కార్తీక_పౌర్ణమి - ''త్రిపురి పూర్ణిమ'', ''దేవ దీపావళి'' - Karthika Pournami - ''Tripuri Purnima'', ''Deva Diwali''

🌹 కార్తీక_పౌర్ణమి - ''త్రిపురి పూర్ణిమ'', ''దేవ దీపావళి'' 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 Karthika Pournami - ''Tripuri Purnima'', ''Deva Diwali'' 🌹
Prasad Bharadwaja


కార్తీక పౌర్ణమి మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం.

పరమ శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని కార్తీక పౌర్ణమి నాడు సంహరించి జగతిని కాపాడడం జరిగింది.

మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి.

ప్రజలను నానారకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు.

వెయ్యేళ్ళ రాక్షసుల పాలన అంతరించిన శుభసందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి.

కార్తీక పౌర్ణమి అటు శివునికి, ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు.

ఈరోజున దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ హరించు కు పోతాయి.

ఈ విశిష్ట దినాన సత్యన్నారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్ఠం.

ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారు జామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం.

నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయానే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.

కార్తీక పౌర్ణమి జైనులకు, పంజాబీలకు కూడా విశిష్ట పర్వదినం. గురునానక్ జయంతి కూడా ఈరోజే.

ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు.

పౌర్ణమినాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్లి దేవుని దర్శించిన అనంతరం, సాయంత్రం శుచిగా ఉసిరికాయపై దీపాలు వెలిగించాలి.

పౌర్ణమి నాడు చంద్రుడు పూర్ణత్వాన్ని చేరుకున్నట్లే మనసు కూడా జ్ఞాన పూర్ణం కావాలనేదే ఈ కార్తీక పౌర్ణమి పండుగ యొక్క ఆంతర్యం.

ఈ రోజన దీప దానం చేస్తే సకల పాపలు తొలగి, మోక్షం కలుగుతుందని చెబుతారు.

దీనివల్ల సమస్త జ్ఞానం కలుగుతుందని, సకల సంపదలు సిద్ధిస్తాయని ప్రతీతి.

కార్తీక మాసంలో చేసే దీప దానం వలన స్వర్గ ప్రాప్తి కలుగుతుంది.

కార్తీక పౌర్ణమి నాడు చేసే సాలగ్రామ దానం, ఉసిరి కాయల దానం వల్ల కూడా పాపాలు నశిస్తాయి.

ఏడాదంతా దీపం పెట్టని పాపం ఇవాళ దీపం పెడితే ఆ పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తారు.

గంగా, గోదావరి మొదలైన పుణ్య నదుల్లో కార్తీక దీపాలను వదలడం కన్నుల పండుగగా జరుపుతారు.

కార్తీక పౌర్ణమి నాడు రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు.

రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు.

కొందరు దీపాలను అరటి దొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు.

ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు.

కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే.

సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. ఈ పవిత్ర దినాన విష్ణు ఆలయంలో స్తంభ దీపం పెట్టినవారు శ్రీమహా విష్ణువుకి ప్రీతివంతులవుతారు.

ఈ దీపాన్ని చూసినవారి పాపాలు పటాపంచలవుతాయని విశ్వసిస్తారు.

జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కూడా ఇవాళ జరుపుతారు.

శివకేశవ భేదం లేని పరమ పవిత్రమైన మాసం లోని కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలాతోరణ దర్శనం చేస్తే సర్వపాపాలు తొలగుతాయి.

జ్వాలాతోరణ భస్మం ధరిస్తే భూతప్రేత పిశాచ బాధలన్ని నివారణవుతాయి.

కార్తీక జ్వాలాదర్శనం వలన మానవులకు, పశుపక్ష్యాదులకు, క్రిమికీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి.

ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరుతాయి.

అట్లే మహన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే,కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం.

అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది.

మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పము, తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది.

ఇంకా దేవాలయాల్లో సహస్ర లింగార్చన, మహా లింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం.

కార్తీక పౌర్ణమి రోజు చేసే దీపారాధన ఎంతో ప్రాముఖ్యమైనది.

ఏకతస్సర్వదానాని దీపదానం తథైకత అని శాస్త్రవచనం.

అంటే అన్ని దానాలు ఒక ఎత్తు దీపదానం ఒక ఎత్తు అని అర్ధం.

దీపదానం చేసేవారు పైడి పత్తిని తీసి వారే స్వయంగా ఒత్తులను తయారుచేయాలి.

వరిపిండి, గోధుమ పిండితో ప్రమిదను తయారుచేసి అందులో ఒత్తిడిని ఉంచి ఆవునెయ్యితో దీపాన్ని వెలిగించి పూజింజి దానికి నమస్కరించి కార్తీక సోమవారం లేదా పౌర్ణమి రోజున కార్తీక మాసంలో ఏ రోజునైనా, శైవ వైష్ణవాలయాల్లో ఉత్తముడైన బ్రాహ్మణుడికి దానం చేయాలి.

కార్తీక మాసమంతా ప్రతీ ఇంటి ముందు ద్వారానికి ఇరువైపులా తులసీ బృందావనం దగ్గర దీపాలను వెలిగించడం మన సంప్రదాయం. దీపం వెలిగించిన తర్వాత “దీపంజ్యోతి పరబ్రహ్మః దీపం సర్వతమో పహమ్ దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యాదీప నమోస్తుతే” శ్లోకం ద్వారా స్తుతించడం మన ఆచారం.

కార్తీక పౌర్ణమి రోజున సాయం సమయంలో ప్రమిదల్లో నూనె పోసి దీపాలను వెలిగించాలి.

వాకిలి ముందు ప్రమిదలను వెలిగించడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది.

దీపాన్ని ఆవాహన చేసిన మూర్తిని స్మరిస్తూ దీపదర్శనం చేస్తారో ఆ దీపజ్యోతి ఎవరిపై ప్రసరిస్తుందో వారు పాప విముక్తులై పునర్జన్మ లేని స్థితిని పొందుతారని నమ్మకం.

ఇతరుల వెలిగించిన దీపాన్ని ఎవరైతే ఆరిపోకుండా చూస్తారో వారు ఉత్తమమైన ఫలితాన్ని పొందుతారు.

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment