శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్రమణ్య స్వామి స్తోత్రాలు - Sri Subrahmanya Shashti, Subrahmanya Swami Stotras

🌹శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి. 🌹

దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో "శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా పరిగణిస్తారు. ఈ స్వామివారి జన్మవృత్తాంత విశిష్టత సమీక్షగా తెలుసుకుందాము !

పూర్వం మూడులోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న "తారకా సురుడు" అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై ! దేవతలు బ్రహ్మదేవుని శరణువేడినారు. దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేసినారు. ఈ తారకాసురుడు అమిత తపోబలసంపన్నుడు, అమితబలశాలి , వీనికి ఈశ్వర తేజాంశ సంభవుని వల్లకాని వానికి మరణములేదు. కావున ! మీరు సతివియోగ దుఃఖముతో ఉన్న ఈశ్వరునకు ఆ సతీదేవియే మరుజన్మయందు గిరిరాజు హిమవంతునకు పుత్రికగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అని తరుణోపాయం శెలవిచ్చారు.

అప్పటికే తపోదీక్షలో ఉన్న పరమశివునకు సేవలు చేస్తున్న ఆ జగన్మాత పార్వతికి , శివునకు అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు ! దేవతలు మన్మధుని ఆశ్రయిస్తారు.

మొత్తం మీద మన్మధుని పూలబాణాలతో ఈశ్వరుని చలింపచేసి తాను ఈశ్వరుని ఆగ్రహానికి గురు అయినా ! పార్వతి పరమేశ్వరుల కళ్యాణానికి మన్మధుడు కారణ భూతుడవుతాడు. కళ్యాణం అనంతరం దేవతల అభ్యర్ధనమేరకు పునర్జీవింపబడతాడు.

ఇలా ఉండగా ! పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందసమయాన అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గ్రహించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్‌కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక రెల్లుపొదలో విసర్జిస్తారు. అంత ఆ ఆరుతేజస్సులు కలసి ఆరుముఖాలతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఇది తెలిసిన పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు.

ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని , షట్‌కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని , కార్తికేయుడని , అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అనియు , సుబ్రహ్మణ్యస్వామి అనియు నామాలతో పిలువసాగిరి.

కారణజన్ముడైన ఈ స్వామి పార్వతి పరమేశ్వరులు , దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి , వానిని దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా , ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడ్నిచేసి, తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు.

అంత ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపందాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి కొన్ని అక్షౌహిణులను సంహరించి, రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి "సర్పరూపం" దాల్చి వారిని ఉక్కిరి బిక్కిరి చేసి, భీకర యుద్ధము చేసి తారకాసురుని సంహరించి విజయుడైనాడు.

సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి"గా పరిగణిస్తారని , సర్వులకు పూజ్యనీయులైన శ్రీ వేదవ్యాసులవారు దీని విశిష్టతను వివరిస్తారు.

ఈ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్కి గ్రామాలు , పట్టణాలు అనుబేధము లేకుండా దేశం నలుమూలలా దేవాలయాలు కలవు. ఈ రోజున "శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు తీర్ధములు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు.

ఈ స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు , చర్మవ్యాధులు తగ్గుతాయని , పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని ప్రజల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినాన శ్రీ స్వామికి పాలు, పండ్లు , వెండి , పూలు పడగలు , వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు.

ఇటువంటి పుణ్యప్రదమైన "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి" నాడు మనమంతా శ్రీ స్వామి విశేష పూజలు గావించి శ్రీ స్వామివారి కృపాకటాక్ష వీక్షణలు పొందుదాము.

