🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము - 6 🌹

🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము 🌹
✍ రచన : పేర్నేటి గంగాధరరావు
6 వ భాగము

🌴 ఉత్పత్తి ప్రకరణము  🌴
🌻 5. పురుష ప్రయత్నము - 1 🌻

వశిష్ఠుడు రామునుద్దేశించి, ఇంకను ఏమి చెప్పుచున్నాడంటే, పురుష ప్రయత్నము వలననే, జ్ఞానము లభించుచున్నది. జ్ఞానము వలన జీవన్ముక్తి లభించును.

పురుషాకారము అనగా మనోవాక్కాయములందు చరించుట. అనగా ఏది ఆలోచిస్తామో అది మాట్లాడుట, ఏది చెబుతామో అది చేయుట. అలా కానిచో అది గతి తప్పుట. శాస్త్రానుసారము, ఎవరేది కోరునో వారది పొందును. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వారి వారి పురుషాకారముల వలననే సృష్టి, స్ధితి, లయ కారకులయ్యారు. పురుష ప్రయత్నము, శాస్త్ర విరుద్ధమైన కార్యము లాచరించినపుడు, వ్యధలనుభవించవలసి వచ్చును.

ఉదా:సూర్యచంద్రులు, తమ గతి తప్పినపుడు, ప్రళయము సంభవించును. అలానే విద్యుక్త ధర్మము ననుసరించకపోయిన, దుష్ఫలితము సంభవించును. మంచి కర్మల వలన చెడు నశించును. ఒకవేళ సత్కర్మ చేసినప్పటికి ఫలితము చెడుగానున్న, చెడు సంస్కారములు బలముగానున్నట్లు భావించవలెను. అపుడు సత్కర్మలు ఆపకుండా కొనసాగించిన సత్ఫలితములు కల్గును.

శరీరము అస్ధిరము. మరణము నీడ వలె వెంటాడుచున్నదని ఎల్లపుడు భావించుచుండవలెను. ముముక్షువు పురుషాకారమున మొదట సాధన చతుష్టయము ననుసరించవలెను.

సత్‌ శాస్త్ర విధిననుసరించి, సత్‌ సంగమొనర్చి, సదాచార పూర్వకముగ నొనర్చిన కర్మయే, సంపూర్ణ ఫలప్రదమగును. అనర్ధ హేతువగు సోమరి తనము లేకున్న దొడ్డ ధనికుడో లేక పండితుడో కాని వాడెవడు. సోమరి తనము వలనే భూమండలము మూర్ఖులతో దరిద్రులతోను నిండి యున్నది. అదృష్టమన్న దానిని కూడ నమ్మరాదు. సాధనయే జీవుని యుద్ధరించునది. ఈ జన్మమున యొనర్చిన అశుభకర్మలు ప్రాయశ్చిత్తాది కర్మల వలన శుభములుగ మారునట్లు, పూర్వకర్మలు కూడ పురుష ప్రయత్నము వలన, శుభప్రదములుగ మార్చవచ్చును. కష్టపడి ఆర్జించిన విత్తమంతయు నష్టమైన, మరల పొందుటకు ప్రయత్నింపవలెను గాని దుఃఖించుట అనుచితము.

జయించ వీలు లేని మృత్యువును గూర్చి ప్రతి దినము దుఃఖించుచుండ మృత్యువు ఆగునా! అందువలన పౌరుషము నాశ్రయించి, సాదుసంఘశాస్త్ర విచారము వలన చిత్తశుద్ధిని పొంది సంసార సాగరమును దాటవలెను.
ఏ పురుషుడైనను, పురుష ప్రయత్నము వలన ప్రాప్తకర్మలను అణగదొక్కిన సుఖ, దుఃఖములను దాటగలడు. పురుషాకారమును విడిచి ''ఎవరో నన్ను ఉద్ధ్రించగలరు'' అని తలచువాడు వ్యర్ధుడు.

ఎన్ని సమస్యలు వచ్చినను, రాగద్వేషములన్నియు సిద్ధించును.
శుశ్రూష, స్వాధ్యాయము, సాధుసంగమము, శ్రవణాదుల వలన చిత్తమును, కలుషరహిత మొనర్చి, ఆత్మోద్ధరణకు పాటుపడవలెను.

పరలోకమున అనుభవించగా మిగిలిన ప్రాప్తకర్మనే, అదృష్టమని, దైవమని అనవచ్చును.

పురుష ప్రయత్నము వలన ఫలము అరచేతిలోని ఉసిరిక వలె లభించును. మూర్ఖుడే పురుష ప్రయత్నము వీడి, అదృష్టముపై ఆధారపడును.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్

🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము - 5 🌹

🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము 🌹
✍ రచన : పేర్నేటి గంగాధరరావు
5 వ భాగము

🌴 ఉత్పత్తి ప్రకరణము  🌴

🌻 4. సూక్ష్మశరీరము   🌻

తదుపరి వశిష్ఠుడు శ్రీరామునికి సూక్ష్మశరీరతత్వమును బోధించుచున్నాడు. ఏ ప్రాణియైనను, మృతి చెందినపుడు, జీవాత్మ సూక్ష్మశరీరము ధరించి హృదయాకాశమున వాసనామయములగు (సంస్కారములు) త్రిలోకములను గాంచుచుండును. నిజానికి ఈ జీవాత్మ జన్మాది వికార రహితుడగు పరబ్రహ్మము. మరణ సమయమున మానసమందు నిలబడు కోర్కెలలో నేది అగ్రగణ్యమో దానినే జీవు డనుభవించును. నిజానికి జగత్తుమిధ్య, అసత్యమైనది. ఈ విషయము మరణ సమయ మందు, జనన సమయమందు, హృదయాకాశమున అనుభూతమగును. అనగా మరణ వేదనలో తన సంస్కారములన్ని, అనుభూతికి వచ్చి అంతా భ్రమయని తోచును. కాని సంస్కారములు నశించవు.

జన్మ సమయములో గూడ, ఆ సంస్కారములు భ్రమయని తెలిసినప్పటికి జన్మించిన తరువాత, మాయ ఆవరించి తన గత సంస్కారములు అలానే వుండును. బ్రతుకు నందలి ఆశ, పుట్టుక, చావు అనుమిధ్యా ప్రపంచము నిజమని తలచును.

స్ధూల శరీరములో సూక్ష్మ శరీరము, సూక్ష్మ శరీరములో కారణ శరీరము గలదు. ఈ మూడు శరీరములే సంసారమునకు కారణమగుచున్నవి.

సాధన ద్వారా ఈ మూడు శరీరములు దగ్ధమైనపుడే ముక్తి లభించును. ఈ సంస్కార తరంగములు నిద్రాసమయమందును, ప్రళయ సమయమందును చలనము లేక స్ధిరముగ వుండును. అది విశ్రాంతి సమయము. సృష్టి సమయము, స్వప్న సమయము లందు మరల భ్రాంతులు, తరంగములు లేచుచున్నవి. ఈ దేహత్రయములకు బ్రహ్మయే ఉపాధి. అందువలన స్థూల, సూక్ష్మ, కారణ శరీరములు నశించగానే బ్రహ్మము మిగులును.

సంస్కారముల ననుసరించి జన్మ లభించును.
జనులు మాటి మాటికి పుట్టుచూ, చచ్చుచూ క్రమముగా  సంస్కారములలోమార్పు తెచ్చుకొనుచు, చివరికి విదేహముక్తులగుదురు.

ఉదాహరణకు వ్యాసుడు ఈ బ్రహ్మయుగములో ముప్పది రెండవ వ్యాసుడు. అనగా పూర్వపు సృష్టులందు, ముప్పది ఒక్క వ్యాసులు చనిరి. ఇంకను వ్యాసులు ఎనిమిది పర్యాయములు జన్మించి, భారత ఇతిహాసములను, వేదవిభజనను ఎనిమిది పర్యాయములు చేసి భారత వంశమునకు కీర్తి దెచ్చి, పిదప విదేహముక్తుడై బ్రహ్మమును పొందును.

అలానే ప్రతి జీవి లక్షల జన్మములు ఎత్తి చివరకు ముక్తులు కావలసినదే. వివిధ జన్మలలో, ఇప్పుడున్న వారె అప్పుడు యధావిధిగ జన్మించి, సమకాలికులుగ వుందురు. అప్పుడప్పుడు విడివిడిగా గూడ జన్మింతురు. ఆయా జన్మలలో వారి వారి భార్య, బంధువులు, ఆయుర్ధాయము, జ్ఞానము ఒకే విధముగ ఇప్పుడున్నట్లే వుండును.

కేవలము ఒక్క తత్వజ్ఞాని మాత్రమే, వికల్పములు లేక పరమ శాంతుడై సంతృప్తుడై బ్రహ్మ పదమును పొందును. జ్ఞాని సదేహముక్తుడైనను, విదేహముక్తుడైనను ఒకటియె. ఈ రెండు ముక్తులును భిన్నములు కావు. సదేహముక్తునకు విషయ భోగములున్నచో, విదేహముక్తుని కంటే, తక్కువగ నెంచుకొనవచ్చును. అయితే విషయ భోగమందు రసబోధ లేనందు వలన రెండును నిర్వాణముక్తి వంటివే. నీరు అలలుగా వున్నను, కదలకున్నను నీరు నీరే కదా! అలానే గాలి కదులుచున్నను, కదలకవున్నను గాలి గాలే కదా!.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్

🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము - 4 🌹

🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము 🌹
✍ రచన : పేర్నేటి గంగాధరరావు
4 వ భాగము

🌴 ఉత్పత్తి ప్రకరణము  🌴

🌻 3. అఖండ చైతన్య స్వరూపము  🌻

అందుకు జనకుడు తాను గ్రహించినది తన తండ్రి పల్కినది కాక వేరేదియు లేదనియు ''అఖండచైతన్య స్వరూపము, అద్వితీయమైన పరమాత్మ స్వరూపము ఒక్కటే వున్నదని, తక్కిన వన్నియు లేనివేనని, అజ్ఞాన సంస్కారములు నశించినచో వ్యక్తి ముక్తుడై స్వస్వరూపమును పొందునని'' పల్కెను. చిన్న వయస్సులోనే శుకుడు భోగములను అనుభవించకుండగనే, విరక్తిని ప్రకటించి, పూర్ణత్వమును సాధించి సర్వజ్ఞానమును పొంది, వేదవ్యాసుని కంటే, గురువగు తన కంటే అధికుడవైనట్లు జనకుడు పల్కెను. నీ మనోరధము సిద్దించినదని, నీవు పొందవలసినదంతయు పొందియెయుంటి, ముక్తుడవని తెల్పెను.

తదుపరి శుకుడు సంశయరహితుడై, నిష్కాముడై నిర్వికల్ప సమాధి యందు, పదివేల ఏడ్లుండి, తైలహీన మగుదీపము వలె, ఆత్మ స్వరూపమున నిర్వాణమందెను. అని విశ్వామిత్రుడు శుకుని చరిత్రను తెల్పెను.*
*శుకుని వలె శ్రీరామచంద్రుడు తెలుసుకొనవలసినదంతయు తెలుసుకున్నాడని, శ్రీరాముడు భోగములందు విరక్తుడైనాడని పల్కెను.

కామక్రోధాదుల నెవడు జయించునో వాడే ముక్తుడు. అయితే శ్రీరాముని చిత్త శాంతి కొరకు వశిష్ఠుడు అతనికి తత్వబోధన చేయవలెనని పల్కెను. తక్కిన ఋషి పుంగవులు విశ్వామిత్రునితో ఏకీభవించిరి.

శ్రీ వశిష్ఠులు విశ్వామిత్రుని వచనములను తలదాల్చి శ్రీరామునికి అఖండ ఆత్మజ్ఞానమును బోధించుటకు ఉద్యుక్తుడయ్యెను. కాని శ్రీరాముడు మోక్ష శాస్త్రమును బోధించుటకు ముందు తన సందేహమును తీర్చవలయునని ఇట్లు పల్కెను.

శుకుని తండ్రియైన వ్యాసమహర్షి సర్వజ్ఞుడైనను విదేహముక్తిని పొందలేదు. అతని కుమారుడైన శుకుడు ఏల నిర్వాణముక్తిని పొందగల్గెను. అందుకు వశిష్ఠుడు ఇట్లు పల్కెను. పరమాత్ముని చైతన్య శక్తి యందు లేచి, మరల లీనమగు బ్రహ్మండత్రసరేణువులు అసంఖ్యాకములు, త్రిభువన మండలములు కూడ అసంఖ్యాకములు. అలాంటి జగద్రేణువులను జీవన్ముక్త పురుషులైన శుకుని వంటవారు నమ్మరు. అందువలన వీరు విదేహముక్తులుగ పిలువబడతారు. అందుకు శ్రీరాముడు తృప్తి చెంది, తాను అఖండ బ్రహ్మత్వమును గ్రహించితినని తెల్పెను.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్