సిద్దేశ్వరయానం - 124 Siddeshwarayanam - 124

🌹 సిద్దేశ్వరయానం - 124 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵️ దేవ రహస్యము 🏵️


హిమాలయపర్వతాలు - అచట మానస సరోవరము, కైలాసపర్వతము అక్కడ రహస్యంగా ఉన్న సిద్ధాశ్రమమునకు కొన్ని వేల యేండ్ల నుండి అనుబంధం ఉన్న ప్రదేశాలు కాశీ, కామాఖ్య, బృందావనం, కొన్ని జన్మలలో గాఢమైన సంబంధం ఉన్న ప్రాంతాలు.

అయిదువేల సంవత్సరాల క్రింద అస్సాం దగ్గర నాగభూమిలో ద్వాపరాంతంలో వచ్చిన జన్మ. ఆ జన్మలో కుర్తాళం రావటం ఆప్తుడైన మౌనస్వామితో నాలుగువేల యేండ్ల క్రింద మొదటిసారి. మళ్ళీ యిటీవల కాలంలో ఏర్పడిన సాన్నిహిత్యం. కొండలలో, అడవులలో, క్షేత్రాలలో, నదీతీరాలలో ఆశ్రమాలలో తపస్సాచరించాను. ఈ జన్మలో కూడా నేను పుట్టింది నరసింహస్వామి గుహలో వెలసిన కొండ క్రింది గ్రామమే. (ప్రకాశం జిల్లా - ఏల్చూరు). యాభై యేండ్ల క్రింద నుండి పర్వతాలు - అరణ్యాలు మహనీయులైన యోగుల కోసం అన్వేషణ. ఆ సంచారంతో ప్రాప్తించిన సిద్ధానుగ్రహం. ఇటీవల జరిగిన ఒక అనుభవం ఇక్కడ చెప్పటం జరుగుతున్నది. అయితే స్థలాలు, పేర్లు రహస్యంగా ఉంచవలసిన నియమం ఉంది గనుక కొంతవరకు మాత్రమే యివ్వబడుతున్నది.

ఒకటనాటి అర్థనిశావేళ ధ్యానసమయంలో ఒక మహా పర్వతగుహకు రావలసినదిగా సిద్ధసూచన వచ్చింది. ఆ ప్రదేశానికి చేరాలంటే సులభం కాదు. గ్రామాలు దాటి అడవులలో నుండి వెళ్ళాలి. మరునాడు బయలుదేరాలని అనుకొన్నాను. కాని ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం వచ్చింది.; కదలలేని స్థితి. ఎందుకిలా అయింది? అని. కండ్లుమూసుకొని ధ్యానం చేశాను. ఆశ్చర్యంగా భూతప్రేతములు కొన్ని క్రూరంగా చూస్తూ కనిపిస్తున్నవి. నేను సిద్ధుల గుహకు వెళ్ళకుండా చేయటమే వాటి లక్ష్యంగా తెలిసింది. అసహాయ స్థితిలో భైరవుని ప్రార్థించాను.

అవసరమునకే దేవత ఆదుకొనని సమయములో అసహాయుడనైన నాకు ఆయువు పోసిన దైవము కాశీపుర రక్షకుండు కాళీ ప్రియ నాయకుండు ప్రభువు గురువు నాకన్నియు భైరవుడరుదెంచుగాక!

భైరవుని అవతరణతో పిశాచాలు పలాయనం చిత్తగించినవి. ప్రయాణం మొదలైంది. వివిధ వాహనాలలో గమ్యస్థానానికి కొంత దూరం వరకు వెళ్ళాను. అక్కడ నుండి అరణ్యమార్గం. ఇతరులకు అనుమతి లేదు. జ్వరం, నీరసం, అతికష్టంగా కొండ ఎక్కటం మొదలు పెట్టాను. కాసేపటికి నీరసం తగ్గింది. ఎవరో పైకి తీసుకొని వెళ్తున్నట్లనిపించింది. "చేదుకో మల్లయ్య ! చదుకోవయ్య !" అని శ్రీశైలం ఎక్కలేక అలసివారు ప్రార్థించినట్లు నా ప్రార్ధన మన్నించి పైకి లాగుకొని వెళ్తున్నారు. గాలిలో తేలిపోతున్నానని అనలేను గాని ఇంచుమించు అలా ఉంది.