వీలున్న వారందరూ తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధించండి. పెళ్ళి కాని వారికి , సంతానం లేని వారికి ఇది అమృతతుల్యమైన అవకాశం. సుబ్రహ్మణ్యుని అనుగ్రహముతో వివాహ ప్రాప్తి , సత్సంతానం , వంశాభివృద్ధి , జ్ఞానము , తేజస్సు, పాప కర్మల నుండీ విముక్తి కలుగుతుంది. కుండలినీ శక్తిని జాగృతం చేసి జీవితాశయం పొందడానికి కూడా సుబ్రహ్మణ్యుని అనుగ్రహము అతి ముఖ్యము🙏

🌹🌹🌹🌹🌹



><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><


🌹 సుబ్రమణ్య స్వామి స్తోత్రాలు 🌹


సుబ్రమణ్య అష్టకం

సుబ్రమణ్యం కరవాలంబ స్తోత్రం

సుబ్రమణ్య పంచరత్న స్తోత్రం

సుబ్రమణ్య అష్టోత్తర శతనామావళి

స్కంద షష్ఠి కవచం

----------------------------------------

స్కందషష్ఠి సందర్భంగా...


#స్కందోత్పత్తి

తప్యమానే తదా దేవే సేంద్రా సాగ్ని పురోగమాః౹
సేనాపతిమ్ మభీప్సంతః పితామహముపాగమన్౹౹ 1

తతో బ్రువన్ సురాస్సర్వే భగవంతం పితామహమ్౹
ప్రణిపత్య సురా రామ సేంద్రాస్సాగ్ని పురోగమాః౹౹ 2

యో నస్సేనాపతిర్దేవ దత్తో భాగవతా పురా౹
సదమః పరమాస్థాయ తప్యతే స్మ సహోమయా౹౹ 3

యదత్రానంతరం కార్యం లోకానాం హితకామ్యయా౹
సంవిధత్స్వ విధానజ్ఞ త్వం హాయ్ నః పరమాగతిః౹౹ 4

దేవతానాం వచః శ్రుత్వా సర్వలోక పితామహః౹
స్వాంతయాన్ మధురైర్వాక్యైః త్రిదశానిదమబ్రవీత్౹౹ 5

శైలపుత్ర్యా యదుక్తం తత్ న ప్రజా స్వాసు పత్నిషు౹
తస్యా వచనమక్లిష్టం సత్యమేవ నసంశయః౹౹ 6

ఇయమాకాశ గంగా యస్యాం పుత్త్రం హుతాశనః౹
జనయిష్యతి దేవానాం సేనాపతిమరిందమమ్౹౹ 7

జ్యేష్టా శైలేంద్ర దుహితా మానయిష్యతి తత్సుతమ్౹
ఉమాయాస్తద్బహుమతం భవిష్యతి న సంశయః౹౹ 8

తచ్చ్రుత్వా వచనం తస్య కృతార్థా రఘునందన౹
ప్రణిపత్య సురా స్సర్వే పితామహమపూజయన్౹౹ 9

తే గత్వా పరమం రామ కైలాసం ధాతుమండితమ్౹
అగ్నిం నియోజయామాసుః పుత్రార్థం సర్వదేవతాః౹౹ 10

దేవకార్యమిదం దేవా సంవిధత్స్వ హుతాశన౹
శైలపుత్ర్యాం మహాతేజో గంగాయాం తేజ ఉత్సృజ౹౹ 11

దేవతానాం ప్రతిజ్ఞాయ గంగామభ్యేత్య పావకః౹
గర్భం ధారయ వై దేవి దేవతానాం ఇదం ప్రియమ్౹౹ 12

ఇత్యేతత్వచనం శృత్వా దివ్యం రూపమధారయత్౹
స్వతస్యా మహిమాం దృష్ట్వా సమంతాదవసీర్యత౹౹ 13

సమంతతస్తదా దేవీం అభ్యషించత పావకః౹
సర్వస్రోతాంసి పూర్ణాని గంగాయా రఘునందన౹౹ 14

తమువాచ తతో గంగా సర్వ దేవా పురోగమం౹
అశక్తా ధారణే దేవా తేజస్సముద్ధతం౹
దాహ్యమానాగ్నినా తేన సంప్రవ్యథిత చేతనా౹౹ 15

అథాబ్రవీదిదం గంగం సర్వదేవ హుతాశనః౹
ఇహ హైమవతే పార్స్వే గర్భోయం సన్నివేశ్యతామ్౹౹ 16

