం చేశాను. గుంటూరు లోను, కుర్తాళంలోను మా ఆశ్రమంలో తీవ్రంగా జపం చేశాడు. తనకు ధ్యానంలో కన్పించిన కాళీదేవి మూర్తులను అతడు చిత్రకారుడు కూడా కావడం వల్ల బొమ్మలు గీసి చూపించాడు. మంచి అనుభవాలు పొందుతున్నా డా యువకుడు. ఒక కార్తీకమాసంలో అండమాన్ దీవులలో దేవాలయ ప్రతిష్ఠల కోసం నేను వెళ్ళినపుడు స్వాతంత్య్ర సమరయోధుడు. 'సావర్కార్' ను ఉంచిన 'సెల్యులర్' జైలును చూచాను. దానిలో ఎందరో ఖైదీలను ఉంచిన గదులున్నాయి. ఒక గదిలో ఈ యువకుని పూర్వజన్మ స్వరూపం కన్పించింది. స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని ద్వీపాంతర వాస శిక్ష విధించబడిన ఈ వ్యక్తి ఆనాడు ఔత్తరాహుడు. జైలులో ఉన్న రోజులలో కాళీ మంత్రసాధన చేసేవాడు. అది ఈనాడు మళ్ళీ అతడికి ప్రాప్తించింది.

కాశీలో శవశివకాళీ మందిరం ఒకటి విచిత్రమయినది. అక్కడ ప్రవేశించి దేవీ దర్శనం చేసుకోగానే ఒక శిష్యుడు "స్వామీజీ ! నూట యాభై సంవత్సరాల క్రింద మనం ఇక్కడ ఉన్నట్లు ఈ మందిరంలో తపస్సు చేసినట్లు నాకు కన్పిస్తున్నది" అన్నాడు నిజమే, అతని అనుభూతి సత్యమైనదే. కాళిదాస మహాకవి కర్పూరాది స్తోత్రంలో ఈ దేవత నిలా స్తుతించి తన భక్తిని చాటుకొన్నాడు.

శ్లో॥ గతాసూనాం బాహు ప్రకరకృతి కాంచీపరిలస న్నితంబాం దిగ్వస్త్రాం త్రిభువన విధాత్రీం త్రిణయనాం శ్మశానస్థే తల్పే శవహృది మహాకాల సురత


ప్రసక్తాం త్వాం ధ్యాయన్ జపతి జడచేతా అపి కవిః

శ్మశానంలో చితాశయ్య - దానిపై శవం శవం మీద మహాకాలునితోన్నది కాళి. ఆమె దిగంబర. నడుముచుట్టూ నరికిన చేతుల దండతో మూడు కన్నులతో మూడు లోకాలను శాసించే మహాశక్తి అటువంటి నిన్ను జపం చేస్తే ఓ మహాకాళీ ! జడుడు కూడా మహాకవి అవుతాడు.

కాళీదేవి కాళిదాసుకు కవిత్వము నిచ్చింది. తెనాలి రామకృష్ణునకు కూడ కవితాశక్తి నిచ్చింది. తెనాలి రామలింగేశ్వరాలయ ధ్వజ స్తంభం క్రింద దొరికిన కాళీ విగ్రహం దీనికి నిదర్శనంగా నిలిచి ఉంది.


( సశేషం )

🌹🌹🌹🌹🌹


సిద్దేశ్వరయానం - 107 Siddeshwarayanam - 107

🌹 సిద్దేశ్వరయానం - 107 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 3 🏵


ఒకసారి కర్నూలులో మరొకసారి తెనాలిలో బౌద్ధ ధ్యానయోగ సంప్రదాయానికి చెందిన సాధకులు తమ ధ్యాన సమావేశానికి నన్ను ఆహ్వానించి బుద్ధుని ఆవాహన చేయవలసినదిగా నన్నర్థించారు. "ఆప్తులారా ! నామీది గౌరవంతో ఈ సమావేశానికి నన్ను పిలిచారు. మీది నిర్గుణ ధ్యానయోగ పద్ధతి. మంత్ర మార్గం మీద మీకు నమ్మకం లేదు. నేను దేవతలను పిలవడానికి మంత్ర పద్దతిని ఉపయోగిస్తాను. ఉన్న విషయం ఇది. మీ ఇష్టం” అన్నాను. “మీరు ఏమి చేసినాసరే, బుద్ధుని ఆవాహన చేయటం మాకు కావాలి” అన్నారు వారు. "బుద్ధుడు వచ్చినది, లేనిది తెలుసుకోగలవారు మీలో ఎవరైనా ఉన్నారా ?” అన్నాను. 'మేము గుర్తించగలము" అన్నారు. ఇద్దరు ధ్యానయోగులు. రెండు చోట్ల బుద్ధుడు అవతరించాడు. ఒక చోట ఎదురుగా వాయు మండలంలో నిల్చున్నాడు. మరొక చోట నా శరీరంలోకి ప్రవేశించాడు. అక్కడి సాధకులు ఈ విషయాన్ని గుర్తించటం జరిగింది. అయోధ్యలో కూడా అదే విధంగా భద్రకాళి దిగివచ్చి అనుగ్రహాన్ని చూపించింది.

కాశీ దగ్గర సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న చునార్ కొండలమీది కాళీ ఆలయానికి వెళ్ళాము. కాళీ దర్శనం చేసి, ఇవతల అందరమూ మాట్లాడుతూ ఉండగా వృద్ధుడైన ఒక యోగి అక్కడకు వచ్చిన నా వైపు చూచి ఇలా అన్నాడు. "నేను ఇక్కడకు కొద్ది మైళ్ళదూరంలో ఒక అడవిలో ఉంటూ ముప్పై ఏండ్ల నుంచి తపస్సు చేసుకొంటున్నాను. నిన్న రాత్రి కాళీదేవి నాకు ధ్యానంలో కనిపించి 'దక్షిణాపథం నుండి నా భక్తుడొకడు వస్తున్నాడు. ఆ సిద్ధేశ్వరుని దర్శనం చేసుకో' అని ఆదేశించింది, ఆమె అనుగ్రహం వల్ల మిమ్ము గుర్తుపట్టగలిగాను. అమ్మ దయకు పాత్రులైన మహాత్ములు మీరు” అని ప్రేమ గౌరవములతో తన సాధన గురించి చెప్పాడు. ఎక్కడి గుంటూరు! ఎక్కడి చునార్ కొండలు ! ఎక్కడెక్కడి వ్యక్తులు వీరంతా !

ఆ కొండల దగ్గర క్రింద భాగంలో వల్లభాచార్యుడు స్థాపించిన రాధాకృష్ణ మందిరం ఉంది. ఆ మందిరం చూద్దామని నాతో వచ్చిన వారంతా అంటే సరే ! అని వెళ్ళాము. గర్భగుడి తలుపు పూజానంతరం తెరిచినపుడు సింహాసనం మీద అందమైన రాధాకృష్ణ విగ్రహాలను చూచి నమస్కరించి, " విగ్రహాలు చాలా అందంగా ఉన్నవి, శిల్ప నిర్మాణం అద్భుతమైనది" అన్నాను. అక్కడ వారు ఆశ్చర్యంతో “స్వామీజీ! ఇక్కడ విగ్రహాలు ఏమీ లేవు. ఆ సింహాసనమును 'రాధాకృష్ణుల గద్దె' అంటాము. ఇక్కడి సంప్రదాయంలో విగ్రహాలు పెట్టరు. రాధాకృష్ణులు అక్కడ ఉన్నారని భావించి పూజ చేస్తాము. మీకు విగ్రహాలు ఎలా కనిపించినవో మాకు అర్థం కావటం లేదు" అన్నారు. ఇవతలకు వచ్చిన వాణ్ణి మళ్ళీ వెళ్ళి చూశాను. నిజమే ! అక్కడ విగ్రహాలు ఏమీ లేవు. కానీ ఇంతకు ముందు నాకు కనిపించటం కూడా నిజమే. అది రాధాకృష్ణుల దయ.

కాశీలో కీనారామ్ అఘోరీ ఆశ్రమం ఉన్నది. షాజహాన్, ఔరంగజేబుల కాలంలో జీవించిన కాళీసిద్ధుడు అతడు. బెలూచిస్థాన్ లోని హింగుళాకాళీని శ్మశాన సాధనలతో ఆరాధించి సిద్ధుడై ఆమెను కాశీకి తీసుకు వచ్చాడు. పుర్రెల తోరణాల మాలతో ఉన్న ముఖద్వారం ఇప్పుడు కూడా అందరికి స్వాగతం చెపుతుంది. ఆనాడు అతడు 170 సంవత్సరాలు జీవించి సజీవసమాధిలోకి ప్రవేశించాడు. మణికర్ణికా ఘట్టం నుండి శ్మశాన అగ్నిని తెచ్చి అతడు వెలిగించిన హోమకుండం ఇప్పటికీ ఆరకుండా కొనసాగుతూనే ఉంది. ఆ ఆశ్రమంలో ప్రవేశించినపుడు పురా స్మృతులెన్నో మనసులో మెదిలినవి. అతని సంప్రదాయంలో సాధన చేసిన ఒక యోగి తన సాధన పరిపూర్ణత కోసం నూట యాభై సంవత్సరాల క్రింద కాశీలో నా దగ్గరకు వచ్చి నా శిష్యుడైనాడు.ఈనాడు అతడు జన్మమారి గుంటూరు హిందూకాలేజీలో లెక్చరర్గా ఉంటూ మళ్ళీ నా శిష్యుడై తీవ్రసాధన చేస్తున్నాడు.


( సశేషం )

🌹🌹🌹🌹🌹