కుర్తాళం దగ్గర తెన్కాశిలో ఇటువంటిదే ఒక వింత. మొదటనే పెద్ద గోపురం, ప్రవేశికకు గర్భగుడికి మధ్య ఖాళీ స్థళం. సగం దూరం పోయిన దాకా కట్టుకొన్న ధోవతులు గాలికి వెనక్కు వెళ్ళినట్లుంటుంది. పెద్దగాలి యేమీ ఉండదు. సగం దూరం వెళ్ళిన తర్వాత గుడ్డలు ముందుకు వెళ్తుంటవి. మనం నాలుగడుగులు ముందుకు వస్తే భగవంతుడు పది అడుగులు ముందుకు వస్తాడంటారు. నా పరిస్థితి అలాగే అయింది. మొత్తం మీద గుహకు చేరాను. లోపల పెద్ద హోమకుండం. పక్కనే ఆఖ్యపాత్రలు, మనుషులు లేరు. కనుచూపు మేరలో ఎక్కడా నరుల అలికిడి లేదు. ఉన్నట్లుండి గాలిలో నుండి ముగ్గురు ఋషులు కమండలాలు ధరించి ప్రత్యక్షమైనారు. సాష్టాంగ నమస్కారం చేశాను. తమ కమండలువులలోని పవిత్రజలం నాపై చల్లారు. వారు మౌనంగానే ఉన్నారు. ఆ మౌనంలోనే మనోభూమికలో కొన్ని రహస్య విషయాలు తెలియజేశారు. ప్రేమదయార్ద్ర దృక్కులతో ఆశీర్వదించి అదృశ్యమై పోయినారు. అందులో ఒకరుకొన్ని వందల సంవత్సరాల క్రింద నాతో కలిసి డాకినీ శ్మశానంలో సాధన చేసిన యోగి - మైత్రీమధురుడు. ఆ పరమాప్తుడు కఠోర తపస్సు చేసి భౌతిక శరీరస్థితిని అధిగమించి దివ్య సువర్ణ కాంతిమయ దేహాన్ని సాధించాడు. నేను మానవజన్మ ఎత్తవలసి వచ్చిందే అని అతని బాధ. ఆ బాధ అతని కన్నులలో వ్యక్తీకృతమైంది. నందీశ్వరుని అనుగ్రహం వల్ల అగస్త్యుని మిత్రుడైన సుందర నాథుడు తిరుమూలర్ అనే ద్రవిడ యువకుని శరీరంలో ప్రవేశించి సువర్ణ సుందర శరీరం పొందినటులే ఇతడు కూడా పొంది కాలావధులను దాటగలిగినాడు. సిద్ధాశ్రమయోగుల సంకల్పం వల్ల భౌతిక ప్రపంచంలో దేవకార్యం కోసం పంపబడటం వల్ల నాకు చింతలేదు. అయినా నేను తనవలె కావాలని ఆమిత్రుని ఆకాంక్ష. ఈ సంఘటన తర్వాత కొంత కాలానికి నేను తీర్థయాత్రలో ఉండగా ఏకాంతంగా నా దగ్గరకు మేము ఉపాసించిన దేవతను ఆవాహనం చేసి ఆశీర్వదింప జేశాడు. అతనితో పునస్సమాగమం ఎటుదారి తీస్తుందో!

( సశేషం )

🌹 🌹 🌹 🌹 🌹

నేడు పోలాల అమావాస్య (Polala Amavasya)

_నేడు పోలాల అమావాస్య_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

పోలాల అమావాస్య - (పోలాంబ వ్రతం) నాడు పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి ?

పోలేరమ్మ అమ్మవారు గ్రామదేవతగా పూజలందుకుంటూ ఉన్న దేవత. దాదాపు ప్రతి గ్రామం , పట్టణాల్లో పొలిమేర్లలో ఈ అమ్మవారి ఆలయాలు కొలువుదీరి పూజలందు కుంటూ ఉండడం చూడవచ్చు.

ఆమె సంతానం లేనివారికి సంతానం ప్రసాదిస్తుందనీ , సంతానం కలిగినవారికి కడుపు చలువ చేస్తుందని విశ్వాసం. అటువంటి దేవతను పూజిస్తూ చేసే వ్రతమే ఇది.


పోలాల అమావాస్య

వ్రతాలమాసంగా ప్రసిద్ధి చెందినది శ్రావణమాసంలోని వ్రతాలలో “పోలాల అమవాస్య వ్రతం” ఒకటి.

దీనిని శ్రావణ మాసంలోని బహుళ పక్ష అమవాస్యనాడు ఆచరిస్తారు. ఈ అమవాస్యకు ‘పోలామావాస్య’ అని పేరు. దీనికే ‘పోలాల అమావాస్య , పోలాలమావాస్య , పోలాంబవ్రతం’ వంటి పేర్లు కూడా ఉన్నాయి.

ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పిల్లలకు ‘అపమృత్యు భయం’ తొలగిపోయి ఆయురారోగ్యాలు వర్ధిల్లుతాయని చెప్పబడుతూ ఉంది.

ఈ వ్రతమునకు సంబంధించి ఆసక్తికరమైన ఒకగాథ ప్రచారంలో ఉంది.

పూర్వం బ్రాహ్మణ దంపతులు ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవారు. వారికి ఏడుగురు కుమారులు కలిగారు. యుక్త వయస్సు రాగానే వారందరికీ వివాహాలు చేశారు.

వారికి సంతానం కూడా కలిగింది. ఆ ఏడుమందీ తల్లిదండ్రుల వద్ద నుంచి వేరై… అదే గ్రామంలో విడివిడిగా నివాసాలను ఏర్పాటు చేసుకుని నివసిస్తూ ఉండేవారు.

తమ సంతానం బాగా ఉండాలంటే ‘పోలాంబ’ అమ్మవారిని శ్రావణమాసంలో అమవాస్య నాడు పూజిస్తూ వ్రతం చేయడం మంచిదని ఎవరో చెప్పగా విన్న ఆ ఏడుమంది శ్రావణ అమవాస్య కోసం ఎదురుచూడ సాగారు.

శ్రావణమాసం వచ్చింది. అనేక వ్రతాలను ఆచరించారు. చివరిరోజు అయిన అమవాస్యనాడు పోలాంబవ్రతం ఆచరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు.

ఏడుగురు కోడళ్ళ ఉత్సాహంగా వ్రతం చేసేందుకు సిద్ధమయ్యారు. వ్రతం నాటి ఉదయాన్నే ఏడో కోడలి బిడ్డ మరణించింది.

ఫలితంగా ఆ రోజు వ్రతం చేయలేకపొయ్యారు. మరుసటి సంవత్సరం వ్రతం చేయడానికి ప్రయత్నం చేశారు.

కానీ మళ్ళీ ఆ సంవత్సరమూ ఏడవ కోడలి మరో బిడ్డ చనిపోవడంతో వ్రతానికి ఆటంకం ఏర్పడింది. ఈ విధంగా ప్రతి సంవత్సరం వ్రతం చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడం ఆ దినం ఉదయం ఏడవ కోడలి బిడ్డ మరణించడం వ్రతంచేయలేకపోవడం…

ఈ విధంగా ఏడు సంవత్సరాలు జరిగింది. మిగతా ఆరుమంది కోడళ్ళు ఏడవ కోడలి వల్ల వ్రతం చెడిపోతూ ఉంది అని తిట్టుకోసాగారు. ఆమెకు ఎక్కడలేని దుఃఖం కలుగుతూ ఉండేది.

మరుసటి సంవత్సరం అంటే ఎనిమిదో సంవత్సరం నోముకు అవసరమైన ఏర్పాట్లు అన్నీ చేసుకున్నారు.

అయితే ఆ రోజు ఉదయమే ఏడో కోడలి బిడ్డ చనిపోయింది. ఈ విషయం తెలిస్తే అందరూ నిందిస్తారని , వ్రతం తన వల్ల ప్రతి సంవత్సరం చెడిపోతూ ఉందని కోప్పడతారని భావించిన ఏడో కోడలు ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా.

చనిపోయిన బిడ్డ శరీరాన్ని ఇంట్లో ఉంచి , మిగతా కోడళ్ళందరి తో కలిసి వ్రతంలో పాల్గొంది.

అందరూ ఆనందంతో వ్రతం చేస్తూన్నా… తాను మాత్రం ఏదో పాల్గొంటూ ఉన్నట్లుగా యూంత్రికంగా వ్రతంలో పాల్గొంది. రాత్రి వరకూ అలా గడిచింది.

చీకటిపడి గ్రామం సదుమణిగిన అనంతరం చనిపోయిన బిడ్డను భుజాన వేసుకుని గ్రామ పొలిమేరలో ఉన్న ‘పోలేరమ్మ’ గుడికి వెళ్ళి బిడ్డను గుడిమెట్ల మీద ఉంచి , తన పరిస్థితిని తలుచుకుని దుఃఖించసాగింది. ఎలా ఖననం చేయాలి ? అని ఏడ్వసాగింది.

ఇలాంటి స్థితిలో గ్రామదేవత అయిన పోలేరమ్మ గ్రామ సంచారం ముగించుకుని , అక్కడికి చేరుకుని ఆమెను చూసి ఆ సమయంలో ఏడుస్తూ అక్కడ కూర్చొనడానికి కారణం అడిగింది.

దీనితో ఆమె గత ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్నదంతా వివరించింది.

వీటన్నింటిని విన్న పోలేరమ్మ అమ్మవారు కరుణించి ఆమెకు అక్షతలు యిచ్చి పిల్లలను కప్పిపెట్టిన చోట వాటిని చల్లి పిల్లలను వారి వారి పేర్లతో పిలువవలసిందిగా చెప్పింది.

ఏడవకోడలు అదేవిధంగా చేసింది. ఫలితంగా చనిపోయిన పిల్లలందరూ నిద్ర నుంచి లేచి వచ్చినట్లుగా లేచి వచ్చారు. వారందరినీ తీసుకొని పోలేరమ్మ అమ్మవారికి నమస్కరించి , ఇంటికి చేరుకుంది.

మరుసటి రోజు ఉదయం తన ఆరుగురు తోడి కోడళ్ళతోపాటూ గ్రామంలోని వారందరికీ ఈ విషయాన్ని వివరించింది.

వారందరూ ఎంతో సంతోషించారు. అంతే కాకుండా అప్పటి వరకూ కేవలం కొద్ది మందికి మాత్రమే పరిమితమైన ఈ వ్రతం అప్పటి నుంచి అందరూ చేయడం ప్రారంభించినట్లు చెప్పబడుతూ ఉంది.

కాగా , ‘పోలేరమ్మ అమ్మవారు’ గ్రామదేవతగా పూజలందుకుంటూ ఉన్న దేవత. దాదాపు ప్రతి గ్రామం , పట్టణాల్లో పొలిమేర్లలో ఈ అమ్మవారి ఆలయాలు ఉండడం గాని , లేదంటే బహీరంగంగా కొలువుదీరి పూజలందుకుంటూ ఉండడం గానీ చూడవచ్చు.

ఆమె సంతానం లేనివారికి సంతానం ప్రసాదిస్తుందనీ , సంతానం కలిగినవారికి కడుపు చలువ చేస్తుందని విశ్వాసం. అటువంటి దేవతను పూజిస్తూ చేసే వ్రతమే ఇది.

పాటించవలసిన ముఖ్య నియమములు

తెల్లవారు ఝామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని , తలస్నానంచేసి , ఇంటిని శుభ్రపరచుకుని మహిళలు తమ పిల్లలను వెంటబెట్టుకుని పోలేరమ్మ ఆలయానికి వెళ్ళి పూజలు చేసి , ఇంటికి చేరుకుని పూజాగదిలో పోలేరమ్మను పసుపుకొమ్ముతో గానీ , పసుపుతోగాని చేసుకొని ప్రతిష్టించుకుని పూజ చేయాలి. ఈ పూజావిధానములో పార్వతీ దేవి అష్ణోత్తరం చదవుతూ ఉండడం విశేషం. పూజ ముగించిన అనంతరం పసుపు పూసిన దారానికి పసుపుకొమ్మ కట్టి తయారుచేసుకున్న తోరము’ ఒకదానిని తీసుకుని పోలేరమ్మకు సమర్పించడంతో పాటూ , మిగతా తోరములను పిల్లల మెడలో వేయాలి.

ఈ విధంగా పూజచేసి ‘పెరుగు అన్నం’ ను నైవేద్యంగా సమర్పించి పూజ ముగించాలి. పెరుగన్నమును ప్రసాదంగా స్వీకరించి వ్రతాన్ని ముగించాలి.

ప్రతి సంవత్సరం శ్రావణ బహుళ అమవాస్య రోజు వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానభాగ్యం కలుగుతుందనీ , సంతానానికి అపమృత్యు భయం తొలగిపోయి ఆయురారోగ్యాలు వర్ధిల్లుతాయని శాస్రాలు చెబుతున్నాయి.