శ్రుత్వా త్వగ్నివచో గంగా తమ్ గర్భమతి భాస్వరం౹
ఉత్ససర్జ మహాతేజః శ్రోతోభ్యో హాయ్ తదానఘ౹౹ 17

యదస్యా నిర్గతం తస్మాత్౹ తప్తజాంబూనదప్రభం౹౹ 18

కాంచనం ధరణీం ప్రాప్తం హిరణ్యమతులం ప్రభుం౹
తామ్రం కార్ష్ణాయసం చైవ తైక్ష్ణ్యాదేవాభ్యజాయత౹౹ 19

మలం తస్యా భవత్ తత్ర త్రపుసీసకమేవ చ౹
తదేతద్ధరణీం ప్రాప్య నానాధాతురవర్ధత౹౹ 20

నిక్షిప్తమాత్రే గర్భేతు తేజోభిరభిరంజితం౹
సర్వం పర్వత సన్నద్ధం సౌవర్ణమభవద్వనమ్౹౹ 21

జాత రూపమితి ఖ్యాతం తదాప్రభృతి రాఘవ౹
సువర్ణం పురుష వ్యాఘ్ర హుతాశన సమప్రభం౹
తృణవృక్షలతాగుల్మం సర్వం భవతి కాంచనం౹౹ 22

తం కుమారం తతో జాతం సేంద్రా స్సహమరుద్గణాః౹
క్షీరసంభావనార్థాయ కృత్తికా స్సమయోజయన్౹౹ 23

తాః క్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమం౹
దదుః పుత్త్రోయ మస్మాకం సర్వాసామితినిశ్చితాః౹౹ 24

తతస్తు దేవతా స్సర్వాః కార్తికేయ ఇతి బ్రువన్౹
పుత్త్రస్త్రైలోక్యవిఖ్యాతో భవిష్యతి న సంశయః౹౹ 25

తేషాం తద్వచనం శ్రుత్వా స్కన్నం గర్భపరిస్రవే౹
స్నాపయన్ పరయా లక్ష్మ్యా దీప్యమానం యథానలమ్౹౹ 26

స్కంద ఇత్యబ్రువన్ దేవాః స్కన్నం గర్భపరిస్రవేత్౹
కార్తికేయం మహాభాగం కాకుత్స్థ జ్వలనోపమమ్౹౹ 27

ప్రాదుర్భూతం తతః క్షీరం కృత్తికా నామనుత్తమమ్౹
షన్ణాం షడాననో భూత్వా జగ్రాహ స్తనజం పయః౹౹ 28

గృహీత్వా క్షీరమేకాహ్నా సుకుమారవపుస్తాదా౹
అజయ స్వేన వీర్యేణ దైత్యసైన్యగణాన్ విభుః౹౹ 29


సురసేనాగణపతిం అభ్యషించిన్ మహద్యతిం౹
తతస్తమలా సర్వే సమేత్యాగ్ని పురోగమాః౹౹ 30

ఏష తే రామ గంగాయా విస్తరోభిహితో మయా౹
కుమారసంభవశ్చైవ ధన్యః పుణ్యస్తథైవ చ౹౹ 31

భక్తశ్చ యః కార్తికేయే కాకుత్స్థ భువి మానవః౹
ఆయుష్మాన్ పుత్త్ర పౌత్త్రైశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్౹౹

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే సప్త త్రింశస్సర్గః౹౹ 32


👉దీనిని, గర్భవతులు విన్నా... చదివినా... కీర్తి,ప్రతిష్ఠలు కలిగిన పుత్రులు కలుగుతారు.

👉సుబ్రహ్మణ్యషష్ఠి రోజు ఎవరైతే, స్కందోత్పత్తి చదువుతారో వారిపిల్లలు ఆపదలు నుంచి రక్షించబడతయారు. -------------------------------------

సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు🙏

🌹🌹🌹🌹🌹


><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><



🌹. పెళ్లి కానివారు , సంతానం లేనివారు సుబ్రహ్మణ్య షష్టి రోజు స్వామిని పూజించండి 🌹

మాసానాం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. ఈ మాసం ఎంతో విశిష్ఠతను సంతరించుకుందని అర్థం. ఇది సంవత్సరంలో తొమ్మిదవ మాసం.

మృగశిరా నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసమే ఈ మార్గశీర్షం. ఈ మాసంలో పౌర్ణమి నాడు మృగశిర నక్షత్రం ఉంటుంది. మార్గశిర మాస శుక్ల షష్టి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం జరిగింది. తారకాసుర సంహారం కోసం , దేవతల కోరిక మేరకు పరమశివుని అంశతో మార్గశిర శుధ్ధ షష్టినాడు సుబ్రహ్మణ్యస్వామి జన్మించారు.

సుబ్రహ్మణ్యేశ్వరుడు కారణ జన్ముడు. తారకాసుర సంహారం కోసం జన్మించినవాడు. దేవగణానికి సర్వసేనాధిపతిగా పురాణాలు చెబుతున్న ఆ స్వామి సర్వశక్తిమంతుడు. ఆది దంపతులైన శివపార్వతులకు ముద్దుల తనయుడు. హిరణ్యకశ్యపుని కుమారుడు ‘నీముచి’. ‘నీముచి’ కొడుకు తారకాసురుడు.

తారకాసురుడు రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సుచేసి ఆయన ఆత్మ లింగాన్ని వరంగా పొందుతాడు.

అంతేకాకుండా ఒక బాలుడి చేతిలో తప్ప ఇతరులెవ్వరి వల్ల తనకు మరణం లేకుండా వరం పొందుతాడు. వర ప్రభావంతో తారకాసురుడు దేవతలను హింసించసాగాడు.

అతడితో యుద్ధం చేసి దేవతలు ఓడిపోతారు. ఇక తమ వల్లకాదనుకుని తారకుడి బాధలు పడలేక దేవతలు తమకొక శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని శివుడ్ని వేడుకున్నారట. వారి కోరిక మేరకు శివాంశతో కుమారస్వామి జన్మించాడు.

కుమారస్వామి దేవతలకు సేనానిగా నిలిచి తారకుడ్ని సంహరించాడు. అందువల్ల తారకుడి సంహారం కోసం జన్మించినవాడు కుమారస్వామి. అతనికి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనే పేరుకూడా వుంది.

సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం. రాహువునకు సుబ్రహ్మణ్యస్వామి , సర్పమంత్రాలు అధిష్టాన దైవాలు.

సర్వశక్తిమంతుడైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కరుణామయుడు. దయాహృదయుడు పిలిచిన వెంటనే పలికే దైవం. మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యం ఉంది. మన శరీరంలో ఉండే కుండలినీ శక్తికి సుబ్రహ్మణ్యస్వామి అధిదైవం. పురుషుల్లో ఉండే శుక్ర కణాలకు కూడా సుబ్రహ్మణ్యస్వామి కారకుడు. శరీరంలో ఉండే కుండలినికి చాలా శక్తి ఉంటుంది. శరీరంలో ఉండే ఎనర్జీ అంతా పాము ఆకారంలోనే ఉంటుంది. సర్పాలను నాశనం చేసిన వారికి లేదా ఎనర్జీని పాడు చేసినవారికి సంతానం ఉండదనేది ఒక సూత్రం. కాబట్టి ఆ ఎనర్జీని , ప్రకృతిని కాపాడడం కోసం ఈ రోజు సుబ్రహ్మణ్యస్వామిని పూజించాలి.

కొంతమంది ఈ రోజు బ్రహ్మచారులను పూజిస్తారు. కుజుడు మనిషికి శక్తి , ధనాన్ని , ధైర్యాన్నిస్తాడు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే అవన్నీ మానవులకు సమకూరుతాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపుడు కావడం వల్ల , సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్య ఆధీనంలో ఉంటారని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం , సుబ్రహ్మణ్య పూజ సర్వ శుభాలనిచ్చి , రాహుకేతు దోషాలకు కూడా పరిహారంగా భావించబడుతోంది.

పెళ్ళికాని వారు , పిల్లలు లేని వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి.

స్కంద షష్టి నాడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం నిర్వహిస్తారు. అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి.

అంతే కాదు సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. విశిష్టమైన ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసినా , కావడి సమర్ఫించినా సత్సంతాన ప్రాప్తి. రాబోయే తరాలవారికి కూడా సంతాన లేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకం.

తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది. షష్టి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం.

ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ , పాలతోనూ నింపుతారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తులు తెల్లవారు ఝూమున లేచి తలస్నానమాచరించి పాలు , పంచాదారలతో నిండిన కావడిలను ధరించి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పిస్తారు. దేవాలయాలను దర్శించి భక్తి శ్రద్ధలతో అష్టోత్తర శతనామాల పూజలు చేస్తారు. భక్తులు కావడిలతో తెచ్చిన పంచదార , పాలను స్వామికి సమర్పించుకుంటారు. అయితే ఈ కావడిలోని వస్తువులు భక్తుల మొక్కుల బట్టి ఉంటాయి.

మంగళవారం , శుద్ధ షష్టి , మృగశిర , చిత్త , ధనిష్ట ఏ నక్షత్రం కలిసిన రోజైనా కుజునికి , సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రీతికరం. ఆరోజున సుబ్రహ్మణ్య మంత్రం , కుజ మంత్రం జపించాలి. అనంతరం సుబ్రహ్మణ్య కుజులకు అష్టోత్తర , శత నామావళితో పూజచేయాలి. ఇలా తొమ్మిది రోజులు జపమూ , పూజ చేసి చంద్ర లేదా మోదుగ పుల్లలతో నెయ్యి తేనెలతో తొమ్మిది మార్లకు తగ్గకుండా హోమం చేసి దాని ఫలితాన్ని పగడానికి ధారపోసి ఆ పగడాన్ని ధరిస్తే మంచిదని చెబుతారు. ఇందువల్ల కుజ గ్రహ దోష పరిహారం జరిగి సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం కూడా కలుగుతుందంటారు. ఈ పూజా అనంతరం సర్ప సూక్తం లేదా సర్పమంత్రాలు చదవడంవల్ల ఇంకా మేలు జరుగుతుంది.

_________

🌹🌹🌹🌹🌹



><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><


🌹. కాలసర్పదోషం ఉన్నవారికి సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయస్కరం 🌹

జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు,కేతు దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అన్నివిధాల శ్రేయస్కరం. ఆ స్వామి జపం సర్వవిధాలా మేలు చేస్తుంది. అలాగే రాహు మంత్రం, సుబ్రహ్మణ్య మంత్రం సంపుటి చేసి జపించి సర్పమంత్రాలు చదువుతూ, పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. ఈ పూజల వల్ల రాహుగ్రహం అనుగ్రహమూ కలుగుతుంది, అలాగే సంతాన ప్రాప్తికోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి, తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకనే సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతానం లేని స్ర్తీలు పూజలు చేయడం మనం చూస్తూ వుంటాం.

సంతానప్రాప్తిని కోరే స్రీలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య, కేతు మంత్రాలతో 21మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్ సంతానం కలుగుతుందని మహిళా భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టు 21 లేదా 108 మార్లు మండలం పాటు (40రోజులు) ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని అంటారు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం సర్వ క్లేశాలను దూరంచేసి,సర్వశక్తుల్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే స్కందోత్పత్తి చదువుతారో వారి పిల్లలు ఆపదల నుంచి రక్షింపబడతారు....

రామాయణాంతర్గత స్కందోత్పత్తి

-----------------------------------

పరమేశ్వరుడు తపస్సు చేయుచుండగా పూర్వము దేవతలు ఋషులతో గూడి, సేనాపతిని కోరుకొనుచు బ్రహ్మదేవుని కడకు వెళ్ళిరి. ఇంద్రాది దేవతలు అగ్నిని ముందుంచుకొని, బ్రహ్మదేవునకు ప్రణమిల్లి, ఆయనతో ఇట్లు విన్నవించుకొనిరి. “ఓదేవా! పూర్వము మీరు పరమేశ్వరుని మాకు సేనాపతిగా నియమించియుంటిరి.

ఆ శంకరుడు ఇప్పుడు పార్వతీదేవితో గూడి హిమవత్పర్వతమున తపమొనరించుచున్నాడు. కర్తవ్య విధానము నెరిగిన ఓ బ్రహ్మదేవా! ఈ (సెనాపతి) విషయమున లోకహితమును గోరి అనంతర కార్యమును గూర్చి ఆలోచిమ్పుడు. ఇప్పుడు మాకు మీరే దిక్కు”.

దేవతల ప్రార్థనను ఆలకించి, సరలోక సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు మృదుమధుర వచనములతో వారిని ఓదార్చుచు ఇట్లు పలికెను.

“పార్వతీదేవి శాప కారణముగా మీకు మీ పత్నులయందు సంతానము కలుగు అవకాశము లేదు. ఆమె వచనము తిరుగులేనిది. ఇది ముమ్మాటికిని సత్యము. ఇందు సందేహము లేదు. ఆకాశమున ప్రవహించు ఈ గంగాదేవి యందు అగ్నిదేవుడు ఒక పుత్రుని పొందగలడు. అతడు దేవసేనాపతియై, శత్రు సంహారకుడు కాగలడు.

హిమవంతుని పెద్ద కూతురైన గంగ ఆ అగ్నిసుతుని (శివ తేజః ప్రభావమున అగ్నివలన తనయందు జనించిన సుతుని) ఆదరింప గలదు. అతడు పార్వతీదేవికి మిక్కిలి ప్రీతిపాత్రుడగును. ఇందు సంశయము లేదు”.

ఓ రఘునందనా! బ్రహ్మదేవుడు పలికిన ఆ మాటలకు దేవతలందరును సంతసించి, తాము కృతార్థులైనట్లు భావించిరి. అనంతరము వారు బ్రహ్మదేవునకు ప్రణమిల్లి, పూజించిరి. అంతట ఆ దేవతలందరునూ గైరికాదిధాతువులతో విలసిల్లుచున్న కైలాసపర్వతమునకు చేరి, పుత్రోత్పత్తికై అగ్నిదేవుని నియమించిరి. శివతెజమును భరించిన ఓ అగ్నిదేవా! ఈ దేవకార్యమును నెరవేర్పుము. శైలపుత్రికయైన గంగయందు ఆ శివ తేజస్సును ఉంచుము’ అని దేవతలు పలికిరి.

అగ్నిదేవుడు దేవతలతో ‘అట్లే’అని పలికి, గంగాదేవి కడకు వెళ్ళి “ఓ దేవీ! గర్భమును ధరింపుము. ఇది దేవతలకు హితమొనర్చు కార్యము” అని నుడివెను. అప్పుడు గంగ ఆయన మాటలను విని దివ్యమైన స్త్రీ రూపమును ధరించెను. అగ్ని ఆమె సౌందర్యాతిశయమును జూచి, శివతేజమును ఆమెయందంతటను వ్యాపింపజేసెను.

ఓ రఘునందనా! అగ్ని ఆమెపై వ్యాపింపజేసిన శివతేజముతో గంగా ప్రవాహములన్నియును నిండిపోయెను. ఆ అగ్ని తేజస్సుయొక్క తాపమునకు తట్టుకొనలేక గంగాదేవి సర్వ దేవతలకును పురోహితుడైన అగ్నిదేవునితో “క్షణక్షణమునాకును బలీయమగుచున్న నీ తేజస్సును ధరింపలేకయున్నాను” అని పలికెను.

సర్వదేవతల కొరకై సమర్పించెడి ఆహుతులను స్వీకరించునట్టి అగ్నిదేవుడు గంగతో “ఓ దేవీ! ఈ శ్వేత పర్వతప్రదేశమున నీ గర్భమును ఉంచుము’ అని యనెను. మహా తేజస్వివైన ఓ పుణ్యపురుషా! రామా! గంగాదేవి అగ్నిదేవుని మాటలను పాటించి, మిక్కిలి తేజోరాశియైన ఆ గర్భమును తన ప్రవాహములనుండి అచట వదలెను. గంగానది గర్భమునుండి వెడలిన తేజస్సు మేలిమి బంగారము వలె కాంతిమంతమై యుండెను.

కనుక ఆ తేజస్సు ఉంచబడిన భూమియు, అచటి వస్తువులన్నియును సువర్ణమయములాయెను. ఆ పరిసరములన్నియును రజిత మయములై నిరుపమానమైన కాంతితో వెలుగొందెను. ఆ తేజస్సు యొక్క తీక్ష్ణత్వము వలన రాగి ఇనుము పుట్టెను. ఆ రేతస్సు యొక్క మలము తగరము, సీసము ఆయెను. ఈవిధంగా ఆ తేజస్సు భూమిని జేరి, వివిధ ధాతువులుగా రూపొందెను.

ఆ గర్భము భూమిపై ఉంచబడగానే దాని తేజః ప్రభావముచే ఆశ్వేతపర్వతమూ, అందలి శరవణమూ(రెల్లుగడ్డి) సువర్ణమయములై తేజరిల్లసాగెను. పురుష శ్రేష్ఠుడైన ఓ రాఘవా! అగ్నితో సమానమైన కాంతి గల ఆ బంగారము అప్పటినుండియు ‘జాతరూపము’ అను పేరుతో ప్రసిద్ధికెక్కెను. అచటి తృణములు, వృక్షములు, లతలు, పొదలు మొదలగునవి అన్నియును స్వర్ణమయములాయెను.

తదనంతరము అచట జన్మించిన కుమారునకు పాలిచ్చి పోషించుటకై, ఇంద్రుడు, మరుద్గణములు మొదలగు దేవతలు ఆరుమంది కృత్తికలను నియోగించిరి. “ఈబాలుడు మా అందరి యొక్క పుత్రుడగును” అని ఆ కృత్తికలు దేవతలతో ఒప్పందము చేసుకొనిరి. పిమ్మట ఆ నిశ్చయముతో అప్పుడే పుట్టిన ఆ శిశువునకు పాలియ్యసాగిరి. అంత దేవతలందరును “ఈ బాలకుడు కార్తికేయుడు అను పేరుతో ముల్లోకముల యందును ఖ్యాతికెక్కును. ఇందు సంశయము లేదు” అని పలికిరి.

గంగాద్వారా అచటికి చేరిన శివతేజస్సు యొక్క ప్రభావమున పుట్టిన ఆ బాలుడు అగ్నివలె వెలుగొందుచుండెను. దేవతలా మాటలను విని, వారి ఆదేశమును అనుసరించి, కృత్తికలు ఆ బాలకునకు స్నానము చేయించిరి. ఓ కాకుత్స్థా! గంగాదేవి గర్భమునుండి స్ఖలితుడైనందున దేవతలు అగ్నితుల్యుడై, కారణజన్ముడైన ఆ మహానుభావుని ‘స్కందుడు’ అని పిలువసాగిరి.

కృత్తికల పోషణ వలన అతనికి ‘కార్తికేయుడు’ అనియు పేరు ఏర్పడెను. అప్పుడు ఆ ఆరుగురు కృత్తికల స్తనములలో సమృద్ధిగా పాలు ఏర్పడెను. ఆరు ముఖములు గలవాడై ఆ బాలుడు ఆ ఆరుగురి నుండి స్తన్యములను గ్రోలెను. సుకుమార శరీరుడైనను ఆ కుమారస్వామి ఒక దినము మాత్రమే వారినుండి పాలుద్రాగి, మహిమాన్వితుడై అతడు తన పరాక్రమము చేత రాక్షస సైన్యములను జయించెను.

దేవతలు అగ్నిదేవుని నాయకత్వమున సాటిలేని తేజస్వియైన ఆ బాలుని కడకు చేరి, అతనిని ‘దేవసేనాపతి’గా అభిషేకించిరి.

------------------------

పవిత్రమైన ఈ గాథను విన్నవారు ధన్యులగుదురు. కుమారస్వామి పై భక్తిగల మానవుడు ఈ లోకమున దీర్ఘాయుష్మంతుడై పుత్రపౌత్రులతో వర్ధిల్లును. తుదకు స్కంద సాలోక్య ఫలమును గూడ పొందును.

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

🌹🌹🌹🌹🌹




No comments:

Post a Comment